క్రీస్తు ఉత్థాన మహోత్సవము

 క్రీస్తు ఉత్థాన మహోత్సవము

క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును గొప్ప మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ. ఇది ఒక నిరీక్షణ పండుగ! ఈరోజు యేసుక్రీస్తు మరణమునుండి ఉత్థానమవుటను కొనియాడుచున్నాము. ఇది విశ్వాసులందరికి ఒక గొప్ప ఆశను, వారి  హృదయాలలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది.
క్రీస్తు ఉత్థానం, తిరుసభలో నాలుగు కారణాల చేత అతి గొప్పది, అతి ప్రాముఖ్యమైనది.
1. క్రీస్తు ఉత్థానం, మన విశ్వాసానికి మూలాధారము. అద్భుతాలలోకెల్ల ఉత్థానం మహాద్భుతం, ఎందుకంటే, ఉత్థానం క్రీస్తు దేవుడని మనకు నిరూపిస్తున్నది. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). “యేసు ప్రభువు” అని, “దేవుడు ఆయనను లేవనెత్తెను” అని రోమీ 10:9 లో చదువుచున్నాము. అపోస్తలుల యొక్క బోధనా సారాంశం: క్రీస్తు ఉత్థానం.
2. క్రీస్తు ఉత్థానం మన పునరుత్థానానికి హామీని ఇస్తుంది. లాజరు సమాధివద్ద మార్తమ్మతో యేసు వాగ్దానం చేసాడు, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26).
3. క్రీస్తు ఉత్థానం నిరీక్షణ పండుగ. ఈ లోకపు బాధలలో, దుఃఖాలలో, కన్నీళ్ళలో క్రీస్తు ఉత్థానం మనకు ఆశను, నిరీక్షణను, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ జీవితం విలువైనదని మనకు గుర్తుకు చేయుచున్నది. శోధనలకు, అనవసరమైన భయాందోళనలకు వ్యతిరేకముగా పోరాడే శక్తిని మనకు క్రీస్తు ఉత్థానం ఇస్తుంది.
4. మనం చేసే వ్యక్తిగత మరియు సంఘ ప్రార్ధనలకు క్రీస్తు ఉత్థానం అర్ధాన్నిస్తుంది. ఉత్థాన క్రీస్తు నిజముగా మన మధ్యన, మనచుట్టూ, శ్రీసభలో, దివ్యసంస్కారములో, పరలోకములో ఉన్నాడు అన్న మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
క్రీస్తు ఉత్థానమును మనం ఎందుకు విశ్వసిస్తున్నాము?
1. స్వయముగా క్రీస్తే తన ఉత్థానము గురించి, తన దైవత్వానికి సూచనగా సాక్ష్యమిచ్చాడు: (చదువుము మార్కు 8:31; మత్త 17;22-23; లూకా 9:22). యోహాను 2:19, “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును”.
2. ఈస్టర్ ఆదివారమున “ఖాళీ సమాధి కనుబడుట” (లూకా 24:3). సైనికులు అబద్ధసాక్ష్యము చెప్పినను (మత్త 28:13), అపోస్తలులు దొంగిలించారని చెప్పినను, అది అసాధ్యమని యూద పెద్దలకు బాగా తెలుసు.
3. ఉత్థాన క్రీస్తు దర్శనాలు. ఆరంభములో శిష్యులు, విశ్వాసులు అవిశ్వాసమును కలిగి యున్నను, ఉత్థాన క్రీస్తు దర్శనాల వలన, వారిలో విశ్వాసం కలిగింది. ఈ దర్శనాలు క్రీస్తు ఉత్థానమునకు బలమైన ఋజువుగా ఉంటుంది.
4. యేసు శిష్యులయొక్క పరివర్తన: యేసు సిలువ మరణం తరువాత, శిష్యులు భయముతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు (లూకా 24:21; యోహాను 20:19). క్రీస్తు ఉత్థానం, పవిత్రాత్మ అభిషేకం వారిలో పరివర్తన కలిగించాయి. ఇప్పుడు వారు ధైర్యముగా పునరుత్థాన క్రీస్తుకు సాక్ష్యులుగా మారారు (అ.కా. 2:24; 3:15; 4:2). పునరుత్థాన క్రీస్తు గురించి శక్తివంతముగా భోధించారు.
5. యూదులుగాని, రోమనులు గాని, క్రీస్తు పునరుత్థానానికి వ్యతిరేకముగా ఏవిధముగాను నిరూపించలేక పోయారు. యేసు మృత దేహాన్ని చూపించలేక పోయారు.
6. క్రీస్తు ఉత్థానం కానిచో, అపోస్తలులు గాని, తొలి క్రైస్తవులుగాని అంత ధైర్యముగా బోధించేవారు కాదు, చివరికి తమ ప్రాణాలను సైతము అర్పించే సాహసం చేసియుండేవారు కాదేమో!
7. అపోస్తలుడు పౌలు పరివర్తన, హింసించే సౌలునుండి ఉత్థాన క్రీస్తుకొరకు ఉత్సాహపూరిత బోధకుడిగా మారడం, క్రీస్తు ఉత్థాన సత్యాన్ని బలపరుస్తుంది (గలతీ 1:11-17; అ.కా. 9:1, 24-25; 26:15-18).
8. మొదటి మూడు శతాబ్దాలు, క్రీస్తు కొరకు వేద హింసలను ధైర్యముగా ఎదుర్కొని నిలబడింది, జీవించ గలిగింది తొలి శ్రీసభ. ఇది నిజముగా క్రీస్తు ఉత్థానాన్ని సమర్ధిస్తుంది.
పాస్క పరమ రహస్యం - యేసు ఉత్థానం
"ఆయన పునరుత్థానుడయ్యెను"  - మార్కు 16:6; “నజరేయుడగు యేసు పునరుత్థానుడయ్యెను! మీరు వెళ్లి పేతురునకు, తక్కిన శిష్యులకు చెప్పుడు!” (మార్కు 16:1-7). ఆదివార వేకువజామున, యేసు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో [మగ్ధలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ] తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడిప్రక్కన కూర్చుండి యున్న ఒక యువకుడు [దేవదూత - మత్త 28:5; ఇరువురు పురుషులు లూకా 24:4] ఈ మాటలను చెప్పెను. ఇదొక శుభ సమాచారము! సంతోషకరమైన వార్త! స్త్రీలు ఆ శుభవార్తను పేతురునకు, ఆయన సోదరులకు చెప్పారు. ఆ తరువాత, ఈ శుభవార్తను, పేతురు లోకమంతటికి తెలియజేసాడు. 
50 రోజుల తరువాత, పేతురు ఈ శుభసమాచారాన్ని "యూదయా జనులకు, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులకు", (అ.కా. 2:14), లోకమంతటికి చాటి చెప్పాడు: "నజరేయుడైన యేసును... దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22, 32).
యేసు ఉత్థానం గురించి చాటిచెప్పాలంటే, దైవానుగ్రహం ఉండాలి: "పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు 'యేసే ప్రభువు' అని అంగీకరింప జాలడు" (1 కొరి 12:3). యేసు ఉత్థానం గురించి ప్రకటించాలంటేవినయం, దైవభీతి ఉండాలి. క్రీస్తు ఉత్థానం గురించి మనమందరం భయపడక, ధైర్యముగా ప్రకటించాలి: "విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్టుడు, గెలుపొందినాడు" (దర్శన 5:5). యేసు పునరుత్థానం గురించి చెప్పుటకు, మనకు మాటలు చాలవు! సిలువ ప్రబోధము నుండి, ఉత్థాన ప్రబోధం చేయడమంటే, ఎండిన నేలనుండి, సముద్ర తీరమునకు పరుగులు తీయడం లాంటిది! "మగ్ధలా మరియమ్మ సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి" (యోహాను 20:2), ఖాళీ సమాధి గురించి చెప్పగా, "పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తు చుండిరి" (యోహాను 20:3).
యేసు ఉత్థాన అనుభూతిని పొందిన మనం, కీర్తనకారునితో కలిసి, "నా ఆత్మమా! మేలుకొనుము! వీణ తంత్రీ వాద్యము మేల్కొనును గాక! నేను ఉషస్సును మేలుకొల్పెదను" (కీర్త 57:8) అని ఎలుగెత్తి పాడాలి. "భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడ నక్కరలేదు. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు" (కీర్త 46:2-3, 8). దేవుడు చేసిన "మహాకార్యములు" అన్నియు, క్రీస్తు ఉత్థానములో పరిపూర్తి అయ్యాయి. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). ఉత్థాన క్రీస్తు, తలుపులు మూసి యున్నను, యేసు లోపలి వచ్చి శిష్యుల మధ్య నిలువ బడెను (యోహాను 20:19). మూసియున్న మన హృదయాలలోనికి, సంస్కృతిలోనికి, ఆయనను తిరస్కరించే నాస్తిక పాలనలోనికి, మూసియున్న మన స్నేహాలలోనికి, కుటుంబాలలోనికి, సంఘములోనికి... ఉత్థాన క్రీస్తు రావాలి. ఏదీకూడా మృత్యుంజయుడైన యేసును ప్రతిఘటించలేదు; మూసియున్న తలుపులున్నను, గోడల ఆవలినుండి ఆయన ప్రవేశించును. క్రీస్తు ఉత్థానం యుగాంతముల వరకు, ఆయన మరల తిరిగి వచ్చువరకు కొనసాగుతుంది. “ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము" అని ప్రతీ దివ్యపూజా బలిలో మనం ప్రకటించు విశ్వాస రహస్యమును ఏదియు కూడా ఆపలేదు.
క్రీస్తు ఉత్థానం - పాస్క పరమ రహస్యము
క్రీస్తు ఉత్థానం చారత్రక సంఘటన. ఇదొక అపూర్వమైన, పునరావృతం కాని సంఘటన. ఈ అద్భుతమైన సంఘటనను, ప్రతీరోజు దివ్యసంస్కారమైన దివ్యపూజాబలిలో జ్ఞాపకార్ధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు ఉత్థానం క్రైస్తవుల విశ్వాసము. క్రీస్తు శ్రమలు, ఉత్థానం పాస్క పరమ రహస్యమును ఏర్పరచు చున్నాయి. అయితే, రెండు వేరువేరు సంఘటనలు కాదు. ఒకే సంఘటన - మరణమునుండి జీవమునకు.... క్రీస్తు నిజముగా ఉత్థానమైనారా? “ప్రభువు వాస్తవముగ (ontos - నిజముగానే) సజీవుడై లేచెను. “వాస్తవమును గ్రహించుటకు ఈ గ్రంథమును వ్రాయుచున్నాను" (1:4) అని లూకా సువార్తీకుడు తెలుపుచున్నారు. క్రీస్తు శ్రమలు, మరణం తరువాత, శిష్యులలోనున్న వెలుగు మాయమయింది. ఆయనను వారు దేవుని కుమారుడని విశ్వసించారు. ప్రవక్తలందరికంటే గొప్పవాడని విశ్వసించారు. కాని ఇప్పుడు వారికి ఏమి చేయాలో తోచలేదు. వారి మనసులలోని భావాలను లూకా ఇలా తెలిపాడు: "అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు రోజులాయెను" (24:21). అంతా అయిపోయిందని వారు భావించారు.
పేతురు క్రీస్తు ఉత్థానం గూర్చి చెబుతూ, "విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింప బడిన రాయియే మూలరాయి ఆయెను" (1 పేతు 2:7) అని తెలిపాడు. పేతురు పవిత్రాత్మతో పూరితుడై, "యేసు క్రీస్తునందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” (అ.కా. 4:12) అని నాయకులకు, పెద్దలకు సమాధానమిచ్చాడు. భయముతో పారిపోయిన శిష్యులు, విశ్వాసం సన్నగిల్లిన శిష్యులు, ఆ తరువాత ధైర్యముగా "యేసు ఉత్థానమాయెను" అని ప్రకటించారు. యేసు పేరిట సంఘములను స్థాపించారు. యేసు కొరకు, హింసలను భరించుటకు, ప్రాణములను సైతము త్యాగము చేయుటకు సిద్ధపడ్డారు. 
పౌలు సాక్ష్యం
క్రీస్తు పునరుత్థానమును గూర్చిన ప్రారంభ సాక్ష్యం పునీత పౌలు 1 కొరి 15:3-8లో చూడవచ్చు:
“నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవముగ లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆపైన యాకోబునకు తదుపరి అపోస్తలుల కందరికిని ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను."
పౌలు ఈ వాక్యాలను క్రీ.శ. 56 లేదా 57లో వ్రాసారు. ఈ సాక్ష్యాన్ని పౌలు ఇతరులనుండి స్వీకరించాడని చెప్పాడు. బహుశా, పౌలు తన పరివర్తన తరువాత పొందినట్లయితే, ఈ సాక్ష్యాన్ని మనం క్రీ.శ. 35 నాటిదని చెప్పవచ్చు. నిజానికి చాలా ప్రాచీన సాక్ష్యము. ఈ సాక్ష్యములో ఉన్న రెండు ప్రాథమిక వాస్తవాలు: "యేసు సజీవముగ లేవనేత్తబడెను" మరియు "ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను."
"యేసు సజీవముగ లేవనేత్తబడెను" (గ్రీకు: egegertai) అనగా "తిరిగి జీవం పోసుకున్నారు", "మరల లేచారు", "పునరుత్థానం చెందారు", "పునర్జీవం పొందారు" అని అర్ధం. ఆయన పునర్జీవం లాజరువలె మరల మరణించుట వంటిది కాదు.
"ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను" (ophthe) అనగా తననుతానుగా ఇతరులకు కనిపించారు; "మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము" (అ.కా. 4:20) అని పేతురు, యోహానులు బదులు పలికారు.
సువార్తలు - క్రీస్తు ఉత్థానం
యేసు లేవనెత్తబడెను మరియు దర్శనమిచ్చెను, అయితే సువార్తలలో 'ఖాళీ సమాధి' గురించిన అంశం జోడించబడినది. ఖాళీ సమాధిని బట్టియే, యోహాను సువార్తీకుడు యేసు ఉత్థానమునకు ప్రత్యక్ష సాక్ష్యముగా వ్యక్తపరచాడు (యోహాను 20:3f.): నార వస్త్రములు అచట పడియుండుట, తలకు కట్టిన తుండుగుడ్డ నారవస్త్రములతో పాటుకాక, విడిగ చుట్టి ఉండుట.... అలాగే, ఉత్థాన క్రీస్తు దర్శనాలు ఆయన ఉత్థానమునకు సాక్ష్యాలు.
క్రీస్తు ఉత్థానం- విశ్వాసం
క్రీస్తు ఉత్థానమును విశ్వాసముతో అర్ధము చేసుకోవాలి. చారిత్రక సంఘటనలు (ఖాళీ సమాధి) వారి విశ్వాసాన్ని బలపరచాయి, కనుక విశ్వాసం ప్రధానం. "క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్త బడెను" (1 కొరి 15:20) అని పౌలు చెప్పారు. అలాగే, "క్రీస్తే లేవనెత్త బడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14). “మన ప్రభువగు యేసును మృతులలోనుండి లేవనెత్తిన ఆయనయందు మనకు విశ్వాసమున్నది” (రోమీ 4:24).
పెంతకోస్తు అనంతరం, పేతురు యెరూషలేము ప్రజలకు, "ఇస్రాయేలు ప్రజలారా! ఈ మాటల నాలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా, దేవుడు మీకు రూడి ఒనర్చెను... యేసును మీరు న్యాయ రహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. కాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపేను. మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22-32) అని బోధించాడు.
పౌలు ఏతెన్సులో, 'దేవుడు మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను” (అ.కా. 17:31) అని ప్రచారం చేసాడు. "మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో, నీవు రక్షింప బడుదువు" (రోమీ 10:9). ఉత్థానము వలన, యేసు “ప్రాణ దాతయగు ఆత్మ”గా మారెను (1 కొరి 15:45).
క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన పండుగ! ఎందుకన మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాము. మరణం శాశ్వత ముగింపునకుగాక, నిత్యజీవితానికి ద్వారముగా యేసు చేసియున్నారు. మరణం, మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రియైన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశము. ఈస్టర్ మహోత్సవం, అంధకారములోనున్న వారికి వెలుగును, బాధలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్టశక్తులతో పోరాడే వారికి ధైర్యమును, బలమును ఒసగును.
జీవిత పాటాలు
1. ఉత్థాన క్రీస్తు ప్రజలుగా, విశ్వాసులుగా జీవిద్దాం. పాపము, చెడు అలవాట్లు, వ్యసనాలు, నిరాశ, నిరుత్సాహం, సందేహాలు అనే సమాధిలో మనం ఉండకూడదు, సమాధి చేయబడకూడదు. దానికి బదులుగా, ఉత్థాన క్రీస్తు యొక్క సంతోషముతో, శాంతి సమాధానాలతో జీవించాలి. మన అన్ని సమస్యలలో, ఉత్థాన ప్రభువు ఉన్నాడని గుర్తించాలి.
2. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం, మనతో, మనలో, మనచుట్టూ ఉన్నదని విశ్వసించాలి. అది మనం మంచి, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించేలా మనలను బలపరుస్తుంది. ఈ విశ్వాసం మన ఆలోచనలను, కోరికలను, మాటలను, ప్రవర్తనను, క్రియలను నియంత్రించేలా చేస్తుంది.
3. మనలో ఉత్థాన ప్రభువు యొక్క సాన్నిధ్యం ఉన్నదని గుర్తించిన యెడల, మన శరీరాలను, మనస్సులను నిర్మలముగా, పవిత్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరముగా ఉంటాము. ఎదుటి వారిని గౌరవిస్తాము. వారిని ప్రేమిస్తాము. వినయపూర్వకమైన నిస్వార్ధ సేవలో జీవిస్తాము.
4. మనం పారదర్శక క్రైస్తవులుగా మారాలి. మన చుట్టూ ఉత్థాన క్రీస్తు వెలుగును ప్రసరింప జేయాలి. నిస్వార్ధమైన, త్యాగపూరితమైన ప్రేమ, దయ, కరుణ, వినయము, సేవ కలిగి జీవించాలి. క్రైస్తవ దాతృత్వం, దయ, క్షమాపణ కలిగి జీవించాలి.

5 వ సామాన్య ఆదివారము, Year B

 5 వ సామాన్య ఆదివారము, Year B
యోబు 7:1-4; 6-7, భక్తి కీర్తన 147; 1-6, 1 కొరి 9:16-19, 22-23; మార్కు 1: 29-39
"రండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకన, ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త."
"అందరు మిమ్ము వెదకుచున్నారు" (మార్కు 1:37 ) - ప్రార్ధన ప్రాముఖ్యత

ఉపోద్ఘాతము: శ్రమల అంతర్యము

బాధలు మన జీవితములో అనివార్యము. ఈలోక బాధలలో చివరిది మరియు తీవ్రమైనది మరణం. నాశనం చేయబడ వలాసిన చివరి శత్రువు మృత్యువు (1 కొరి 15:26). మన బాధలలో మనం అశక్తులం. అందుకే, మన బాధలకు అర్ధాన్ని వెదకుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించు వారైన మన బాధలకు, క్రీస్తు శ్రమలు అర్ధాన్ని చేకూర్చుతున్నాయి. బాధలను, మరణాన్ని జయించుటకు క్రీస్తు ఒక రక్షకునిగా ఏతెంచాడు. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే గాక, సంపూర్ణ వ్యక్తిని స్వస్థత పరచును. అంతర్గత స్వస్థత, పాపమన్నింపు ఆయన ప్రేషిత కార్యాలు. మన బాధల ఉపశమనము కొరకు, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసికొనును. అయినప్పటికిని, బాధలను ఆయన అనుమతించును. "దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (చూడుము యో 9:1-3). బాధలలోనున్న వ్యక్తి, దేవున్ని వెదకుటకు ప్రయత్నిస్తాడు.

మొదటి పఠనం - శ్రమలను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఈనాటి మొదటి పఠనం యోబు జీవిత గాధనుండి వింటున్నాం. యోబు ఆయన జీవితములో ఎన్నోకష్టాలను, బాధలను అనుభవించాడు. ఆయన పొందే బాధలను మాటలలో వ్యక్తపరస్తున్నాడు. తన స్నేహితులు ఆయన విడచిపోయారు. యోబు పాపం చేసాడని ఒకరు, పశ్చాత్తాప పడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరొకరన్నారు. చివరికి, ఆయన భార్యకూడా శంకించింది. 'దేవున్ని శపించి మరణింపుము' అని కోరింది. కాని, యోబు, "దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి. కీడులను పంపినపుడు మాత్రము స్వీకరింప వలదా?" అని ప్రశ్నించాడు. ఆవిధముగా, బాధలలోనే యోబు ఇంకా ఎక్కువగా దేవున్ని వెదికాడు, ప్రార్ధించాడు. ఆయనకు మరింత దగ్గరయ్యాడు. యోబు విశ్వాస ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చాడు.

మనముకూడా, మన కష్టాలకు, బాధలకు కృంగి కృశించక, ఆధ్యాత్మిక హృదయముతో, వాటిద్వారా దేవుడు మనకి అందిస్తున్న సందేశాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. బాధలలో, ప్రభువు మనలను పరిశుద్ధులను చేయుచున్నాడా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా / బలపరుస్తున్నాడా? మన నిలకడను పరీక్షిస్తున్నాడా? మన దైవ/సోదరప్రేమను పరీక్షిస్తున్నాడా? మనం తప్పక గ్రహించాల్సిన విషయం, 'ప్రార్ధనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెదకిన వారికి సరియైన సమాధానం దొరకును'.

సువిశేష పఠనము: శ్రమలలో ప్రభువును వెదకాలి

ఈనాటి సువిశేష పఠనములోకూడా, కష్టాలలో, బాధలలోనున్న ప్రజలందరు ప్రభువు కొరకు వెదకుచున్నారు. ప్రార్ధనా మందిరములో అధికారపూర్వకముగా బోధించి, అపవిత్రాత్మ ఆవేశించిన వానిని స్వస్థత పరచి, ఇంకా మరెంతోమందిని స్వస్థత పరచాడు. వేకువ జామున, ఒక నిర్జన ప్రదేశమున ప్రార్ధన చేయుచుండగా, సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, "అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పారు.

ప్రార్ధన జీవితముతో ప్రభువును వెదకాలి: ఈ రోజుకి కూడా, అందరు ఆయన కొరకు వెదకుచున్నారు. మన కష్టాలు, బాధలు ఎంతవైనను, ఆత్మశక్తితో వాటన్నింటిని జయించవచ్చు. దేవుని కృపవలన, యేసు నామమున ఎలాంటి బాధలనైనను ఎదుర్కొనవచ్చు. దేవునినుండి మనం ఎన్నో అనుగ్రహాలను పొందియున్నాము. ఏదీ ఆశించకుండా, ఇతరులతో ఆ వరాలను పంచుకొందాం. మన జీవితానికి ఓ అర్ధాన్ని చేకూర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్ధనతో కూడిన జీవితం, దేవునికి దగ్గరగా చేరు జీవితం, ఇతరులతో పంచుకొను జీవితం, స్వస్థత, పశ్చాత్తాపముతో కూడిన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనుటకు యేసు ప్రతిదినం ప్రార్ధన చేసాడు. ఆయన ప్రార్ధానా మందిరములలో, అలాగే ఏకాంత ప్రదేశాలలో ప్రార్ధన చేసాడు. యేసు ప్తరభువుకు కూడా, తన ప్రేషితకార్యములో ప్రార్ధన ఎంతో ప్రధానమైనది. దేవుని కుమారుడైనప్పటికినీ, ప్రార్ధన అవసరత, తండ్రి దేవునితో సంభాషించడం ఎంతో అవసరమని గుర్తించాడు. మరి మనికింకా ఎంత అవసరమో గుర్తించాలి!  అందులకే, దైవచిత్తాన్ని తెలుసుకొనుటకు, ప్రభువు మనకు కూడా ప్రార్ధన నేర్పించాడు. 

మన జీవిత అంధకారమునుండి బయటపడుటకు ప్రార్ధన ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తానుచరులుగా, క్రీస్తువలే మారుటకు ప్రయత్నంచేద్దాం. తండ్రి చిత్తం, ప్రభువు కార్యమైనప్పుడు, అదే దేవుని చిత్తం, ప్రభువు కార్యం, మన కార్యముకూడా కావలయును. తండ్రితో ప్రభువు ఇలా ప్రార్ధించాడు: "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని" (యో 17:4). మనతో ప్రభువు ఇలా అంటున్నాడు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెడల ప్రకాశింపనిండు" (మ 5:16).

ప్రభువు ప్రేషిత కార్యములో మనమూ భాగస్తులమే. తండ్రి కుమారున్ని పంపినట్లే, మనలను కూడా పంపియున్నాడు. "నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యో 14:12).

రెండవ పఠనము - శ్రమలలో పౌలు ఆదర్శం

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఇలా అంటున్నారు, "ఈ పనిని (సువార్తా బోధన) నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని, ఇది నా విధి అని భావించినచో, నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్ధము (1 కొరింతి 9:17). పౌలుగారు యేసువలెనె దైవకార్యాలను చేసియున్నాడు. అన్ని ఇబ్బందులను, బాధలను ధైర్యముతో ఎదుర్కొని, సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పించాడు. యో 9:4 లో ప్రభువు చెప్పిన మాటలను తన జీవితములో పాటించాడు: "పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పని చేయలేడు." మనం ఏ పని చేసిన ప్రభువు పేరిట చేసినచో ఆనందాన్ని పొందగలము. ప్రతీది ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మ 11: 28).

వరప్రసాదముల మాత మహోత్సవము

 వరప్రసాదముల మాత మహోత్సవము

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28).

దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము!



వరప్రసాదముల మాత పేరిట శ్రీసభలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి. ఈ దేవాలయాల ద్వారా స్థానిక శ్రీసభ మరియతల్లి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలియ జేస్తారు. మరియద్వారా వరప్రసాదమైన క్రీస్తును మనం పొందుకొనుచున్నాము. ముందుగా మరియమ్మను వరప్రసాదముల మాత అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, పునీత పౌలుగారు చెప్పినట్లుగా, “సర్వమానవాళి రక్షణకై ‘దేవుని కృప’గా ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఆ దేవుని కృప ఎవరో కాదు, సత్యము, జీవము, మార్గము అయిన యేసుక్రీస్తు ప్రభువే. మరియ ఆ ‘దేవుని కృపకు’ తల్లి. అందుకే ఆమె క్రుపానుగ్రహ మాత లేదా వరప్రసాదాల మాత. ఈవిధముగా, దేవుడు వాగ్ధానము చేసిన కృప యేసుక్రీస్తు. ఆ దేవుని కృపకు మానవ శరీరాన్ని ఒసగిన మాతృమూర్తి కనుక, మరియ ‘దైవకృప’కు తల్లి అని ఖచ్చితముగా చెప్పగలము. యోహాను సువార్తీకుడు కూడా క్లుప్తముగా “క్రీస్తు కృపాసత్యములతో నిండెను” అని సూచించాడు (1:14). యేసుక్రీస్తు “దేవునికృపకు” పాత్రురాలుగా ఉండుటకు, ఆమెను “అనుగ్రహ పరిపూర్ణురాలుగా” (లూకా 1:28) చేసాడు దేవుడు. కనుక, “దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము” అని ప్రార్ధించి నపుడెల్ల, దేవుని పరిపూర్ణ జీవితమును మరియ కలిగియున్నదని చెబుతున్నాము.

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28): దేవుని సందేశమును, చిత్తమును, ప్రణాళికను తెలియజేయువారు దేవదూతలు. దేవుని సందేశానికి స్పందించాలని, సమాధాన మివ్వాలని ఆహ్వానిస్తారు. దేవుని సందేశానికి స్పందించడం చాలా ప్రధానం. పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వడం అతిప్రాముఖ్యము. మత్త 1:18-25లో ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దేవుని ఆజ్ఞను తెలియజేయగా, యోసేపు అటులే చేసాడు. లూకా 1:5-25లో జెకర్యాకు దేవదూత ప్రత్యక్షమై, దేవుని సందేశమును తెలియ జేసెను. జెకర్యా ఆరంభములో స్పందించక పోయినను, నెమ్మదిగా దేవుని చిత్తమును గ్రహించి అటులనే చేసాడు. అలాగే, లూకా 1:26-38లో గబ్రియేలు దేవదూత కన్యక మరియమ్మ దగ్గరకు పంపబడెను. ఆ వృత్తాంతాన్ని ధ్యానిస్తూ, మరియ ఎలా వరప్రసాదముల మాత అయినదో తెలుసుకుందాం!

మరియ “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని బైబులు గ్రంథం చెబుతుంది (లూకా 1:28). మరియను మాత్రమే ఇలా పిలువబడి యుండటం చూస్తాము. ఇది దేవుని కుమారునికి తల్లిగా ఆమె ఎన్నికను సూచిస్తుంది. అలాగే, మరియకు “దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగినట్లు” (ఎఫెసీ 1:3) సూచిస్తుంది. “అనుగ్రహ పరిపూర్ణురాలు” అనగా మరియ దేవుని జీవముతో, సాన్నిధ్యముతో నింపబడినది అని అర్ధం. దేవుని సాన్నిధ్యముతో పరిపూర్ణముగా నిండియున్నది కనుక, ఆమెలో పాపమునకు ఎలాంటి చోటు లేదు. ఆమె నిష్కళంక మాత. అదియే కృపావరం, వరప్రసాదము. మరియమ్మ వరప్రసాదముల మాత, ఎందుకన “కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి” (యోహాను 1:17). యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చును; ఆ కృపానుగ్రహం (యేసుక్రీస్తు) మరియమ్మ ద్వారామన యొద్దకు వచ్చును. అందుకే ఆమె వరప్రసాదముల మాత, అమ్మ! వరప్రసాదముల మాతగా మరియమ్మను ధ్యానించినపుడు, ఆమె మనకు ఆ దేవుని కృపను గురించి, ప్రాముఖ్యత గురించి మనకు బోధిస్తుంది.

వరప్రసాదము అనగా ఏమి?

కృపావరం, వరప్రసాదము అనగా “దేవుని బిడ్డలమగుటకు, దత్తపుత్రులమగుటకు, దేవుని స్వభావములో, శాశ్వత జీవనములో భాగస్వాములమగుటకు పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వటానికి ఆయన అందించే వరప్రసాదం, ఉచితార్ధం, అర్హతకు తగని సహాయమే కృపావరం (grace) అని, దేవుని జీవనములో పాలుపంచుకోవటమే కృపావరం అని సత్యోపదేశం (నం. 1996, 1997) బోధిస్తుంది. దైవకుమారుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుకు తల్లి కావడానికి “ఆ పాత్రకు తగిన వరాలతో” దేవుడు ఆమెను దీవించాడు (సత్యోపదేశం, 490). మరియమ్మ దేవునితో లోతైన, స్థిరమైన, అతిసన్నిహిత సంబంధములో జీవించినది. దేవుని చిత్తానికి స్పందించక పూర్వమే దేవుడు ఆమెతో ఉన్నాడు – “ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అని గాబ్రియేలు దూత పలికింది. మరియమ్మ దేవున్ని ఎన్నుకొనక మునుపే, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అని అర్ధమగు చున్నది.

మనమే దేవున్ని ఎన్నుకున్నామని కొన్నిసార్లు తప్పుగా భావిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని యేసుక్రీస్తు యోహాను 15:16లో తన శిష్యులకు స్పష్టం చేసియున్నారు, “మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని”. కనుక, మనం దేవుని అనుగ్రహముచేత నింపబడి, నడిపింప బడుచున్నాము. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనమే ఆయనతో ఉండటము లేదు. తన ప్రేమచేత (యోహాను 3:16) దేవుడే మన చెంతకు వస్తారు, మనలను చేరదీస్తారు. ప్రభువే తన అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. మనము కేవలము ఆ దైవానుగ్రహాన్ని, కృపానుగ్రహాన్ని స్వీకరించు వారము మాత్రమే. ఆ కృపయే, మన మాటలో, చేతలో దేవునికి ప్రతిస్పందించడానికి, సమాధాన మివ్వటానికి, ‘అవును’ అని చెప్పటానికి కదిలిస్తుంది. దేవుడు “ఇమ్మానుయేలు” మనతో ఉన్నాడు. దేవుడు తన ప్రేమానుగ్రహములకు స్పందిస్తూ మన సమాధానం కొరకు ఎదురుచూచు చున్నాడు.

దేవుని కృపకు, అనుగ్రహమునకు సమాధాన మివ్వడములో, మనం మరియమ్మనుండి ఎంతో నేర్చుకోవచ్చు. గబ్రియేలు దూతతో మరియమ్మ అనుభవం మన అనుదిన జీవితములో ఎన్నో పాటాలను నేర్పుతుంది. మన జీవితములో కూడా దేవదూతలను గుర్తించడానికి, ఎలా ప్రతిస్పందించాలో నేర్చుకోవడములో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని అనుగ్రహాన్ని విశ్వసించువారికి నేటికీ దేవదూతలు ప్రత్యక్ష మవుతారు, కనిపిస్తారు, దేవునిచేత పంపబడతారు. అయితే, దానికొరకై మనం ఆధ్యాత్మిక కన్నులను తెరవాలి. దేవుని మంచితనము వలన, మరియతల్లి దేవుని కృపతో సహకారము వలన, మనము కూడా దేవుని కృపతో జీవించ గలుగుచున్నాము. మనం ఎల్లప్పుడు దేవుని కృపతో సహకరించాలి. పాపమును, సాతానును, దాని దుష్క్రియలను త్యజించాలి. పవిత్రముగా జీవించాలి. ఏడు దివ్యసంస్కారములు కూడాను ముఖ్యముగా జ్ఞానస్నానము, దివ్యసత్ప్రసాదము, పాపసంకీర్తనములు మనకు దేవుని కృపను ఒసగు మార్గాలు.

లూకా 1:26లో “తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను” అని చూస్తున్నాము. దేవదూతల ప్రత్యక్షత ఒక నిర్దిష్ట సమయములో జరుగునని లేదా దేవుడు నిర్ణయించిన సమయములో జరుగునని స్పష్టమగు చున్నది. మన స్వంత జీవితాలలో కూడా దేవుడు జోక్యం చేసుకోవడానికి తాను ఎంచుకున్న నిర్దిష్ట సమయములో తన దేవదూతలను పంపుతారు. అలాగే, లూకా 1:27లో “ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను” అని చదువుచున్నాము. అనగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి (మరియ) దగ్గరకు పంపబడెను. ఆ వ్యక్తి రోజువారి జీవితములోని వాస్తవ పరిస్థితులలో, మానవ సంబంధాల మధ్యన పంపబడెను. దూతలు దేవుని సందేశాన్ని కలిగి ఒక నిర్దిష్ట సమయములో, ఒక నిర్దిష్ట పరిస్థితి అవసరతలో పంపబడతారు. “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అను దేవదూత శుభవచనము, దేవునితో సంబంధములోనికి ఆహ్వానిస్తున్నట్లుగా యున్నది. దూత పలుకులు చాలా నిర్దిష్టముగా ఉన్నాయి. మరియమ్మను ఆమె హీబ్రూ పేరుతో సంబోధించడం చూస్తున్నాము. అనగా దేవదూత పంపబడక మునుపే దేవునకు మరియమ్మ వ్యక్తిగతముగా తెలుసు మరియు ఆమెతో సత్సంబంధాన్ని కలిగియున్నాడని అని అర్ధం. అలాగే మనతో కూడా దేవుడు ప్రవర్తించును. గొప్ప హీబ్రూ కీర్తన కారుడు దావీదు పాడినట్లుగా:

“నాలోని ప్రతి అణువునునీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొంచించితివి.
నీవు నన్ను అద్భుతముగ కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును.
నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఈ అంశము నాకు బాగుగా తెలియును.
నేను రహస్య స్థలమున రూపము తాల్చినపుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనపుడు
నీ కంటికి మరుగై యుండలేదు.
నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింప బడిన రోజులన్నియు
అవి ఇంకను ప్రారంభము కాకమునుపే, నీ గ్రంథమున లిఖింపబడి యున్నవి” (కీర్త 139:13-16).

          మరియమ్మను “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని దేవదూత సూచించినది. ఆమె నిజముగానే దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినది. పరలోక భూలోకముల ప్రభువు ఆమెను సారవంతమైన నేలగా సిద్ధంచేసి, ఎంచుకొని, తన వాక్యమగు విత్తనాన్ని నాటాడు. ప్రభువు మాటలకు, చిత్తానికి, ప్రణాళికకు ప్రతిస్పందించినపుడు, సమాధానం ఇచ్చినపుడు, మనము కూడా దేవుని అనుగ్రహముచేత నింపబడతాము. మన మనస్సులు పవిత్రముగా యున్నచో, యేసుక్రీస్తు మనలో కూడా జన్మిస్తాడు. ఆధ్యాత్మికముగా ఆయన మనలో వసిస్తాడు. బైబులులో మరియమ్మ గురించి చాలా తక్కువగా చెప్పబడింది. ఎందుకనగా, ఆమె తనకన్నా గొప్పవాడైన ప్రభువు యొక్క అద్దము, ప్రతిబింబము మాత్రమే కనుక! దేవుని అనుగ్రహముతో ఆమె నింపడినది. “ప్రభువు దాసురాలు” (లూకా 1:38) అయినది. పవిత్ర హృదయాలు కలిగిన సాధారణ ప్రజలను దేవుడు నూతన జీవితముతో నింపుతాడు. వారు దేవున్ని కలుసుకున్నప్పుడు, మరియమ్మవలె వారు దేవుని దయతో నింపబడతారు.

నజరేతు వాసియైన మరియమ్మ జీవిత సాక్ష్యముద్వారా పరమరహస్యము సులభతరం చేయబడింది. ఆమె ఫలభరితమైన జీవితాన్ని జీవించినది. పసిబిడ్డ అమాయకత్వము, మనస్తత్వముతోను జీవించినది. అందుకే ప్రభువు ఇలా అన్నారు, “ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము” (లూకా 10:21).

మరియమ్మ మనకు ఆదర్శమూర్తి: మరియమ్మ మనకు మార్గచూపరి. ఆమె దేవుని వాగ్దానాన్ని ఆలకించినది, విశ్వసించినది, అనుగ్రహముతో నింపబడినది, ప్రేమ స్వరూపుడైన దేవున్ని గర్భమున దాల్చినది. మనము కూడా ప్రార్ధన చేసినచో, దేవుని వాక్యాని, చిత్తాన్ని ఆలకించినచో, దేవునికి ‘అవును’ అని సమాధానం ఇచ్చినచో, మనముకూడా మరియమ్మవలె జీవించగలము. అలా చేసినప్పుడు, ‘దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు’ (లూకా 1:37) అని మరియమ్మవలె గుర్తించ గలము. మనము దేవుని అనుగ్రహముతో నింపబడి, యేసుక్రీస్తును ఇంకా అవసతలోనున్న ఈ లోకములోనికి, మరియమ్మవలె తీసుకొని రాగలము.

వరప్రసాదముల మాత చిత్ర పటము – చరిత్ర

శ్రీసభ ఆరంభము నుండి కూడా అద్భుత వరములు కలిగిన మరియమ్మ చిత్ర పటాలు, స్వరూపాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం, మొట్టమొదటిగా మరియమ్మ పటాన్ని గీసినది సువార్తీకుడు పునీత లూకాగారు. అనాధి కాలము నుండి కూడా కన్యమరియమ్మ చిత్రాలను, స్వరూపాలను ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది చేత పెయింటింగ్ చేయబడ్డాయి, రూపొందించ బడ్డాయి. వీటిలో కొన్ని, అద్భుత మధ్యస్థ వేడుదల ద్వారా ఎంతగానో ప్రసిద్ధి గాంచాయి. ఆలాంటి వాటిలో ‘వరప్రసాదముల మాత’ (అవర్ లేడి అఫ్ గ్రేస్) చిత్ర పటము ఒకటి. దీనిని ‘అవర్ లేడి అఫ్ బౌవ్డ్ హెడ్’ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రియా దేశములోని వియన్నా నగరములోని కార్మలైట్ ఆశ్రమ దేవాలయములో ఉన్నది.

          ఫాదర్ దోమినిక్ అను ఒక కార్మలైట్ సన్యాసి దీనిని రోమునగరములో 1610లో కనుగొన్నాడు. అతను కార్మలైట్ మఠముగా మార్చాలనుకుంటున్న ఒక పాడుబడిన ఇంటిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటిముందు నడుస్తూ ఉండగా ఒక చెత్తకుప్పలో పడియున్న మరియమ్మ చిత్ర పటము ఒకటి ఆయన కంట బడింది. ఇంత అందమైన చిత్ర పటాన్ని ఎవరు చెత్తకుప్పలో పడేసారు అని ఆశ్చర్యపోయి, బాధపడి మరియమ్మకు క్షమాపణలు చెప్పి, దానిని తీసుకెళ్ళి మఠములోని తన గదిలో పెట్టుకున్నాడు. ఒకరోజు పటముపై నున్న దుమ్మును తుడుస్తూ ఉండగా, మరియమ్మ ముఖము సజీవముగా, నవ్వుతూ కనిపించినది. ఇలా అనేకసార్లు ఫాదర్ దోమినిక్ గారికి కనిపించి, తన సందేశాలను వినిపించినది. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల కొరకు పూజా ప్రార్ధనలు పెట్టించాలని, నా బిడ్డలు రక్షణ పొందుటకు కావలసిన వరములను పొందునట్లు చేయుదునని తెలియ జేసింది. ఇంకా, నా సంరక్షణను కోరువారి, భక్తితో ఈ పటాన్ని గౌరవించేవారి ప్రార్ధనలకు సమాధానం, అనేక వరప్రసాదములను పొందుదురని, ముఖ్యముగా ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల విడుదల కొరకు ప్రార్ధించే వారి విన్నపాలకు ప్రత్యేక శ్రద్ధను చూపుతానని తెలియ జేసింది.

          అందుకే, ఫాదర్ దోమినిక్, ఆ చిత్ర పటాన్ని రోమునగరములోని ‘సాంత మరియ అల్లా స్కాల’ (Santa Maria alla Scala in Trastevere, Rome) దేవాలయానికి అనుబంధముగా నున్న పునీత చార్లెస్ చిన్న గుడిలో ఉంచాడు. అనేకమంది ఈ చిత్రపటము ముందు ప్రార్ధన చేసారు. అది అనేక వరప్రసాదములకు మూలం అయినది. ఫాదర్ దోమినిక్ మరణించు వరకు అనగా 16 ఫిభ్రవరి 1630వ సం.రం వరకు అది అక్కడే ఉంచబడింది. ఆ తరువాత కొంతకాలము రాజుల కొలువులో ఉన్నతరువాత, కార్మలైట్ మఠవాసినుల దగ్గర ఉంచబడింది. ఆతరువాత 1655వ సం.లో తిరిగి కార్మలైట్ మఠవాసులకు అప్పజెప్పడం జరిగింది. కాలక్రమేనా, వియన్నా పట్టణములో (Silbergasse, 35) నూతన దేవాలయము, మఠము నిర్మించబడటముతో, అద్భుత శక్తిగల వరప్రసాదముల మాత చిత్రపటమును 14 డిసంబరు 1901న నూతన దేవాలయములోనికి మార్చబడినది. 27 సెప్టెంబరు 1931న వియన్నాలో 300ల శతాబ్ద వేడుకలను ఘనముగా కొనియాడారు. ఆ సందర్భముగా, 11వ భక్తినాధ జగద్గురువులు చిత్రపటానికి కిరీటాన్ని అలంకరింప జేశారు.

          వరప్రసాదముల మాత మధ్యస్థ ప్రార్ధనను వేడుకొనడం అనగా, ‘దేవునికృప’ అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు అవసరమని గుర్తించడం! మరియతల్లి ద్వారా ఆ దేవుని కృప కొరకు ప్రార్ధన చేయడమే! లోకానికి వెలుగు శ్రీసభ అను చట్టములో ఈవిధముగా చదుచున్నాము, “దేవుని కృపావర శ్రేణిలో తొలి వరుసలో నిలుస్తుంది” మరియ (నం. 61). “నేటికీ ఆ దేవమాత మనలోని ప్రతి ఒక్కరికోసం ప్రార్ధిస్తూ మనకు నిత్యజీవ బహుమానాలను సంపాదించి పెడుతుంది” (నం. 62). 

గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)

గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)
ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.
పెద్దావుటపల్లి
కానా పల్లెలో పెండ్లి సందర్భముగా, కుటుంబములోని అవసరతను మొదటగా గుర్తించిన మరియతల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” (యోహాను 2:5) అని చెప్పడం వలన యేసు తన మొదటి సూచక క్రియను ప్రదర్శించాడు. ఆ పరలోకతల్లి అవసరత నేటికీ మనకు అవసరమనే, తండ్రి దేవుడు అప్పుడప్పుడు మరియతల్లి దర్శనాలను కలుగజేస్తున్నాడు. 11 ఫిబ్రవరి 1858లో మరియమాత ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శన మిచ్చి, దైవకుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించమని కోరియున్నది. పాప జీవితానికి స్వస్థిచెప్పి, పుణ్య జీవితాన్ని జీవించమనేదే ఆమె సందేశం. ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శనమిచ్చిన లూర్దుమాత పేరున వెలసిన గుణదల మాత పుణ్యక్షేత్రం కూడా అట్టిదే. మనం పొందుకున్న గొప్ప దైవానుగ్రహం. అట్టి గుణదల పుణ్యక్షేత్రం, 2024లో నూరువసంతాల జూబిలీ వేడుకలను కొనియాడుచున్నది. భారతావనిలోని క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందుతున్న పుణ్యక్షేత్రం. ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో గుణదల మరియమాత దేవాలయము ఒకటిగా పేరుగాంచినది. ఎన్నో లక్షల విశ్వాసులు, భక్తులు, యాత్రికులు, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, మరియమాత ద్వారా దేవున్ని దర్శించ గలుగుతున్నారు.
గుణదల మరియమాత మహోత్సవాలను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనముగా కొనియాడుతారు. అయితే, 2024వ సంవత్సరములో ఈ పుణ్యక్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందుకన, నూరువసంతాల వేడుకలను ఈ పుణ్యక్షేత్రం కొనియాడు చున్నది.
మోన్సిగ్నోర్ H. పెజ్జోని గుణదలలో 1923లో స్థలాన్ని పొందారు. మొదటిగా 15 జూన్ 1924న సెయింట్ జోసఫ్ అనాధాశ్రమం, తరువాత పారిశ్రామిక పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఇది అప్పటి బెజవాడ విచారణకు జోడించబడినది. గుణదల సంస్థల ప్రధమ మేనేజరుగా రెవ. ఫాదర్ P. అర్లాటి 1924లో నియమించ బడినారు. బాధ్యతలు చేపట్టిన రోజునుండే ఎన్నోకష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. స్థలాన్నంతా శుభ్రంచేయించారు. మంచి నీటికోసం బావిని త్రవ్వించారు.
సంస్థలకు మరియమాత ఆశీర్వాదాలు, సంరక్షణ పొందేందుకు రెవ. ఫాదర్ P. ఆర్లాటి 1924లో కొండపైన సహజ సిద్ధమైన ప్రదేశములో మరియమాత స్వరూపాన్ని నెలకొల్పారు. ఇదే గుణదల మరియమాత భక్తికి నాంది పలికింది. 1931లో దేవాలయమును నిర్మించారు. 1933లో గుణదల సంస్థల ప్రధమ శతాబ్ది పూర్తిచేసుకున్న సందర్భముగా, రెవ. ఫాదర్ P. అర్లాటి గుణదల కొండ అంచుపై 18 అడుగుల ఎత్తైన ఇనుప సిలువను ఏర్పాటు చేసారు. సిలువ యొద్దకు మరియమాత గుహనుండి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక TO JESUS THROUGH MARY (మరియమాత ద్వారా యేసు చెంతకు) అన్న సత్యాన్ని చక్కగా మనకు స్పురిస్తుంది. ఇది కతోలిక బెజవాడకు గర్వకారణమైనది.
1937 నాటికి గుణదల పండుగ మేత్రాసణ పండుగగా ప్రసిద్ధి గాంచినది. 1937లో, రెవ. ఫాదర్ P. అర్లాటి, ప్రస్తుతం గుణదల కొండపై చూస్తున్న, 300 కిలోల బరువుగల మరియమాత స్వరూపాన్ని ఇటలీ దేశమునుండి తీసుకొని వచ్చి నెలకొల్పడం జరిగింది. ఆ రోజు స్వరూపాన్ని బెజవాడ పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి గుహలో ప్రతిష్టించడం జరిగింది.
1944-1946 మధ్యకాలములో, సహజ సిద్ధముగా కనిపించే గుహను, అలాగే, దివ్యపూజలు సమర్పించడానికి, గుహముందు బలిపీఠము నిర్మించడం జరిగింది. అప్పటినుండి, ప్రతీసంవత్సరం లూర్దుమాత పండుగను స్థానిక కతోలిక క్రైస్తవులతో కలిసి కొనియాడటం జరుగుతుంది. కొండపైన మరియమాత గుహవరకు ప్రదక్షిణగా వెళ్లి, అక్కడ దివ్యపూజా బలిని సమర్పిస్తారు. గుహకు వెళ్ళుమార్గములో పదిహేను జపమాల రహస్యాలను చిత్రపటాలతో బహుసుందరముగా ఏర్పాటు చేయబడ్డాయి. 1951లో యాత్రికుల మరియమాత స్వరూపమును దగ్గరకు వెళ్ళుటకు, కానుకలు చెల్లించుటకు మెట్లమార్గము ఏర్పాటు చేయబడినది. అలాగే, గుహపైన అందమైన తోరణం నిర్మించడమైనది. 1971లో నూతన దేవాలయం నిర్మించడ మైనది.
కాలక్రమేణ, గుణదల పుణ్యక్షేత్రములో అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. బిషప్ గ్రాసి స్కూల్ ఆవరణలో, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు పెద్ద వేదిక నిర్మించడమైనది. యాత్రికుల బస కొరకై షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడ్డాయి. కొండపైన విద్యుత్, మంచినీటి వసతులు కల్పించ బడ్డాయి. కొండపైకి సులువుగా చేరుకోవడానికి మరిన్ని మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరియమాత గుహనుండి సిలువ వరకు సిలువమార్గము ప్రతిమలతో ఏర్పాటు చేయబడినది.
గుణదల పుణ్యక్షేత్ర సందర్శనలో కొన్ని ప్రాముఖ్యమైనవి: యాత్రికులు తలనీలాలు సమర్పించడం. తలనీలాలు త్యాగానికి గురుతు. మరియమాత మధ్యస్థ ప్రార్ధనలద్వారా పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని, అలాంటి శక్తులు గుణదల మరియ మాతకు ఉన్నట్లు ప్రజల విశ్వాసం, నమ్మకం. మరియమాతకు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. పేరుకు తగ్గట్టుగానే, గుణదల లూర్దుమాత స్వస్థతకు మరోపేరుగా ప్రసిద్ధి చెందినది. గుణదల మాతగా భక్తులపై స్వస్థత, కృపానుగ్రహ జల్లులను కురిపిస్తుంది. నిజమైన, దృఢమైన విశ్వాసముతో ప్రార్ధించే వారిని గుణదల మరియమాత ఎప్పటికీ విడిచి పెట్టదు. ఆమె దయగల హృదయాన్ని గ్రహించిన భక్తులు, విశ్వాసులు ఏడాది పొడవునా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మరియమాత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు.
11 ఫిభ్రవరి 2024న గుణదల పుణ్యక్షేత్రం నూరువసంతాల వేడుకలను ఘనముగా కొనియాడుచున్నది. ఇది విజయవాడకు, తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు, యావత్ కతోలిక శ్రీసభకు గర్వకారణం! ఈ సందర్భముగా, గుణదలలో వెలసిన లూర్దుమాత స్వరూపాన్ని విజయవాడ మేత్రాసణములోని అన్ని గురుమండలాలకు ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళుచున్నారు. దివ్యపూజలు అర్పిస్తున్నారు. ప్రతీచోట, వేలమంది భక్తులు స్వరూపాన్ని సందర్శించి దీవెనలను పొందుచున్నారు. భూలోకములో అమ్మ అంటే మనందరికీ ఎంతో ప్రేమ, అనురాగం, ఇష్టం. అలాగే పరలోకములోకూడా మనందరికీ మరియతల్లి రూపములో ఒక అమ్మ ఉన్నదని మనదరం సంతోషపడాలి. గుణదల మరియ మధ్యస్థ ప్రార్ధనలద్వారా దేవుడు మనలనందరినీ దీవించునుగాక!