త్రికాల జపము, గురువారము, మరియ మాతృత్వ మహోత్సవం, 1 జనవరి 2026

మరియ మాతృత్వ మహోత్సవం
59వ ప్రపంచ శాంతి దినోత్సవం

పొప్ లియో XIV
త్రికాల జపము    
సెయింట్ పీటర్స్ స్క్వేర్
గురువారము, 1 జనవరి 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

గడిచే నెలల కాలచక్రం పునరావృతమవుతున్నప్పటికీ, ప్రజలందరి మధ్య శాంతి, మైత్రి పూర్వకమైన ఒక నూతన యుగాన్ని చివరకు ప్రారంభించడం ద్వారా మన కాలమును నూతనపరుచుకోవాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మేలు చేయాలనే ఈ ఆశ గనుక లేకపోతే, క్యాలెండర్ పేజీలు తిప్పడంలో గానీ, మన డైరీలను నింపడంలో గానీ ఎటువంటి అర్థం ఉండదు.

త్వరలో ముగియనున్న “కరుణామయ జూబ్లీ” (మహా పవిత్ర సంవత్సరం), ఒక నూతన లోకం కోసం నిరీక్షణను ఎలా పెంపొందించుకోవాలో మనకు నేర్పింది. తప్పులను క్షమాపణగా, బాధను ఆదరణగా, మరియు పుణ్య తీర్మానాలను సత్క్రియలుగా మార్చుకోవడానికి మన హృదయాలను దేవుని వైపునకు మళ్లించడం ద్వారా మనం దీనిని చేస్తాము. ఈ విధంగా, దేవుడు స్వయంగా మానవ చరిత్రలో నివసిస్తూ, దానిని విస్మృతి నుండి రక్షిస్తారు; మరియు మన విమోచకుడైన యేసుక్రీస్తును లోకానికి అనుగ్రహిస్తారు. ఆయన మనకు సోదరుడిగా మారిన దేవుని ఏకైక కుమారుడు. లోకంలోనికి వచ్చే ప్రతి పురుషుడు మరియు స్త్రీ కొరకు భవిష్యత్తును ఒక ఆదరణకరమైన ఇల్లుగా మనం నిర్మించేలా, సన్మనస్కులైన ప్రజల మనస్సాక్షులను ఆయన వెలిగిస్తున్నారు.

ఈ విషయంలో, నేటి క్రిస్మస్ పండుగ మన చూపును మరియమాత వైపునకు తిప్పుతుంది, ఎందుకంటే క్రీస్తు హృదయ స్పందనను మొదటగా అనుభవించినది ఆమెయే! ఆమె కన్యత్వ గర్భపు నిశ్శబ్దంలో, జీవవాక్యము దైవకృప యొక్క హృదయ స్పందనగా మనకు వ్యక్తమవుతుంది.

మంచి సృష్టికర్త అయిన దేవునికి మరియమాత హృదయము మరియు మన హృదయాలు ఎల్లప్పుడూ తెలుసు. ఆయన మానవుడిగా మారడం ద్వారా, తన హృదయాన్ని మనకు తెలియజేశారు. అందువల్ల, యేసు హృదయం ప్రతి ఒక్కరి కోసమూ స్పందిస్తుంది; గొర్రెల కాపరుల వలె ఆయనను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసమూ, మరియు హేరోదు వలె ఆయనను వద్దనుకునే వారి కోసమూ అది స్పందిస్తుంది. తన పొరుగువాని పట్ల హృదయం లేని వారి పట్ల కూడా ఆయన హృదయం ఉదాసీనంగా ఉండదు: నీతిమంతులు తమ సేవా నిరతిలో కొనసాగేలా వారి కోసం, అలాగే అవినీతిపరులు తమ జీవితాలను మార్చుకొని శాంతిని పొందేలా వారి కోసం కూడా అది స్పందిస్తుంది.

రక్షకుడు ఒక స్త్రీకి జన్మించడం ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. పరమ పవిత్ర మరియమాతలో ప్రకాశిస్తూ, జన్మించబోయే ప్రతి బిడ్డలోనూ ప్రతిబింబిస్తూ, మన మానవత్వంలో ముద్రించబడిన దైవ స్వరూపాన్ని వెల్లడిస్తున్న ఈ అద్భుత ఘట్టాన్ని మనం కాసేపు ఆరాధిద్దాం.

ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా, మనమందరం కలిసి శాంతి కోసం ప్రార్థిద్దాం: మొదటిగా, యుద్ధాలు, శ్రమల వల్ల రక్తసిక్తమైన దేశాల మధ్య శాంతి కొరకు, అలాగే హింస లేదా బాధల వల్ల గాయపడిన మన కుటుంబాల మధ్య శాంతి కొరకు ప్రార్థిద్దాం. మన నిరీక్షణ అయిన క్రీస్తు ఎన్నటికీ అస్తమించని నీతి సూర్యుడని నిశ్చయముగా నమ్ముతూ, దైవమాత, మరియు తిరుసభ మాత అయిన మరియమాత విజ్ఞాపన సహాయాన్ని మనం నమ్మకంతో వేడుకుందాం. ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 14 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 14 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనం (మత్త 9:36–10:8) మనకు ఒక గొప్ప బహుమతిని అందిస్తుంది. ఎందుకంటే, దీనిని వినే ప్రతి ఒక్కరినీ ఇది యేసు ప్రభువు యొక్క కరుణా వీక్షణంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్య భాగం ఆయన చూపులోని శ్రద్ధకు సాక్ష్యంగా నిలవడమే కాకుండా, ప్రభువు ఏమి చూస్తున్నారో కూడా మనకు తెలియజేస్తుంది. నిజానికి, క్రీస్తు “ఆ జనసమూహములను చూచినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె చెదరియున్నందున వారిమీద కనికరపడెను” (వ. 36) అని మనం చదువుతాము. మనకు సోదరుడిగా మారిన దేవుని కుమారుడు ప్రజల వైపు, మానవాళి వైపు చూస్తున్నారు: మనల్ని కృంగదీసే అణచివేతను, మనుషుల శక్తిని క్షీణింపజేసే హింసను ఆయన చూస్తున్నారు. యుద్ధం వల్ల ఏర్పడిన గాయాలను, వినియోగదారీ సంస్కృతి (భోగలాలసత) వల్ల కలిగే శూన్యతను ఆయన చూస్తున్నారు. ముసుగులుగా మారిన ముఖాలను, చెడు వల్ల ముక్కలైన కుటుంబాలను, తప్పుడు ఆశయాల వల్ల దారి తప్పిన యువతను యేసు చూస్తున్నారు. యేసు చూస్తున్నారు మరియు ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ, మన కోసం, మనతో కలిసి బాధపడుతున్నారు: ఆయన కనికరం కేవలం సహోదర సాన్నిధ్యాన్ని మాత్రమే కాక, మనలను విముక్తి చేయాలనే ఆయన తపనను కూడా వ్యక్తపరుస్తుంది.

ఎందుకంటే ఆయనకు మన హృదయాలు తెలుసు, ఆయన మనల్ని ఆదరిస్తారు. “కాపరిలేని గొర్రెలవలె” (వ. 36) ఉన్న ఎంతో మంది ప్రజలను చూసి, క్రీస్తు అందరి కోసమూ ఒక మంచి కాపరిగా తన్ను తాను సమర్పించుకుంటారు. అంతేకాక, కోతకు లోకమనే పొలంలోనికి పనివారిని పంపుతారు (వ. 38). వారి బాధ్యత ఏమిటి? బాధల్లో ఉన్నవారికి దేవుని ఆదరణను అందించడం; ఎక్కడైతే దైన్య స్థితి ఉందో అక్కడ ప్రేమను, ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ నిరీక్షణను, ఎక్కడైతే అవిశ్వాసం ఉందో అక్కడ విశ్వాసాన్ని వారు చేరవేయాలి.

సువార్తలో మొదటి పన్నెండు మంది “పనివారి” పేర్లు రాయబడ్డాయి: వారు మొదట శిష్యులుగా ఉండి అపొస్తలులుగా, అనగా సువార్త ప్రచారకులుగా మరియు బోధకులుగా మారారు. వారిలో మొదటివాడిగా సీమోను పేతురును మనం చూస్తాము. అలాగే చిట్టచివరగా యూదా ఇస్కరియోతు పేరును కూడా చూస్తాము. ఒకరు యేసును వెంబడిస్తూనే, ఆయనకు ద్రోహం కూడా చేయవచ్చని మనకు గుర్తుచేయడానికే అతని పేరు చివరన ఇవ్వబడింది. అయినప్పటికీ, సువార్త అందరికీ సజీవమైన, నిజమైన వాక్యంగానే నిలుస్తుంది. శతాబ్దాలు దాటినా ఈ శుభవార్త ఎప్పటికీ నూతనమైనదిగా, తాజాదనంతో మరియు విముక్తి కలిగించేదిగానే ఉంటుంది: “పరలోకరాజ్యము సమీపించియున్నది” (మత్త 10:7). అవును, అది సమీపంలోనే ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు నందు దేవుడు ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి ప్రజకు మరియు ప్రతి దేశానికి అండగా నిలుస్తున్నారు. ఈ సువార్తను ప్రకటించి, దాని ప్రకారం జీవించినప్పుడు, చెడు అనేది నశించిపోయే ఒక రోగంలా, తెల్లవారగానే తొలగిపోయే చీకటిలా, పునరుత్థానుడైన క్రీస్తు చేతిలో ఓడిపోయిన మరణంలా అంతరించి పోతుంది.

యేసు యొక్క కరుణా వీక్షణం యథార్థతను ఈ విధంగానే మారుస్తుంది. ప్రేమతో నిండిన ఆయన చొరవ ఒక నూతన సమాజానికి, అనగా తిరుసభకు జన్మనిచ్చింది. ఈ తిరుసభ అపొస్తలుల పరిచర్యను ముందుకు తీసుకెళ్లవలసి ఉంది: “ఉచితముగా పొందితిరి, ఉచితముగా నియ్యుడి” (వ. 8). అవును, యేసు ఇచ్చే బహుమతి పూర్తిగా ఉచితమైనది, ఎందుకంటే దాని విలువ కొలతలకు అందనిది. దానిని మన స్వంత శక్తితో సంపాదించుకోవడం లేదా “కొనుక్కోవడం” అసాధ్యం. ఈ కృపయే దేవుని కనికరానికి ఉన్న అందమైన పేరు. మనం ఎక్కడున్నా అది మనల్ని వెతుక్కుంటూ వచ్చి, ఆయన వైపునకు తిప్పుకుంటుంది. “కావున తన కోతకు పనివారిని పంపవలెనని కోత యజమానుని వేడుకొనుడి” (మత్త 9:38)!

ప్రియమైన మిత్రులారా, సువార్త ప్రచార బాధ్యత దేవుని ఉచిత బహుమతి నుండి ఉద్భవిస్తుంది. అది క్రీస్తు నందు లోకానికి పాపక్షమాపణగా, దీనులకు మరియు పేదలకు చేసే సేవగా, మరియు న్యాయం పట్ల చూపే నిబద్ధతగా మారుతుంది. యేసు మనల్ని పిలుస్తున్న ఈ పరిచర్యకు మనం సంతోషంతో, ధైర్యంతో స్పందించేలా, దైవకృపతో నిండిన శాంతి రాజ్ఞి అయిన మరియమాత సహాయాన్ని వేడుకుందాం. ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 21 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 21 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 10:26-33), యేసు ప్రభువు తన శిష్యులను పరిచర్యకు పంపుతూ ఈ విధంగా హెచ్చరిస్తున్నారు: “చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు; చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుదు” (వ. 27).

మనం ఏకాంతంలో, అనగా మన హృదయ అంతరంగంలో వినేదానికి మరియు అందరికీ మనం ప్రకటించవలసిన దానికి మధ్య ప్రభువు ఒక పోలికను చూపుతున్నారు. సువార్తను ప్రకటించడం అంటే మొదటగా ప్రభువుతో మనకు ఏర్పడిన వ్యక్తిగత అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడమేనని, అది మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైనదని మనకు గుర్తుచేస్తున్నారు.

ఏదైనా ఒక దైవ పరిచర్య యొక్క బలం పద్ధతులు, సాధనాలకు అతీతంగా మనలో పరిశుద్ధాత్మ చేసే కార్యం ద్వారా మరియు మనం చూపే నిజాయితీ గల స్పందన ద్వారానే లభిస్తుంది. పునీత థామస్ అక్వినాస్ గారు ‘బోధన’ (ప్రసంగం) గురించి మాట్లాడుతూ, మనం ధ్యానించిన దానిని ఇతరులకు అందించడమే బోధన అని అన్నారు: “contemplata aliis trader (మనం ధ్యానించిన సత్యాలను ఇతరులకు పంచడం).

దైవధ్యానం లేదా ఏకాంత ప్రార్థన అనేది కేవలం కొద్దిమంది సాధువులకు, సన్యాసులకు లేదా మునులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక అనుభవమని మనం అనుకోకూడదు. మన దైనందిన జీవితంలోని పనుల మధ్య, దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా గడపడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన సంతోషాలను, ఆందోళనలను ఆయనకు అప్పగించడానికి, మరియు మన జీవితాలను ఆయనతో కలిసి పునఃసమీక్షించుకోవడానికి ప్రశాంతమైన క్షణాలను కేటాయించడం ద్వారా మనమందరం దీనిని చేయవచ్చు. ఇది మన విశ్వాసాన్ని మరింత దృఢంగా, స్పష్టంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి స్థలంలోనూ సువార్త వెలుగును ప్రతిబింబింపజేయడానికి, అలాగే సువార్త విలువలను అర్థం చేసుకోని లేదా అంగీకరించని చోట కూడా దానికి సాక్ష్యంగా నిలవడానికి, నమ్మకమైన మరియు స్వేచ్ఛ గల శిష్యులుగా ఉండటానికి ఇది మనకు తోడ్పడుతుంది.

మనం పైన పేర్కొన్న బైబులు భాగాన్ని రాసిన పునీత మత్తయి కష్టాలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్న సమాజాల కొరకు దీనిని రాశారు. నేడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవులు ఎదుర్కొంటున్నట్లే, నాటి వారు కూడా శత్రుత్వాన్ని, హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో నిరాశకు గురవడం, అలసట లేదా భయానికి లోనవడం వంటి శోధనలు ఎంతో ఎక్కువగా ఉండేవి.

అప్పటిలాగే ఇప్పుడు కూడా, యేసు బోధనలకు నమ్మకంగా ఉండటం మరియు ఆయన వాక్యాన్ని ప్రకటించడం ఒక సవాలుగా మారింది: ద్వేషానికి ప్రేమతో, అహంకారానికి నమ్రతతో, మరియు నిరాశకు పట్టుదలతో స్పందించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం, ఆయనతో మనకున్న ఆత్మీయ బంధంలో మన విశ్వాసపు పునాదులను, మన పరిచర్యను మరింత లోతుగా నాటుకోవాలి (పాప్ ఫ్రాన్సిస్, “ఎవాంజెలి గౌదియమ్”, 8). మనము నిరాశ చెందకుండా, ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిరీక్షణ, ప్రేమ మరియు శాంతి సందేశాన్ని అందరితో పంచుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ప్రస్తుత లోకానికి ఇది ఎంతో అవసరం!

మనలో ప్రతి ఒక్కరం మన పిలుపుకు తగినట్లుగా, యేసు ప్రభువు యొక్క సువార్త సాక్షులుగా జీవించడానికి మరియమాత మనకు సహాయం చేయును గాక! ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 28 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 28 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 10:37–42), యేసు ప్రభువును ఎలా అనుసరించాలనే దానిపై, దైవరాజ్యానికి ఎలా సాక్షులుగా నిలవాలనే దానిపై ఇచ్చిన కొన్ని హెచ్చరికలను మనం వింటాము. ఇది కేవలం బాహ్యమైన క్రియలకు సంబంధించిన విషయం కాదు, కానీ ఆయనతో ఒక ప్రేమపూర్వకమైన బంధంలో మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడానికి సంబంధించినది. ప్రేమ ఫలించాలంటే కనీసం మూడు విషయాలు అవసరం: అనాసక్తి (బంధాల నుండి విడుదల), నష్టపోవడం మరియు ఆదరణ (ఆతిథ్యం).

మొదటిది, అనాసక్తి. యేసు ఇలా సెలవిస్తున్నారు, “నాకంటె తన తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; నాకంటె తన కుమారునైనను కుమార్తెనైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు” (వ. 37). ప్రభువు తన అపొస్తలులను సువార్త పరిచర్యకు పంపడం ప్రారంభించినప్పుడు, వారు ఎలాంటి బంధనాల నుండి అయినా స్వేచ్ఛగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అయితే, ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఎంతో ముఖ్యమైన మన బంధాలు కూడా క్రీస్తు మనకు ప్రసాదించే ప్రేమ ద్వారానే పరిపూర్ణతను పొందుతాయి. ఉదాహరణకు వైవాహిక జీవితాన్ని తీసుకోండి! వివాహ జీవితానికి కట్టుబడి ఉండటానికి ఒకరు తన తల్లిదండ్రుల ఇల్లు “వదిలిపెట్టినప్పుడే” (మత్త 19:6) ఆ జీవితాన్ని పూర్తిగా జీవించగలరు. పిల్లల పెంపకాన్ని కూడా మనం పరిగణించవచ్చు. వారు “తమ స్వంత కాళ్లపై తాము నిలబడటం” మరియు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం నేర్పడం ద్వారానే, వారు జీవితంలో విజయం సాధించడానికి, సంతోషంగా ఉండటానికి మనం సహాయం చేయగలము. పునీత అగుస్తీను గారు ఇలా అంటారు, “మీరు ప్రేమించే దాని నుండి విడిపోవడం బాధాకరమే. అయినప్పటికీ, రైతు తాను విత్తిన దానిని తాత్కాలికంగా నష్టపోతాడు” (ప్రసంగం 330: 2). నేలలో నాటిన ఆ విత్తనాన్ని “నశించిపోవడం” ద్వారానే, అది మొలకెత్తడం మనం చూడగలం.

ఈ కోణంలో, ప్రేమ అంటే నష్టపోవడం కూడా. దీనిని అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా నష్టపోవడాన్ని బలహీనతగా భావించే, మరియు సంపాదించడం, కలిగి ఉండటం అనే ధ్యాసలోనే బతికే ఈ లోకంలో ఇది మరింత కష్టం! అయినప్పటికీ, ప్రేమ కేవలం ఆత్మసమర్పణలో మాత్రమే ఫలిస్తుంది: మరొకరి కోసం మనలో కొంత భాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు; ఒక స్నేహితుని మాట వినడానికి కొద్ది సమయాన్ని కేటాయించినప్పుడు; కష్టాల్లో ఉన్నవారితో పాలుపంచుకోవడానికి మన సౌకర్యాన్ని కొద్దిగా త్యాగం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సువార్త ప్రకారం, తన ప్రాణాన్ని తన కోసమే దాచుకొనువాడు దానిని పోగొట్టుకొనును (వ. 39), ఎందుకంటే, వారు ప్రేమ యొక్క ఆనందానికి తమను తాము తెరచుకోరు, తద్వారా నిష్ఫలులవుతారు. అందుకే యేసు మనల్ని సిలువను ఎత్తుకోమని ఆహ్వానిస్తున్నారు. ఆయన తనను తాను అర్పించుకున్నారు, తనను తాను నష్టపరుచుకున్నారు, ఆ విధంగానే మనం ఆయన జీవాన్ని సమృద్ధిగా పొందగలిగాము. అదేవిధంగా, మనల్ని మనం ఇతరులకు అర్పించుకునే జీవన విధానాన్ని అలవర్చుకుంటే, మన బంధాలలో సరికొత్త జీవాన్ని తీసుకురాగలుగుతాము.

చివరిది, ఆదరణ (ఆతిథ్యం). ప్రేమ అనేది ఆచరణాత్మకమైన నిర్ణయాలు మరియు క్రియల ద్వారా వ్యక్తమవుతుంది; దప్పిక గలవానికి ఒక గిన్నెడు నీళ్లు ఇవ్వడం (వ. 42) వంటి చిన్న చిన్న రోజువారీ క్రియల ద్వారా అది వ్యక్తమవుతుంది. యేసు తన శిష్యులను ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా ముందుగా పంపారు, తద్వారా వారు ఇతరుల సహాయంపై ఆధారపడటం ద్వారా, వారు కలిసే వారిలో ఆదరించే గుణాన్ని పెంపొందింపజేశారు. యేసు నామమున వచ్చువారిని ఆదరించడం ద్వారా, మనం ఆయనను మరియు ఆయనను పంపిన పరలోకపు తండ్రిని ఆదరించుచున్నాము. నిజానికి, ప్రభువుపై ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ మన సహోదరీ సహోదరులను ఆదరించడంలోనే ఇమిడి ఉంటుంది.

ప్రియమైన మిత్రులారా, తన కుమారుడిని ప్రేమిస్తూనే, ఒకరోజు ఆయనను కోల్పోతానని తెలిసిన మరియమాతను మనం ప్రార్థిద్దాం. క్రీస్తు ప్రేమకు నమ్రతగల, సంతోషకరమైన సాక్షులుగా నిలవడానికి ఆమె మనకు సహాయం చేయును గాక! ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 05 జూలై 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 05 జూలై 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 11:25–30), “భూమ్యాకాశములకు ప్రభువైన” తండ్రిని స్తుతించడంలో తనతో కలిసి పాలుపంచుకోవాలని యేసు ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నారు (వ. 25). మానవరూపం దాల్చిన దేవుని కుమారుడు, సృష్టిలోని సమస్త జీవులను ఈ కృతజ్ఞతా స్తుతిలో భాగం చేయడం ద్వారా తన ప్రేమను వెల్లడిస్తున్నారు.

ఈ స్వచ్ఛమైన, సంతోషకరమైన ఆరాధన దేవుని కార్యాచరణను తెలియజేస్తుంది: ఆయన తనను తాను “పసిబిడ్డలకు” (నమ్రత గలవారికి) వెల్లడించడానికి ఇష్టపడతారు, కానీ “విజ్ఞులకు, వివేకవంతులకు” తనను తాను మరుగుపరుచుకుంటారు (వ. 25). వారు తమ సొంత ఆలోచనలతో నిండిపోయి ఉండటం వల్ల, తమను దర్శించడానికి వచ్చిన మెస్సయ్య అయిన క్రీస్తు ఉనికిని గుర్తించలేకపోతున్నారు. మానవ జ్ఞానం అలా అహంకారంగా మారుతుంది, వారి బోధలు గర్వానికి దారితీస్తాయి. దానికి భిన్నంగా, దేవుని నిజమైన జ్ఞానం క్రీస్తు అవతారము యొక్క నమ్రతలో వ్యక్తమవుతుంది. ఆయన బోధలు ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారిని ఉద్దేశించినవి: “భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు” (వ. 28) అని ప్రభువు సెలవిస్తున్నారు. యేసు వద్దకు రావడం అంటే ఆయన ప్రేమకు స్పందించడం, సిలువ వరకు ఆయన జీవితంలో పాలుపంచుకోవడం అని అర్థం. దీనినే ఆయన స్వయంగా బోధిస్తూ, “నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరింపవలెను” (మత్త 16:24) అని అన్నారు. ప్రేమతో కూడిన ఈ ఆత్మసమర్పణే యేసు యొక్క “కాడి” (మత్త 11:29). ఇదే ఆయన బోధనల సారాంశం, అందరిపట్ల ప్రేమతో ప్రజ్వరిల్లే ఆయన జ్ఞాన హృదయం.

సహోదరీ సహోదరులారా, సిలువ భారం “సులువుగా”, “తేలికగా” (వ. 30) ఎలా ఉండగలదు? దానికి ఒకే ఒక్క కారణం, ప్రభువు స్వయంగా ఆ భారాన్ని మనతో కలిసి మోస్తారు, మనలను కృంగదీసే ఏ కష్టంలోనూ ఆయన మనలను ఒంటరిగా వదిలిపెట్టరు. ఒక నిజమైన బోధకునిగా, చెడు వల్ల గాయపడిన మానవాళిని స్వస్థపరిచి, ఆదరించడానికి యేసు ఆ భారాన్ని తనపై వేసుకున్నారు. ఆయన మనకు అనుగ్రహించే జ్ఞానం రక్షణ యొక్క ప్రకటన, ఆయన కాడి మనల్ని ప్రతి పతనం నుండి పైకి లేపుతుంది. అందువల్ల, క్రీస్తును అనుసరించే మన ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని హింసించే కఠిన వ్రతం కాదు. బదులుగా, అది మనకు స్వేచ్ఛను నేర్పే ఒక పాఠశాల. అది మానవ చరిత్రలోని కష్టాలను గుర్తిస్తూ, ముఖ్యంగా చీకటి క్షణాలలో దానికి నిరంతరం నిరీక్షణను అందిస్తుంది. నిజానికి, కేవలం యేసు సిలువ ద్వారానే చెడు జయించబడుతుంది; కేవలం ఆయన శ్రమల ద్వారానే మన మరణ భయానికి, అలసటకూ ఆదరణ, విముక్తి లభిస్తాయి.

దాస్యంలో క్రీస్తే విముక్తి. యుద్ధాల సంక్షోభంలో క్రీస్తే నిరీక్షణ. పాపపు ఘడియలో క్రీస్తే క్షమాపణ. ఇదే నిజమైన జ్ఞానం, ఆయన నామంలో శిష్యులుగా ఒక్కటై మనం కలిసి నడవాల్సిన మార్గం. యేసు కుమారునిగా ఉంటూనే, మనకు సోదరుడిగా మారి దీనిని నేర్పిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన దేవుని గురించి, మానవాళి గురించిన సత్యాన్ని తిరుసభకు వెల్లడిస్తున్నారు, ఎందుకంటే “తండ్రి ఎవరో కుమారునికి తప్ప, కుమారుడు ఎవరికి ఆయనను తెలియజేయాలని నిశ్చయించునో వారికి తప్ప మరి ఎవరికిని తెలియదు” (వ. 27).

ప్రియమైన మిత్రులారా, ప్రభువు మనపై ఉంచిన ప్రేమపూర్వకమైన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తిరుసభ మేలు కొరకు, సర్వలోక శ్రేయస్సు కొరకు విజ్ఞాపన చేయమని శాంతి రాజ్ఞి అయిన మరియమాతను ప్రార్థిద్దాం. ఆమెన్.

పునీత పేతురు, పౌలుల మహోత్సవం, సోమవారము, 29 జూన్ 2025

పునీత పేతురు, పౌలుల మహోత్సవం
 పొప్ లియో XIV
త్రికాల జపము
పు. పేతురు బసిలికా, రోము నగరము
సోమవారము, 29 జూన్ 2025

ప్రియమైన సహోదరీ సహోదరులారా, అందరికీ శుభ మధ్యాహ్నం!

ఈ రోజు మనం రోము నగర పాలక పునీతులైన పునీత పేతురు మరియు పునీత పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఈ పండుగ రోము నగర శ్రీసభకు, విశ్వశ్రీసభకు మధ్య విశ్వాసంలోనూ, సేవాభావంలోనూ ఉన్న పవిత్రమైన బంధాన్ని మనకు గుర్తుచేస్తుంది.

ఈ ఇరువురు అపొస్తలుల సాక్ష్యం నూతన నిబంధన గ్రంథానికి ఒక ముద్ర లాంటిది. వారు ఈ నగరంలో చిందించిన రక్తం, ప్రభువైన యేసు మనకు అందించిన దేవుని అపారమైన ప్రేమను చాటిచెబుతుంది. వారి బోధనలు, వారి వేదసాక్షి మరణం ద్వారానే క్రీస్తు సువార్త రోము నగరంలో బలంగా నాటుకుంది. అప్పటి సామ్రాజ్య రాజధాని అయిన ఈ నగరంలోనే, దేవుని గురించిన సరికొత్త జ్ఞానాన్ని, ప్రతి మానవుని విశిష్టమైన గౌరవాన్ని చాటిచెప్పింది. అలాగే అధికారం అంటే ఇతరులను లొంగదీసుకోవడం కాదు, మానవ జీవితానికి సేవ చేయడం అనే కొత్త అర్ధాన్ని వివరించింది.

ఈ రోజుల్లో కూడా, ప్రేమతో మరణించి తిరిగి లేచిన ఆ ప్రభువు, తన సాక్షుల ద్వారా మన మధ్యకు వస్తూనే ఉన్నారు. “నన్ను అనుసరించు!” అనే ఆయన పిలుపును అందుకుని, ధైర్యంగా అడుగులు వేస్తున్న వారి స్వరాలు, ముఖాలు మరియు నిర్ణయాల ద్వారా ఆయన సందేశం నగరాల నుండి మారుమూల గ్రామాలకు, రాజధానుల నుండి చిట్టచివరి ప్రాంతాల వరకు చేరుతోంది. కాబట్టి, ఈ పండుగ రోజున మనల్ని పేతురు మరియు పౌలుల సువార్త బాధ్యతలోనికి, అంటే సాక్షాత్తు యేసు ప్రభువు సువార్త సేవలోనికి ఆహ్వానిస్తోంది. పాపులమైనప్పటికీ క్షమించబడిన మనపై దేవుడు నమ్మకం ఉంచాడు; తద్వారా ఆయన కృప మన జీవితాల ద్వారా ప్రకాశిస్తుంది, చెడును మంచిగా మార్చే ఆయన శక్తి లోకానికి వెల్లడవుతుంది.

ప్రియమైన మిత్రులారా, పేతురు మరియు పౌలు ఒకరికొకరు ఎంతో భిన్నమైన వ్యక్తులు. వారి నేపథ్యం, పెరిగిన వాతావరణం, స్వభావం అన్నీ వేరువేరు. వారు దేవుని పిలుపును అందుకునే ముందు మాత్రమే కాదు, అందుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నారు; ఎందుకంటే ఆ ప్రభువు వారిద్దరినీ ఒకేలా మార్చలేదు. పేతురు మరియు పౌలు ఇద్దరూ సువార్తను తమదైన శైలిలో అర్థం చేసుకుని, ప్రచారం చేశారు. బైబులు గ్రంథాన్ని రాయించిన పవిత్రాత్మ కూడా వారి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను దాచాలని అనుకోలేదు. నిజానికి, ఈ తేడాలు మనకు ఒక శుభవార్త లాంటివి. అపొస్తలుల సంఘంలో పేతురు, పౌలులు శత్రువులు కాదు. దానికి భిన్నంగా, పవిత్రాత్మ వేర్వేరు భిన్నత్వాలను ఎలా ఒక్కటిగా చేస్తుందో చెప్పడానికి వారు ఒక చిహ్నంగా నిలిచారు. ఈ విధంగా, రోము నగర శ్రీసభ పాలక పునీతులు ఐక్యతలోని సవాళ్లను ఎదుర్కొన్నారు; దానిని అర్థం చేసుకుని, సేవ చేస్తూ, దైవిక జీవితానికి అది ఒక నిదర్శనమని చాటారు. చరిత్రలో క్రైస్తవ ఉనికి అనేది కేవలం అధికారం కోసం కాకుండా, సేవ, ఐక్యత మరియు సమాధానం కోసం పని చేయాలని నిరూపించడంలో వారి సాక్ష్యం ఎంతో దోహదపడింది.

పునీత పేతురు మరియు పౌలుల ప్రార్థనల ద్వారా, శ్రీసభ యొక్క సార్వత్రికతను (క్యాథలిక్ / కతోలిక స్వభావం) మనం మరింత లోతుగా అభినందించేలా ప్రభువు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించును గాక! వ్యక్తులు మరియు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దాని విలువను గుర్తించేలా, ఐక్యతను దెబ్బతీసే దేనికైనా దూరంగా ఉండేలా, మరియు అందరితో నిజాయితీతో కూడిన సంభాషణలను కొనసాగించేలా ఆయన మనల్ని నడిపించును గాక!

అపొస్తలుల రాజ్ఞి అయిన మరియ మాత, రోము నగరంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడును గాక! ఆమెన్.

15వ సామాన్య ఆదివారము, 12 జూలై 2026

 లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా డెల్లా లిబెర్టా (కాస్టెల్ గందోల్ఫో)
15వ సామాన్య ఆదివారము, 12 జూలై 2026

 ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభ ఆదివారం!

నేటి పరిశుద్ధ గ్రంథ పఠనంలో, సువార్తికుడైన మత్తయి ప్రభువు చెప్పిన “విత్తువాని ఉపమానమును” (మత్త 13:1–23) తెలియజేస్తున్నారు. దేవుడు ఎంతటి ఉదారతతో, నమ్మకంతో తన వాక్యాన్ని మన హృదయాలలో వెదజల్లుతాడో, ఆయన శక్తి మనలో ఎలా పనిచేస్తుందో ఈ ఉపమానం వివరిస్తుంది.

మన రక్షణ కోసం తన ప్రాణాన్నే అర్పించి, మానవరూపం దాల్చిన దేవుని వాక్యమే యేసు క్రీస్తు ప్రభువు. తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో నిరంతరం వెదజల్లుతున్న విత్తనం యేసు క్రీస్తే. ఆ విత్తనం నశించడం ద్వారా విస్తారముగా ఫలిస్తుంది (యోహాను 12:24). కొన్నిసార్లు మన హృదయాలు కఠినంగా, ఎలాంటి స్పందన లేకుండా ఉంటాయనేది నిజమే. త్రోవప్రక్కన నేలలాగా, రాతి నేలలాగా, లేదా ముళ్లపొదల్లాగా మన మనస్సులు పరధ్యానంలో మునిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ, మన హృదయాలు దేవుని వాక్యానికి లోబడేవిగా, సారవంతమైన నేలగా మారే క్షణాలు కూడా ఉంటాయి. అప్పుడు, సమస్తాన్ని మార్చివేయగల ప్రేమ యొక్క అద్భుతాలు మనలో మొదలవుతాయి. దీనిని మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా అనుభవించే ఉంటాం. అందుకే, మన బలహీనత కంటే ఆయన ప్రేమ శక్తి చాలా గొప్పదని (2 కొరి 12:9-10) తండ్రి అయిన దేవునికి తెలుసు గనుక, ఆయన వాక్యమనే విత్తనాన్ని వెదజల్లడం ఎన్నటికీ ఆపడు.

దేవుని వాక్యమనే “విత్తనం” గురించి పునీత జాన్ క్రిసోస్టమ్ గారు, “ముళ్లపొదల్లో, రాతి నేలపై లేదా త్రోవ ప్రక్కన వెదజల్లడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. విత్తనాలు మరియు నేల విషయంలో అయితే అది సరికాకపోవచ్చు! కానీ ఆత్మల విషయంలో, దేవుని బోధనల విషయంలో మాత్రం అది ఎంతో ప్రశంసనీయమైనది” (మత్తయి సువిశేషంపై ప్రసంగం, 44, 5) అని అన్నారు. ఎందుకంటే, దేవుని చేతుల్లో “రాతి నేల కూడా సారవంతమైన నేలగా మారుతుంది; బాటసారుల కాళ్ల కింద నలిగిపోయే త్రోవ, దారిన పోయేవారి పాలు కాకుండా విలువైన, సారవంతమైన నేలగా మారుతుంది; ముళ్లపొదలు తొలగిపోయి, విత్తనం పూర్తి సంరక్షణతో ఎదుగుతుంది.”

మన పట్ల దేవుడు చూపించే ఉదారత, అమాయకత్వంతో కూడినది కాదు, అది ఎంతో జ్ఞానంతో కూడినది. కొన్నిసార్లు మనకు కూడా కనిపించని మనలోని మంచితనాన్ని, నైపుణ్యాన్ని దేవుడు చూస్తారు. అందుకే, మన హృదయాల స్థితి మనకంటే దేవునికే బాగా తెలుసు. దేవుడు మనల్ని ఎప్పుడూ నమ్ముతూనే ఉంటారు. మనం ఈ రోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా మారగలం అనేది దేవునకు తెలుసు. కనుక, మనం చేయవలసిందల్లా విశ్వాసంతో మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడమే!

ఈ విధంగా, విత్తనం ఎంతటి ఉదారతతో, నమ్మకంతో నాటబడుతుందో... దానిని మనం అంతే వినయంతో, హృదయపూర్వకంగా స్వీకరిస్తే, పరిశుద్ధాత్మ ఫలాలు మనలో పెరిగి ఇతరులకు కూడా విస్తరిస్తాయి. పునీత పౌలు గారు చెప్పినట్లు ఆ ఫలాలు ఏమిటంటే, “ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము” (గలతీ 5:22). ప్రస్తుత ప్రపంచానికి ఈ ఫలాలు ఎంతో అవసరం. లోకమంతా వీటితో నిండిపోయి, ఒక కొత్త మార్పు రావాలి!

కాబట్టి, ముఖ్యంగా ఈ కాలములో, దేవుని వాక్యాన్ని వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి సమయాన్ని కేటాయిద్దాం. విశ్రాంతితో, మంచి వినోదంతో పాటు, నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకునే అమూల్యమైన క్షణాలను అలవరచుకుందాం. దీనివల్ల మనం శారీరకంగా, ఆధ్యాత్మికంగా నూతన శక్తిని పొంది, మళ్లీ మన పనుల్లోకి ప్రవేశిస్తాం. అప్పుడు సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యాభివృద్ధికి మన వంతు కృషి చేయడానికి మరింత సమర్థులమవుతాము.

అపొస్తలుల రాజ్ఞి, సువార్తీకరణకు మార్గదర్శి అయిన మరియమాత, మనకు సహాయం చేయును గాక. ఆమెన్!

విచారణలో గురువుల, మఠవాసుల పాత్ర

 విచారణలో గురువుల, మఠవాసుల పాత్ర

గురువులు పీటాధిపతుల ప్రతిష్టలో మరియు ప్రేషిత కార్యంలో భాగస్వాములు. పీటాధిపతులకు సహకారులు (ccc 1562), మద్దతుదారులు, దేవుని ప్రజలకు సేవలందించడానికి పిలుపునందుకున్నవారు. ఒక విచారణ లేదా స్థానిక విశ్వాసుల సంఘానికి, నమ్మకంతో, ఉదారత్వంతో, తాము సహకరించే పీటాధిపతులకు ప్రాతినిధ్యం వహిస్తారు (ccc 1567). గురువులు ఒక విచారణ సంఘానికి ఆధ్యాత్మిక నాయకులు. వారు శ్రీసభకుశిరస్సు అయిన క్రీస్తు స్థానంలోప్రతినిధులుగా పనిచేస్తారు. క్రీస్తు పరమరహస్యాన్ని ప్రకటిస్తారు. క్రీస్తు సువార్త సేవను వారు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే, మఠవాసులు, మఠకన్యలు, దైవాంకిత జీవితం ద్వారా, సువార్త సేవకు, దేవునికి సంపూర్ణముగా అంకితమై, పరలోక రాజ్యానికి శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇస్తూ, సువార్త సేవలో తమ సహకారాన్ని అందిస్తుంటారు.

పవిత్ర అభిషేకం పొందిన గురువు యొక్క పాత్ర, లేదా సేవ మూడు ప్రధాన కర్తవ్యాలుగా ఉంటుంది: ఒకటి, పవిత్రపరచడం, రెండు బోధించడం, మూడు నిర్వహించడం. సేవ వారికి అభిషేకం ద్వారా లభిస్తుంది. సేవా బాధ్యత ద్వారా, గురువులు క్రీస్తు యొక్క ఏకైక గురుత్యంలో భాగస్వామ్యాన్ని పొందుతారు. బాధ్యతలను ఇతర గురువుల, డీకనుల సహకారంతో, క్రీస్తు విశ్వాసుల సహాయంతో నేరవేర్చగలరు (క్యానన్ 519). మూడు బాధ్యతల గురించి తెలుసుకుందాం:

పవిత్రపరచడం: మొదటి కర్తవ్యం, ప్రాధమిక విధి, పవిత్రత. సంఘాన్ని ఆధ్యాత్మిక పధంలో నడిపించడం. క్రైస్తవ జీవితానికి మూలం మరియు శిఖరంఅయిన దివ్య సత్ప్రసాదాన్ని లేదా దివ్యపూజా బలిని నిర్వహించడం ద్వారా, కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు. అభిషేకం పొందిన గురువులు మాత్రమే, చట్టబద్ధంగా దివ్యపూజా బలిని మరియు పాపసంకీర్తన దివ్యసంస్కారాన్ని నిర్వహించగలరు. అలాగే గురువులు జ్ఞానస్నానాలు ఇస్తారు. జ్ఞాన వివాహాలను జరిపిస్తారు. అవస్థ అభ్యంగాన్ని ఇస్తారు. వారి అనుదిన శ్రీసభ ప్రార్ధనల ద్వారా, వారి ప్రార్ధనా జీవితానికి కట్టుబడి ఉంటారు. వారి ప్రార్ధనల ద్వారా దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటారు.

బోధించడం: సువార్తను ప్రకటించడం గురువుల ప్రాథమిక విధి. క్రీస్తు బోధన పరిచర్యలో భాగస్తులు అవుతారు. ప్రసంగాలు, ఉపదేశాలు, సత్యోపదేశం, ఇతర విశ్వాస కార్యక్రమాల ద్వారా, దేవుని వాక్యాన్ని అందరికీ సంపూర్ణతలో ప్రకటించడం గురువుల బాధ్యత. సువార్తను బోధించడం అనేది ఆకర్షణీయమైన కర్తవ్యం, ఒక ఉత్తేజకరమైన అనుభవం.

నిర్వహించడం: మేత్రాసన పీటాధిపతుల అధికార పరిధిలో, విచారణ సంఘానికి సముచితమైన కాపరిగా, గురువు ఆధ్యాత్మిక పరిచర్యను, నాయకత్వంను నిర్వహిస్తారు (క్యానన్ 519). సంఘాన్ని అన్నివిధాల పెంపొందిస్తారు. విశ్వాసులను, ముఖ్యంగా పేదలు, రోగులు, ఒంటరిగా ఉన్నవారికి మద్దతు, ప్రోత్సాహం ఇస్తారు. విచారణ కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సామాన్య ప్రజల పాత్రను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తారు. విచారణ కార్యాలలో, సలహా కమిటీలలో వారి భాగస్వామ్యాన్ని, సహకారాన్ని ప్రోత్సహించడం గురువుల విధి.

అపోస్తులుల కార్యములు 10:42-43లో, “జీవితులకును, మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని, ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు, సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయనయందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరు పలికినది ఈయన గురించియేఅని పేతురు తన ప్రసంగంలో చెప్పారు. క్రీస్తు ప్రభువు సర్వ మానవాళి రక్షణకై చేసిన త్యాగమును, దేవుని విశ్వాసులైన ప్రజలకు ప్రకటించాలి. పేతురు గారు ప్రకటించినట్లు, సాక్ష్యమిస్తున్నట్లు, గురువులు మఠవాసులు సువార్తను ప్రకటించాలి, క్రీస్తుకు సాక్ష్యమివ్వాలి.

సువార్త పరిచర్య విస్తృతంగా సాగాలంటే, విచారణలోని ప్రజలను పరామర్శించాలి, వ్యక్తిగతముగా మాట్లాడాలి. కష్టసుఖాలను ఆలకించి, దేవుని ప్రేమలో బలపరచాలి. విచారణలో ఉన్న ప్రతి కుటుంబముతో సన్నిహితంగా ఉండాలి. ప్రజలకు సన్నిహితంగా ఉంటే, దైవానుసరణకు మరింత దగ్గర చేయొచ్చు. మొబైల్ ఫోన్స్ వలన, ప్రేమలు, యోగక్షేమాలు, పలకరింపులుపరామర్శలు..  కరువైన రోజుల్లో, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, వారి కష్టసుఖాలను ఆలకిస్తూ, కష్టాలలో, వ్యాధి బాధలలో, బలపరుస్తూ, దేవాలయమునకు/ దైవసన్నిధికి మరింత దగ్గర చేయాలి. అప్పుడు వారి మనసులకు ఎంతో ధైర్యము, మానసిక ఆనందము చేకూరి ప్రశాంతంగా జీవించడానికి, దేవుని యందు భక్తితో, ప్రార్ధనలో జీవిస్తారు. దేవుని యందు విశ్వాసముతో జీవించే దేవుని ప్రజల పాపములు దేవుని నామమైనయేసు నామములోక్షమింపబడునని, వారికి ప్రత్యేకంగా తెలియజేయడం రోజుల్లో ఎంతో అవసరం!

మఠవాసుల పాత్ర (బ్రదర్స్ మరియు సిస్టర్స్)

మఠవాసులు, పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత అనే సువార్త ప్రమాణాలను వాగ్దానం చేసి, శ్రీసభ ఆమోదించిన ఒక స్థిరమైన సంఘంలో దేవునికి అంకితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు! దైవాంకితులు శ్రీసభ జీవమునకు, పవిత్రతకు అత్యవసరం! ప్రధానంగా సంఘంలో, వారి దైవాంకిత జీవితానికి సాక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. వారి జీవితాలు దేవుని ప్రేమకు జీవిత సాక్ష్యాలు. పరలోక రాజ్యాన్ని భూలోకంలోనే తలపించే శక్తివంతమైన జీవితాలు వారివి! అష్టభాగ్యాల స్ఫూర్తి లేకుండా లోకం మారదని వారి జీవితాల ద్వారా మనకు నిరూపిత మవుతూ ఉంటుంది!

దైవాంకిత జీవితానికి సాక్ష్యమిస్తూనే, వారు మిషనరీ, సేవా కార్యాలు చేపడుతూ ఉంటారు. తద్వారా, శ్రీసభ సేవకు అంకితమై ఉంటారు. వారివారి సంస్థలు, సభల యొక్క నిర్దిష్ట ఆధ్యాత్మిక మరియు నియమావళికి అనుగుణంగా కట్టుబడి ఉంటూ, సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు.

మఠవాసులు చేసే వివిధ రకాల సేవలు ఏమిటంటే, విద్య (పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధన), వైద్య (ఆసుపత్రి పని, రోగులను పరామర్శించడం), దాతృత్వం, సామాజిక న్యాయం (పేదలు మరియు బాధిత ప్రజలతో పనిచేయడం). మఠవాసులు సమాజంలో ఎన్నో సేవలను అందిస్తున్నారు. స్కూల్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, వివిధ సామాజిక సేవలు చేయుచున్నారు. ఎంతో ఓర్పు, సంకల్పం ఉంటేనే, సేవలను చేయగలరు. చిరునవ్వుతో చిన్న పలకరింపు చాలు మనిషి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ముఖంపై చిరునవ్వు‌, మాటలలో దైవప్రేమ మరింతగా ఏర్పరచుకోవాలి! ప్రజలకు దగ్గరై, దేవుని ప్రేమను గూర్చి తెలియపరిస్తే, వారు దేవునికి మరింత చేరువవుతారు. మఠకన్యలు, స్త్రీలకుసమీపంగా ఉండాలి. స్త్రీ బాధ్యతగా నడుచుకుంటే, కుటుంబం, బలపడుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రవర్తన దైవానుసరణలో సంస్కారవంతంగా ఉంటుంది. మఠకన్యలు చేతనయినంతవరకు కుటుంబాలలోని స్త్రీలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలి. సమయం కుదిరినప్పుడల్లా స్త్రీలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారి హృదయాలలో ఉన్న బాధలను అడిగి తెలుసుకోవాలి! దేవుని వాక్కు ద్వారా ఊరటను కలిగించాలి. పాతకాలంలో మఠకన్యలు గ్రామాలలో క్యాంపులకు వెళ్లి, స్త్రీలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సాధక బాధలను విని, వారిని ధైర్యపరచి, దేవుని ప్రేమకు దగ్గర చేసేవారు. మఠకన్యలు, కుటుంబాలను దర్శిస్తే కుటుంబాలు దైవ ప్రేమలో దేవునికి మరింత చేరువవుతాయి!

మనందరికీ తెలిసిన విధంగా, మఠవాసులు, మఠకన్యలు, విచారణ సంఘానికి మద్దతుగా ఉంటారు. విచారణ సంఘాలలో పనిచేస్తూ, విచారణ గురువులకు సహాయం చేస్తారు, అది బాధ్యత, శ్రీసభ ఆజ్ఞ కూడా! సత్యోపదేశాన్ని బోధించడంలో, దివ్యసంస్కారాలకు సిద్ధం చేయడంలో, వివిధ విచారణ పండుగలకు, మీటింగులకు, క్యాంపులకు, మొదలగు విచారణ స్థాయి కార్యక్రమాలలో, విచారణ గురువులకు సహాయంగా ఉండటం వారి బాధ్యత!

సువార్త సేవలో ముఖ్యమైన విషయాలు

1. ఆత్మీయ అనుబంధం ద్వారా సువార్త ప్రకటన: మనం ఎన్ని సేవలు చేసిన, అంతిమ లక్ష్యం, క్రీస్తును ప్రకటించడం, క్రీస్తుకు సాక్ష్యమివ్వడం. సువార్త ప్రకటన అనేది ఉత్తేజకరమైన, మరియు వ్యక్తిగత అనుబంధం ద్వారా జరగాలి. వ్యక్తిగత సంబంధంలో ఎంతటి గాఢత, ఆత్మీయత కలిగి ఉంటారో, అంతగా అద్భుతాలు చేయగలరు. విద్య, వైద్య సేవలు మనల్ని నిరంతరం అనేకమందిని కలిసేలా చేస్తాయి. కాబట్టి, మన విద్యా సంస్థలను, వైద్య కేంద్రాలను వ్యక్తిగత కలయికలకు, మంచి అనుబంధాలకు కేంద్రాలుగా మార్చడం చాలా ముఖ్యం. ప్రజలకు అందుబాటులో ఉంటే, మనం ఎక్కడికి వెళ్లినా త్వరలోనే కొత్త సంబంధాలను ఏర్పరచుకోగలం. గ్రామ సందర్శనలు చేస్తే, చాలా మంది ప్రజలను కలవడానికి మంచి అవకాశం లభిస్తుంది. కతోలికేతరులైన పొరుగువారిని, స్కూలు పిల్లల తల్లిదండ్రులను కలుసుకోవడానికి, రోగులకు సేవ చేయడానికి, వారి గురించి, వారి పిల్లల పురోగతి గురించి తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇలాంటి సందర్శనల వలన కలిగే ఆత్మీయతలు పరస్పర అనుబంధ భావాన్ని కలిగిస్తాయి. కతోలిక సంఘంపై ఆసక్తిని కలిగిస్తాయి, తరచుగా విశ్వాసం వైపుకు ప్రేరేపిస్తాయి. మనం ఇతరులపై ఆసక్తి చూపిస్తే, వారు మనపై, మనం దేనికోసం పాటుబడుతున్నామో దానిపై ఆసక్తి చూపుతారు!

2. తరచుగా గ్రామ సందర్శనలు: తరచుగా గ్రామాలను సందర్శించడం చాలా ముఖ్యం. అనేక ప్రాంతాలలో, పద్ధతి కనుమరుగవుతోంది. గురువు గురునిలయంలోనే వేచి ఉండి, ప్రజలు తమ వద్దకు రావాలని, తమను పిలవాలని ఆశిస్తున్నారు. దీనివల్ల విచారణ కేంద్రాలు పూర్తిగా సంస్థాగతమైనవిగా మారిపోతున్నాయి. దీనికి విరుద్ధంగా, గురువులు అందరికీ అందుబాటులో ఉండటం, గ్రామాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండటం రోజుల్లో ఎంతో అవసరం! విచారణ కేంద్రం కేవలం పరిపాలనా విభాగం కాదు, అది విశ్వాసుల సహవాసం యొక్క స్ఫూర్తి కేంద్రం కావాలి! విచారణ గురువు, తన సహాగురువులతో కలిసి కేవలం నిర్వాహకులుగా కాక, ఆధ్యాత్మిక ప్రేరేపకులుగా, సంఘ ఐక్యతకు సాధనాలుగా మారాలి.

ప్రతి కాన్వెంటులో ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడూ గ్రామ పర్యటనల కోసం అందుబాటులో ఉండేలా చూస్తే ఎంతో బాగుంటుంది. వారు గ్రామాలను సందర్శిస్తూ, పిల్లలకు సత్యోపదేశం బోధించవచ్చు! యువతకు స్పూర్తినివ్వవచ్చు! పెద్దలకు ఉపదేశం చేయవచ్చు! రోగులను పరామర్శించవచ్చు! విశ్వాసం నుండి దూరమైన వారిని చేరుకోవచ్చు! కుటుంబాలలో శాంతిని నెలకొల్పుటకు సహాయం చేయవచ్చు! ఇలా మరెన్నో సేవలను అందించవచ్చు! అలాగే క్రైస్తవేతరుల గృహాలను కూడా సందర్శించవచ్చు!

3. క్రైస్తవ విద్యాసంస్థలలో, బోర్డింగులలో, పవిత్ర బైబిలును గ్రంథమును ధ్యానించి, దేవుని వాక్కును అనుసరించడమును ప్రోత్సహించాలి: ఈనాటి బాలలే రేపటి పౌరులు”. ఈనాటి పసి బాలలే రేపటి నిత్యజీవ వారసులుగా తీర్చిదిద్దాలి. చిన్న ప్రాయము నుండే, దైవానుసరణలో జీవించడం, దేవుని వాక్కును పటించడం, ధ్యానము చేయడం, వాక్కును అర్థం చేసుకోవడం విధంగా జీవించడం ఈనాటి బాలబాలికులకు ఎంతో అవసరం ప్రధానం. విద్యార్థుల జీవిత అనుసరణ  దైవానుసరణలో నడిపింప చేయడం ఎంతో ప్రధానం. విద్యార్థులు బాలలుగా ఉన్నప్పుడే, వారికి నీతి, న్యాయం, నియమం, విచక్షణా జ్ఞానం, పవిత్ర జీవితం, సంస్కారం అలవరచేటట్లు మన క్రైస్తవ విద్యాసంస్థలలో, యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకొని విద్యాసంస్థలను, బోర్టింగులను విధంగా నడిపించాలి. దిశగా కృషి చేయడం నేడు సంస్కారమంతమైన యువతరాన్ని తయారు చేయడం  ఎంతో అవసరం!

4. స్థానిక దైవ పిలుపులను ప్రోత్సాహించాలి: గురుత్వ జీవితానికి లేదా మఠవాస జీవితానికి స్థానిక దైవపిలుపులను ప్రోత్సహించడం నేడు ఎంతో అవసరం.

5. డిజిటల్ సువార్తా సేవ: నేటి కాలంలో, ప్రజలు సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాలలో ఎక్కువ చురుకుగా ఉంటున్నారు కనుక, గురువులు, మఠవాసులు డిజిటల్ ప్లా మాధ్యమాలను ఉపయోగించి క్రైస్తవ సందేశాన్ని, మంచి నీతిని, సువార్త సత్యాన్ని ప్రజలకు అందించడం అత్యవసరం.

6. లౌకికవాదం మరియు భిన్న మతాలు: సవాళ్లను ఎదుర్కొంటూ, గురువులు, మఠవాసులు తమ బోధనలో బైబులు సత్యాలతో పాటు, తార్కిక, దాంతపరమైన వివరణలను ఇస్తూ, విశ్వాసం మరియు తార్కికం మధ్య సమన్వయాన్ని తెలియ జేయాలి.

7.శిక్షణ: విచారణ సంఘాలలో, సమాజ నాయకులకు, సత్యోపదేశ బోధకులకు, ఉపదేశులకు, వివిధ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం గురువుల, మఠవాసుల ముఖ్య బాధ్యత.