Showing posts with label holy week. Show all posts
Showing posts with label holy week. Show all posts

ఈస్టర్

ఈస్టర్ / ఉత్థానము


క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును ఒక గొప్ప మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ మరియు ఇది ఒక నిరీక్షణ పండుగ! యేసుక్రీస్తు మరణమునుండి ఉత్థానమవుటను కొనియాడుచున్నాము. ఇది విశ్వాసులందరికి ఒక గొప్ప ఆశను, వారి  హృదయాలలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది.

మొదటి మానవుడు ఆదామునకు దేవుడు "ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదగా, జీవము గలవాడయ్యెను" (ఆ.కాం. 2:7). ఎప్పుడైతే, దేవుడు ఆ "ప్రాణవాయువును" తీసివేస్తాడో, అప్పుడు మానవుడు మరణిస్తాడని యూదులు అనేక శతాభ్దాలపాటుగా విశ్వసించారు. మరణించినవారు 'షియోల్' - నరకాగ్ని (మత్త 5:22; 25:41; మార్కు 9:46), నరకము (మత్త 5:29-30) నరకకూపము (మత్త 10:28), అగ్నిగుండము (మత్త 13:42), పాతాళ లోకము (కీర్త 6:5) - అనగా, మరణించినవారి స్థితి లేదా నివాస స్థానమున ఉందురని భావించారు. 'షియోల్' వెనక మరో జీవము, జీవితము ఉంటుందని వారు ఎప్పుడూ ఊహించలేదు. 'షియోల్'లో మరో జీవితానికిగాని, దేవునితో సహవాసమునకుగాని ఎటువంటి ఆస్కారము లేదు; మరణముతో అంతా ముగుస్తుందని, మానవునికి అదే శాశ్వత ముగింపు అని విశ్వసించారు. కనుక, ఆదికాండములోని పితరులవలె, భూలోకములోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, జీవించాలని ఆశించేవారు.

శ్రమలలో, మరణావస్థలో, కీర్తనకారుడు, "దేవా! నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము. నీవు కృప కలవాడవు కనుక నన్ను రక్షింపుము. మృతులు నిన్ను స్మరింపరు. పాతాళ లోకమున నిన్ను ఎవరు స్తుతింపరు" (6:4-5) అని మొరపెట్టుకున్నాడు. మరణం, జీవమునకు శత్రువు; ఎవరూ దానినుండి తప్పించుకొనలేరు (చదువుము కీర్తన 49:7-11). కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని పాతాళ లోకము నుండి రక్షించునని ఆశతో ప్రార్ధించేవారు (కీర్త 49:15).

పాత నిబంధనలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చవిచూడక, దేవునిచేత స్వర్గమునకు కొనిపోబడినారు. వారిలో ఒకరు హనోకు (ఆ.కాం. 5:24) మరియు ఇంకొకరు ఏలియా (2 రాజు 2:11). యూదుల చరిత్రలో, వీరిద్దరే మరణాన్ని చవిచూడలేదు; అయితే అవి ఉత్థాన గాధలు ఎంతమాత్రము కాదు. అలాగే, పాత నిబంధనలో, మరణించిన వారు దేవుని ప్రవక్తలచేత సజీవులుగా లేపబడటం మనం చూడవచ్చు - సారెఫతు విధవ పుత్రుడు చనిపోయి బ్రతుకుట (1 రాజు 17:7-24); షూనేము వనిత కుమారుడు చనిపోయి బ్రతుకుట (2 రాజు 4:31-37); ఒక ప్రేతము ఎలీషా ఆస్థికలను తగులగనే జీవముతో లేచి నిలుచుండుట (2 రాజు 20-21). ఇవి మరణానికి శాశ్వత పరిష్కారాలు ఎంతమాత్రము కావు. తన ప్రవక్తల ద్వారా, దేవుడు తన మహాశక్తిని ప్రదర్శించియున్నారు.

పునరుత్థానమును సూచించు కొన్ని ప్రవచనములను మనము పాత నిబంధనలో చూడవచ్చు: 
- "రెండు మూడు రోజులలో అతడు మనకు జీవము దయచేయును. ఇక మనమతని సన్నిధిలో వసింపవచ్చును" (హోషేయ 6:2); 
- ఎండిన ఎముకలు బ్రతికి లేచి నిలుచుండు ప్రవచనమును యెహెజ్కేలు 37:1-14లోను, పునరుత్థానమును గురించిన భావనను యెషయ 53:10-12లో చూడవచ్చు. 
- పాత నిబంధన కాలములో, ముఖ్యముగా 'వేదహింసల కాలము'న పునరుత్థాన భావన మరింత లోతుగా పరిగణించబడినది (యెషయ 24-27). 
- "ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లు తుడిచి వేయును" (యెషయ 25:6-8); 
- "మృతులైన నీ ప్రజలు మరల జీవింతురు. వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరు మరల లేచి, సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు, నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును" (యెషయ 26:19); 
- "అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలమంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవము బడయుదురు. మరికొందరు శాశ్వత అవమానముకు గురియగుదురు" (దానియేలు 12:2). 
- మక్కబీయుల గ్రంధములో పునరుత్థానము గురించి స్పష్టమైన ప్రవచనాలను చూడవచ్చు: అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, "రాక్షసుడా! నీవు మమ్ము చంపిన చంపవచ్చుగాక, కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము" అని అనెను (2 మక్క 7:9); 
- మృతులు మరల ఉత్థానమగుదురనే విశ్వాసముతో పాపపరిహారబలి అర్పించుట (2 మక్క 12:43-45). 
ఈవిధముగా పునరుత్థానమును గురించిన భావనలను, ప్రవచానములను మనం పాత నిబంధనలోనే చూడవచ్చు.

నూతన నిబంధనలో, శ్రమలు, సిలువ మరణము తరువాత, యేసు ఉత్థానముతో, ఉత్థానమును గురించిన అపోస్తలుల బోధనలతో, 'రాబోవు కాలములో దేవుడు మరణించిన వారిని, వారి కార్యాలను బట్టి సజీవులుగా లేపును' అని అర్ధమగుచున్నది (మత్త 25:31-46). నూతన నిబంధన వేదాంతమునకు, వ్రాతలకు మూలం, ఆధారం యేసు పునరుత్థానమే అని చెప్పడములో ఎలాంటి అతిశయోక్తి లేదు. "క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14) అని పౌలు స్పష్టం చేసియున్నారు. పునరుత్థాన గాధలు యేసు ఉత్థానమును గురించి బోధించడానికి అపోస్తలులకు దోహదపడ్డాయి. నూతన నిబంధనలో, కనీసం మూడు పునరుజ్జీవన గాధలను చూడవచ్చు: - చనిపోయిన యాయీరు కుమార్తెకు ప్రాణదానము (మార్కు 5:21-24, 35-43; మత్త 9:18-26; లూకా 8:40-42, 49-56); - చనిపోయిన నాయిను వితంతువు కుమారుడు లేపబడుట (లూకా 7:11-17); - పునర్జీవము పొందిన లాజరు (యోహాను 11;1-44; 12:1, 9, 17)

అపోస్తలులు, ప్రధమ క్రీస్తానుచరులు, యేసు పునరుత్థానమును దేవుని మహాశక్తిగాను, మహిమగాను, మానవాళి రక్షణ కార్యముగాను అర్ధము చేసుకున్నారు (గలతీ 1:1; రోమీ 4:24; ఎఫెసీ 1:20; కొలొస్సీ 2:12; 1 పేతురు 1:21). యేసు పునరుత్థానం సాతానుపై విజయముగాను పరిగణించారు. యేసు సిలువ మరణ సమయమున, శిష్యులందరు భయముతో చెల్లాచెదరై పోయారు. నిరాశతోను, భయముతోను ఉన్నారు. సిలువ మరణాన్ని చూసినవారు, అసహ్యకరమైన, హేయమైన, అవమానకరమైన మరణముగా భావించారు. అయితే, ఎప్పుడైతే, అపోస్తలులు, శిష్యులు, యేసు సిలువ మరణం దేవుని దృష్టిలో ఊహించని విషాదం కాదని, అది దైవచిత్తమని గ్రహించారో, అప్పుడు వారు క్రీస్తు ఉత్థానం గురించి ధైర్యముగా బోధించారు. రోమీయుల క్రూరత్వానికి, అవమానమునకు గురుతుగానున్న సిలువను, మరణముపై విజయాన్ని సాధించిన రక్షణకు గురుతుగా వారు బోధించారు.

క్రీస్తు ఉత్థానం గురించి మొట్టమొదటిగా, వ్రాయబడినది పౌలు లేఖలలోనే!  (1 తెస్స 1:10; 4:14; రోమీ 4:24-25; 6:4, 9; 7:4; 8:11, 34; 10:9; 1 కొరి 6:14; 15:4, 12; 2 కొరి 4:14; 5:15; గలతీ 1:1; ఎఫెసీ 1:20; కొలొస్సీ 2:12; 2 తిమో 2:8). యేసు తన పునరుత్థానము గురించి ప్రవచించిన ప్రవచనాల నేరవేర్పును సువార్తలలో చూడవచ్చు: మార్కు 16:1-8; మత్త 28:1-20; లూకా 24:1-53; 

యోహాను 20:1-29. యేసు పునరుత్థానమునందు విశ్వాసమునే అపోస్తలులు ప్రకటించిన సువార్త. అనగా, అపోస్తలులు ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు (అ.కా. 3:15; 4:10; 5:30; 10:40; 13:30, 37; 1 పేతురు 1:21). మరణించిన వారి పునరుత్థానము గురించి నూతన నిబంధన బోధిస్తుంది. జీవించు వారలకును, మరణించిన వారలకును క్రీస్తు తీర్పు చేయును. మానవాళి అంతిమ గమ్యం ఉత్థాన క్రీస్తు.

కనుక, క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన పండుగ! ఎందుకన మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాము. మరణం శాశ్వత ముగింపునకుగాక, నిత్యజీవితానికి ద్వారముగా యేసు చేసియున్నారు. మరణం, మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రియైన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశము. ఈస్టర్ మహోత్సవం, అంధకారములోనున్న వారికి వెలుగును, బాధలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్టశక్తులతో పోరాడే వారికి ధైర్యమును, బలమును ఒసగును.

పవిత్ర వారము - బుధవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - బుధవారం
యెషయ 50:4-9; మత్త 26:14-25

ధ్యానాంశము: కడరాత్రి భోజనము - యూదా గురుద్రోహము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మనుష్య కుమారుడు చంపబడును. కాని మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్ధము! అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యెడిది" (యోహాను 26:24).
ధ్యానము: పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, "మేము ఎచట పాస్క భోజనము సిద్ధపరుప గోరెదవు? అని ప్రశ్నించిరి. యేసు ఆజ్ఞాసుసారముగా, శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి (26:17-19).

యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల వద్ద ముప్పది వెండి నాణెములు తీసుకొని, యేసును వారికి అప్పగింప తగిన సమయమునకై వేచి యుండెను (26:14-16). ద్రోహం చేయటం, ముఖ్యముగా మనకు బాగా దగ్గరగా ఉన్నవారే, నమ్మకద్రోహం చేస్తే అది మనలను ఎంతగానో బాధిస్తుంది. నమ్మక ద్రోహం అనేది ఘోరమైన నేరం! అది మన అంతరంగాన్ని ఎంతగానో బాధిస్తుంది. మోసంచేయబడ్డాము, తిరస్కరించబడ్డాము అని ఒంటరివారముగా అయిపోతాము. అలాంటి నమ్మకద్రోహాన్ని యూదా, తన గురువైన యేసుకు తలపెట్టాడు.

సాయంకాలము కాగా, యేసు పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ, యూదా ద్రోహము గురించి ముందుగానే ఎరిగిన ప్రభువు, "మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (26:21) అని అన్నారు. శిష్యులందరు మిగుల చింతించిరి. "ప్రభూ!, నేనా" అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు యేసు, "నాతోపాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వారు నన్ను అప్పగించును" అని అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, "గురువా! నేనా?" అని అడుగగా, "నేవే చెప్పుచున్నావు" అని యేసు సమాధానము ఇచ్చెను" (26:20-25).

యూదా ద్రోహానికి కారణాలు: దురాశ కావొచ్చు! బెతానియాలో, మరియమ్మ పరిమళ ద్రవ్యముతో యేసు పాదములను అభిషేకించినపుడు, "పరిమళ ద్రవ్యమును మూడు వందల దీనారములకు అమ్మి పేదలకు ఈయగూడదా? అని యూదా అన్నాడు. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయన, వాడు దొంగ, తన యొద్ద నున్న డబ్బుల సంచి నుండి దొంగిలించు చుండును" (యోహాను 12:5-6). క్రీస్తుపట్ల ద్వేషం కావొచ్చు! వాస్తవానికి, యూదా అత్యంత జాతీయవాద కుటుంబము నుండి వచ్చాడు. బహుశా, ఓ గొప్ప జాతీయ నాయకుడిని యేసులో చూడాలనుకొని యుండవచ్చు! యేసు తన దైవీక శక్తిని ఉపయోగించి, రోమాసామ్రాజ్యాన్ని నాశనం చేయాలని యూదా కాంక్షించాడు. అది జరగక పోవుట వలన, యేసుపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. యూదా తాను మారకుండా, యేసును ఆయన ప్రేషిత కార్యాన్నే మార్చాలని అనుకున్నాడు. యేసు బోధనలను విన్నాడు, కాని ఆలకించలేదు, పాటించలేదు. హృదయ పరివర్తన చెందలేదు.

మనం చేసే ప్రతీ పాపం, దేవుని మంచితనానికి ద్రోహం తలపెడుతున్నామని గ్రహించాలి. మన విశ్వాసాన్ని బలపరచమని ప్రార్ధిద్దాం! శోధనలలో యేసును విడువక, విశ్వాసం కోల్పోకుండునట్లు ప్రార్ధిద్దాం!

పవిత్ర వారము - మంగళవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - మంగళవారం
యెషయ 49:1-6; యోహాను 13:21-33, 36-38 

ధ్యానాంశము: గురుద్రోహమును గూర్చిన సూచన; పేతురు బొంకు-యేసు ప్రవచనము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను... "నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 13:21, 38).
ధ్యానము: నేటి సువిశేష పఠనములో, ఇద్దరు శిష్యుల గురుద్రోహమును చూస్తున్నాము. ఒకటి యూదా గురుద్రోహము; రెండు పేతురు బొంకు. పాస్కా పండుగకు ముందు రోజున, యేసు మరియు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు తన శిష్యుల పాదములను కడిగారు (యోహాను 13:4). వారినికూడా అట్లే చేయమని ఆజ్ఞాపించారు (యోహాను 13:14-15). యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింప వలయునను ఆలోచన కలిగించెను (యోహాను 13:2). ఈ సందర్భముగా, సమస్త హృదయాలను ఎరిగిన యేసు ప్రభువు, "మీలో అందరు శుద్ధులు కారు" (యోహాను 13:11) అని పలికారు. "నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును" అను లేఖనమును కూడా యేసు గుర్తుచేసెను (యోహాను 13:18).  అలాగే, "మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని స్పష్టముగా పలికెను (యోహాను 13:21). ఎవరి గురించి అని సందేహించుచు, శిష్యులు ఒకరి వంక మరియొకరు చూచుకొన సాగిరి. "నేను రొట్టె ముక్కను ముంచి, ఎవనికి ఇచ్చెదనో అతడే" అని యేసు చెప్పి, ఒక రొట్టె ముక్కను ముంచి, సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. సైతాను వానిలో ప్రవేశించెను. ఆ రొట్టె ముక్కను తీసికొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ (యోహాను 13:26-30). కాని, ఆ సమయములో, యూదా గురుద్రోహము మిగతా శిష్యులకు అర్ధము కాలేదు.

ఆ తరువాత యేసు, "చిన్న బిడ్డలారా! నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు" (యోహాను 13:33) అని శిష్యులతో చెప్పెను. అందుకు, పేతురు, "ప్రభూ! మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను (యోహాను 13:37) అని పలికాడు. అందుకు యేసు, "నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 13:38) అని చెప్పెను.

యూదా - పేతురుల మధ్యన వ్యత్యాసం
ఈవిధముగా, యేసు యూదా ద్రోహాన్ని, పేతురు బొంకును ముందుగానే బట్టబయలు చేసారు. అయితే, వీరిద్దరి మధ్యనున్న వ్యత్యాసం ఏమిటో తెలుసుకోవడం, మన జీవితాలకు ఎంతగానో తోడ్పడుతుంది. యూదా ద్రోహం ఉద్దేశపూర్వకమైనది, క్రూరమైనది, ప్రణాళికతో కూడినది. ఒక వ్యక్తికి రొట్టెను ముంచి ఇవ్వడం అంటే, ఆ వ్యక్తితో అతి సన్నిహిత స్నేహానికి సూచన. అలాంటి సన్నిహిత స్నేహానికి యూదా ద్రోహం చేసాడు. పేతురు, తన బలహీనమైన క్షణములో యేసు ఎవరో ఎరుగనని బొంకాడు. తాను చేసినదానిని చేయాలని అతడు ఎప్పుడు అనుకోలేదు. పేతురు విధేయత అతనికి బలం మరియు అతని బలహీనత. ఆ  రెండూ ప్రభువునకు బాగా తెలుసు.

మనందరికీ బలహీనతలు ఉన్నాయి. అందరం పాపాత్ములమే. అయినప్పటికిని, దేవుడు బలహీనులను ప్రేమిస్తారు. అయితే, మన బలహీనతలను, పాపాలను నిరాకరిస్తాము, సమర్ధిస్తాము, వాటిని కప్పిపుచ్చుతాము. బలహీనులమైన మనలను దేవుడు బలవంతులను చేయాలంటే...
- మన బలహీనతలను, పాపాలను తెలుసుకొని ఒప్పుకోవాలి: "నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చున్నది" (2 కొరి 12:9) అని ప్రభువు పౌలుతో చెప్పెను. కనుక, మన బలహీనతలు దేవునిపై ఆధారపడునట్లు చేయును. మన బలహీనతలపట్ల నిరాశ చెంద కూడదు. మనలను మనం దేవునికి అర్పిస్తే, మన బలహీనతలను దేవుడు తీసివేస్తారు. మనలను తన ఆత్మతో బలవంతులను చేస్తారు. ప్రభువు సమక్షములో ఒప్పుకొని, ప్రార్ధన చేయాలి. "బలహీనులమైన మనకు దేవుని ఆత్మ సాయపడును" (రోమీ 8:26).

పవిత్ర వారము - సోమవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - సోమవారం
యెషయ 42:1-7; యోహాను 12:1-11 

ధ్యానాంశము: బెతానియాలో అభిషేకము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆమెను అట్లు చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను" (యోహాను 12:7-8).
ధ్యానము: పాస్కా పండుగకు, ఆరు రోజులు ముందుగా యేసు బెతానియా గ్రామమునకు వెళ్ళారు. అది మరియమ్మ, మార్తమ్మ, మృతులలో నుండి లేపబడిన లాజరుల స్వగ్రామము. అక్కడ యేసుకు విందు ఏర్పాటు చేయబడినది. అప్పుడు మరియమ్మ పరిమళ ద్రవ్యముతో యేసు పాదములను అభిషేకించి, తన తల వెంట్రుకలతో తుడిచినది. ఆ పరిమళ ద్రవ్యాన్ని ఆమె వృధా చేసినదని యూదా ఇస్కారియోతు భావించాడు. దానిని అమ్మి పేదలకు దానము చేయకూడదా? అని ప్రశ్నించాడు. ఎందుకన, అతడు దొంగ, తన యొద్ద నున్న డబ్బుల సంచి నుండి దొంగిలించు చుండేవాడు. అప్పుడు యేసు, "ఆమెను అట్లు చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను" (యోహాను 12:7-8) అని పలికెను.

పరిమళ ద్రవ్యముతో మరియమ్మ అభిషేకం, యేసుపై ఆమెకు గల ప్రేమను చాటుచున్నది. అలాగే, మరణించిన తన తమ్ముడైన లాజరును బ్రతికించినందులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతను చాటుచున్నది. ఆమె చేసిన దానిని [ఆరాధన, స్తుతి, ప్రార్ధన, కృతజ్ఞత] ప్రభువు అభినందించారు.

ఇక్కడ గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పేదవారికి సహాయం చేయడాన్ని మరియు దేవున్ని ఆరాధించడాన్ని, రెండింటికి ప్రాధాన్యతను ఇవ్వాలి. కొంతమంది, దానధర్మాలు చేస్తే చాలు, గుడికి రానవసరం లేదు; గుడిలో వేసే డబ్బులు వృధా అని భావిస్తారు. అది చాలా తప్పుడు భావన. దేవాలయములో, పేద విధవరాలు, తనకున్నదంతటి రెండు నాణెములను, చందా పెట్టెలో వేయటాన్ని చూసిన ప్రభువు ఆమెను అభినందించారు. పేదవారికి సహాయం చేయాలి, అలాగే, దేవాలయములో దేవునకు ప్రార్ధనలు చేయాలి. దేవాలయాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవాలి. చక్కటి అలంకరణలు చేయాలి. ముఖ్యముగా, బలిపీఠము, దివ్యమందసములను అందముగా అలంకరించు కోవాలి. ఇవన్ని కూడా, మన భక్తికి, విశ్వాసానికి సూచనలు. అయితే, నేడు దేవాలయ నిర్మాణాలలో [పోటీలు పడుతూ] కోట్ల కొలది డబ్బులను వెచ్చిస్తున్నారు. పేదవారిని పట్టించుకోకుండా, అంత అనవసరపు ఖర్చులను కూడా వెచ్చించడాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరికొంతమంది, రోజూ ఆరాధనలు, ప్రార్ధనలు, పూజలు చేస్తే సరిపోతుంది, ఇతరులకు ముఖ్యముగా పేదవారికి ఎందుకు సహాయం చేయాలి అని భావిస్తారు. ఇది కూడా తప్పుడు భావనే! దేవునిపై మనం చూపించే ప్రేమ, మన తోటివారిపై కూడా చూపించాలి. దేవుడు మనలను ప్రేమించినట్లుగా, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఒంటరి జీవితం కాదు. స్వార్ధపూరితమైన జీవితం కాదు. మన జీవితం ఒక సంఘ [శ్రీసభ] పరమైన జీవితం. మనం క్రీస్తు శరీరములో భాగస్తులం. కనుక, అందరం ఒకే కుటుంబం. మనకున్న దానిని [ధనం, సమయం, మంచి మాట, చిరునవ్వు, చేయూత...] ఇతరులతో పంచుకోవాలి. మనం ఇతరులకు చేసే ఏ చిన్న సహాయం అయినను, అది క్రీస్తుకు చేసినట్లగును! మనలో చాలామందిమి ఈ రెండింటిలో, ఒక దానికే ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము.

బెతానియాలో ఉన్నటువంటి ప్రభువును ప్రధానార్చకులు చంపుటకు కుట్రలు చేసారు. ఎందుకన, లాజరును సజీవముగా లేపడముతో, అనేకమంది ఆయనను విశ్వసించు చుండిరి (11:45; 12:11).

యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము,

 యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, 3 ఏప్రిల్ 2021
(
అర్దరాత్రి పూజ)

జయహో! యేసు నేడు లేచెను, జయహో!
'రణం' అనేది ఓ యుద్ధం.
ఆ యుద్ధాన్ని గెలవడమే ఉత్థానం.
ఆ యుద్ధాన్ని గెలిచాడు ఓ సమర యోధుడు
ఆ సమర యోధుడే ... యేసు.
అల్లెలూయ!!!
నలభై రోజుల కఠోర ఉపవాస ప్రార్ధనలు...
సైతానుచే శోధింపులు...
క్రూరమైన బాధలు...
సిలువపై ఘోరమైన మరణం...
మూడవ రోజు ఉత్థానం.

అదే క్రీస్తు పునరుత్థాన పండుగ సారాంశం. విశ్రాంతి దినము గడచి పోగానే యేసుకు సుగంధ ద్రవ్యములను పూయడానికి మగ్దల మరియమ్మతోపాటు మరో ఇద్దరు స్త్రీలు యేసు సమాధి వద్దకు బయలుదేరారు. కాని, అప్పటికే, ఆ పెద్ద సమాధి రాతి తొలగించ బడటము చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడే తెల్లదుస్తులతో ఉన్న ఓ వ్యక్తి వారిని గమనించి వారితో “కలవర పడకుడి. మీరు వెదకుచున్న యేసు ఉత్థానమయ్యాడు. మీరు వెళ్లి ఈ వార్తను వారి శిష్యులకు తెలియ జేయుడు” అని అనెను (మార్కు 16:1-7).

సిలువపై యేసు మరణం ఎవరికోసం? ఎందుకీ త్యాగం? నీ కోసం - నా కోసం - యావత్ మానవాళి పాప ప్రక్షాళన కోసం! ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళిపై తనకెంత ప్రేమ ఉందో తన రెండు చేతులు చాచి సిలువపై మరణిస్తూ మనకు చూపించాడు క్రీస్తు ప్రభువు. ఇంతకన్న గొప్ప నిదర్శనం వేరొకటి మనకు అవసరం లేదు.

సిలువను మోస్తున్నప్పుడు అతనిపై వేసిన నిందలు, శారీరక వేదన వర్ణింపతరం కానివి. “అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు” అని బిగ్గరగా వినిపించిన కేకలు అతని గుండెల్లో గునపములా గుచ్చుకొన్నాయి. ఇన్ని వేదనలను, చీవాట్లను భరించడం ఎవరితరం అవుతుందో చెప్పండి! ఆ నిందలన్నింటినీ భరిస్తూ, ఆకాశానికి భూమికి మధ్య సిలువపై రక్తపు మరకలతో వ్రేలాడుతూ “తండ్రీ, వీరిని క్షమింపుము. వీరు చేయుచున్నదేదో వీరికి తెలియదు” (లూకా 23:34) అని తన తండ్రికి మొరపెట్టుకొన్నాడు. అల్లెలూయ! ప్రేమంటే ఇదే!

యెష 54:10, “పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు” అని యావే ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం దైవప్రేమకు ఓ చక్కటి ప్రతిరూపం. మరణం అనేది సమాప్తం కాదు. అది ఓ క్రొత్త జీవితానికి ఆరంభం మాత్రమే! ఈనాటి పఠనంలో పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: “ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో, ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. మనము క్రీస్తుతో మరణించి యున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను” (రోమీ 6:5,8-11).

క్రీస్తు తన ఉత్తానము ద్వారా యావత్ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. తన ఉత్థానం ద్వారా పాపాన్ని పటాపంచలు చేశాడు. “మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఉత్తాన క్రీస్తు యొక్క ప్రేమ, దీవెనలు మనందరితో ఉండునుగాక!

యేసు మృత్యుంజయుడు

ప్రియ సహోదరీ, సహోదరులారా! మీ అందరికి ప్రభువు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు! ఈ పవిత్ర రాత్రియందు మనము క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. పాపము, మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడు చున్నాము. ఈ రాత్రి చాలా అద్భుతమైన రాత్రి, ఎందుకన, ఈ రాత్రిన మనం విజయం, విముక్తి, రక్షణ, స్వతంత్రం, స్వస్థత పొందిన రాత్రి. 

క్రీస్తు ఉత్థాన (ఈస్టర్) పండుగ మనందరికీ, ఆనందకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మహోత్సవం. ఇది అన్ని పండుగలలో కెల్ల గొప్ప పండుగ. ఈ పండుగను మనం అర్ధవంతముగా జరుపుకొనని యెడల, మనం కొనియాడే మిగతా పండుగలన్నీ కూడా వృధాయే! ఎందుకన,
(1).
మన క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ఉత్థానం మూలాధారం. యేసు దేవుడని చెప్పడానికి సాక్ష్యం. అందుకే, పౌలుగారు ఇలా అంటున్నారు, “క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధనా వ్యర్ధమే! మీ విశ్వాసమును వ్యర్ధమే!” (1కొరి 15:14). కనుక మనం చేయవలసినది ఏమిటంటే, “నీ నోటితో యేసు ‘ప్రభువు’ అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింప బడుదువు” (రోమీ 10:9).
(2). క్రీస్తు ఉత్థానం మన ఉత్థానానికి హామీ. లాజరు సమాధివద్ద యేసు మార్తమ్మకు ఈవిధముగా హామీ ఇచ్చాడు, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును” (యోహాను 11:25). కనుక, "ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై యుండినచో. ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై యుందుము" (రోమీ 6:5). 
(3). క్రీస్తు ఉత్థానం ఈలోక శ్రమలలో, బాధలలో, మనకు ఆశను మరియు ప్రోత్సాహాన్ని కలిగించును. 
క్రీస్తు ఉత్థానం జీవితముపై ఓ గొప్ప నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం మనలో, శ్రీసభలో, సంఘములో, దివ్యసత్ప్రసాదములో ఉన్నదని నమ్ముచున్నాము కనుక మన జీవితాలకు అర్ధం చేకూరుతుంది.
(4). ఈరోజు మనం దేవుని కృపలోనికి తిరిగి పునరుద్దరింప బడినాము. ఈరోజు ప్రభువు మరణపు సంకెళ్ళను తెంచి ఈ లోకానికి వెలుగును, జీవమును ఒసగిన రోజు! మరణించిన యేసు పునరుత్థానమైన రోజు! అందుకే ఈరోజు, దేవుని చేత ఎన్నుకొనబడిన ఆశీర్వాదకరమైన రోజు ఈ ఈస్టర్ రోజు!

మనం ప్రభువును ఎక్కడ వెదుకుచున్నాము? ఖాళీ సమాధిలోనా? సువార్తలో వింటున్నట్లుగా స్త్రీలు సమాధిని చూచుటకై వచ్చిరి, కాని వారికి ఖాళీ సమాధి కనబడెను. “భయపడకుడు. మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు” (మత్త. 28: 5-7) అని దూత వారికి చెప్పెను. ప్రభువునకు సమాధి అవసరము లేదు, ఎందుకన ఆయన మృత్యుంజయుడు. ఆ సమాధి ఆయనది కూడా కాదు. తన శిష్యుడు, ధనికుడు అయిన అరిమత్తయియవాసి యోసేపు సమాధి! సమాధి ప్రభువును కలిగియుండలేక పోయింది, ఎందుకన, ఆయన పునరుత్థానమై బయటకు వచ్చాడు. మార్గమధ్యలో ఆ స్త్రీలకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను. “మీకు శుభము. భయపడవలదు. మీరు వెళ్లి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” (మత్తయి 28:9-10) అని వారితో చెప్పెను.

మనం విన్నటువంటి పఠనాలు మానవ చరిత్రలో దేవుడు తన రక్షణ ప్రణాళికను ఎలా కొనసాగించాడో అన్న విషయాన్ని తెలియజేయు చున్నాయి. దేవుడు తరతరాలుగా తన ప్రజల పట్ల నమ్మకపాత్రుడుగా ఉన్నాడు. ప్రజల అవిశ్వాస సమయములో, కష్ట సమయములో వారి వెన్నంట ఉండి వారిని నడిపించాడు. ఈ రక్షణ ప్రణాళిక క్రీస్తు ఉత్థానములో అంతిమ ఘట్టానికి చేరుకుంటుంది. కనుక, మనం ప్రభువును వెదకవలసినది ఖాళీ సమాధిలో కాదు! చారిత్రాత్మకమైన ఘట్టాన్ని కొనియాడటం కాదు! క్రీస్తు ఉత్థానాన్ని విశ్వాస దృక్పధముతో చూడాలి. కనుక, ఉత్థాన క్రీస్తును వెదకవలసినది నీలోనే! ఆయన నీలోనే కొలువై యున్నాడు. ఉత్థాన ఆనందము, సంతోషము, ఆశీర్వాదము మనలోనే ఉన్నది. సువార్తానందము మనలోనే ఉన్నది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకు ప్రకటించాలి.

ఈరోజు, మరణం జీవానికి గుర్తుగా మారింది! సిలువ లేనిది కిరీటం లేదు, మరణం లేనిది జీవం లేదు, నిరాశ లేనిది ఆశ లేదు, చీకటి లేనిది వెలుగు లేదు. అందుకే ఈ రోజు వెలుగు క్రీస్తు జ్యోతిపండుగగా కొనియాడు చున్నాము. నేనే వెలుగు” (యోహాను 8:12) అని క్రీస్తు పలికిన పలుకులే ఈరోజు పండుగ సారాంశం!

కనుక, మనం ఉత్థాన క్రీస్తు ప్రజలుగా జీవించాలి. అనగా పాపము అనే సమాధిలో ఉండక సంతోషము, సమాధానముతో జీవించాలి. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని అంతటా చూడగలగాలి. ఉత్థాన క్రీస్తు వెలుగును, ప్రేమ, దయ, కరుణ, త్యజింపు, సేవతో కూడిన మన జీవితాలద్వారా మనచుట్టూ ప్రసరింప జేయాలి.

ఈరోజు మనం కొనియాడే పండుగలో, నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: 1. అగ్ని లేదా వెలుగు, 2. నీరు, 3. దైవవాక్కు మరియు 4. రొట్టె. వీటిని ధ్యానించుదాం!

1. అగ్ని/వెలుగు: ఈస్టర్ జాగరణ సాంగ్యాన్ని చీకటిలో - నూతన అగ్నితో ప్రారంభించాము. ఆ అగ్నినుండి ఈస్టర్ - పాస్కా క్రొవ్విత్తిని వెలిగించాము. ఈ ఈస్టర్ క్రొవ్విత్తి లేదా పాస్కా క్రొవ్వొత్తి ఉత్థాన ప్రభువును సూచిస్తుంది. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును (యోహాను 8:12) అని యేసు చెప్పి యున్నాడు. అందుకే ఈస్టర్ క్రొవ్విత్తి నుండి వెలుగును మన క్రొవ్వొత్తులను వెలుగించు కున్నాము. అనగా, క్రీస్తు మన జీవితాలను ప్రకాశింప జేయుచున్నాడు. క్రీస్తు వెలుగును మనం పొందు చున్నాము. “మీరు లోకమునకు వెలుగై యున్నారు” (మత్తయి 5:14) అని ప్రభువు శిష్యులతో చెప్పియున్నాడు. మన వెలుగు క్రీస్తు నుండి వచ్చును, మన జీవితం క్రీస్తు నుండి వచ్చును. క్రీస్తు ఈ వెలుగును తన మరణ, పునరుత్థానాల ద్వారా కొనివచ్చాడు.

వెలుగు (క్రీస్తు) మన హృదయాలను, జీవితాలను ప్రకాశింప జేయును, వెలుగింప జేయును, జ్ఞానోదయం కలుగ జేయును. మనలోనున్న అంధకారమును తొలగించును. మనలోనున్న అజ్ఞానమును తీసివేయును. దేవుడు మనలను తన రూపములో, పోలికలో సృష్టించాడు. అదే దేవుడు మనలను తన వారిగా పిలుచుకున్నాడు. ఈలోకము మనలను ఎన్నుకొన లేదు, పిలువ లేదు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువు ద్వారా ఎన్నుకున్నాడు, పిలుచు కున్నాడు. క్రీస్తు జ్యోతి వలన, మనం అసత్యము నుండి సత్యమునకు, అంధకారము నుండి వెలుగునకు, మరణము నుండి జీవమునకు నడిపింప బడినాము.

వెలుగు (క్రీస్తు) విశ్వాసానికి, నమ్మకానికి సూచన. చీకటి అంటే మనందరికి భయం. అందుకే దీపాలను వెలిగిస్తాము. యేసు మనందరికీ నిజమైన వెలుగు. ఆయన మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాడు. వెలుగుగా ఆయనే మన మార్గ చూపరి. ఆయననే మనం అనుసరించుదాం. ఆయన ఎప్పటికి మనలను అంధకారము లోనికి త్రోసి వేయడు. ఆయనే మన వెలుగు, నమ్మకము.

వెలుగు (క్రీస్తు) ఆనందానికి సూచన. “ప్రభువు నందు ఎల్లప్పుడును ఆనందింపుడు. మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!” (ఫిలిప్పీ 4:4) అని పౌలుగారు చెప్పియున్నారు. యేసు ప్రభువే మన ఆనందం, సంతోషం. ఈలోకం మనకు ఏవిధముగను ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు, పదవి, ప్రతిష్ట, గొప్పతనం, అధికారం... ఏదీ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. నిత్యమైన, నిజమైన ఆనందమును యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. “మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు” (యోహాను 16:22) అని ప్రభువు చెప్పి యున్నారు.

2. నీరు: రోమీయులకు వ్రాసిన పత్రిక 6:3-11లో జ్ఞానస్నానము గురించి వింటున్నాము. “మనము అందరమూ క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందాము. ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచు కున్నాము. తద్వారా, ఒక క్రొత్త జీవితమును గడుపుచున్నాము. మనలో పాత స్వభావము, పాపము నశించినది.” మన జ్ఞానస్నానము ద్వారా, మనము రక్షింప బడినాము మరియు రూపాంతరము చెందినాము, పునరుద్దరింప బడినాము. యిస్రాయేలు బానిసత్వము నుండి వాగ్ధత్త భూమికి ఎర్ర సముద్రము గుండా నడిపింప బడినారు. అలాగే ఈరోజు మనము క్రీస్తు మరణము, ఉత్థానము ద్వారా స్వతంత్రము లోనికి నడిపింప బడుచున్నాము. మనము ఇక పాపమునకు బానిసలము కాము. క్రీస్తు నందు మనము స్వతంత్రులము. పాపమునకు మరణించి క్రీస్తుతో సజీవులము అయ్యాము.

నీరు శుభ్రపరచే స్వభావము కలది. మనము నీటితో చేతులను శుభ్ర పరచు కుంటాము. నిత్య జీవజలమైన క్రీస్తు మనలను పవిత్ర పరచును. మన జ్ఞానస్నానమందు మనము పవిత్ర పరచ బడినాము. ఆదిపాపము మనలో నుండి తీసివేయ బడినది.

నీరు మన దాహమును తీర్చును. దాహము గొన్నప్పుడు, ఏ యితర పానీయాలు మన దాహాన్ని తీర్చలేవు. ఒక్క గ్లాసు మంచి నీరు కోసం చూస్తూ ఉంటాము. ఈరోజు మనం దేనికోసం దాహంకలిగి యున్నాము? డబ్బు, అధికారం, పదవి కోసమా? ఇవి ఏవియు కూడా మన దాహాన్ని తీర్చలేవు. ఎప్పుడైతే ప్రభువు కోసం దాహమును కలిగి ఉంటామో, ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. కనుక ఈ లోక ఆశల వెనుక, శోధనల వెనుక పరుగులు తీయక ప్రభువు కోసం పరుగులు తీద్దాం.

నీరు తాజాదనమును ఇచ్చును. పూలు వాడిపోకూడదని వాటిపై నీళ్ళను చల్లుతూ ఉంటారు. నీరు ఆ పూవులను తాజాదనముగా ఉంచుతాయి. యేసు ప్రభువు మన జీవితాలను తాజాదనముగా ఉంచువాడు. ఆధ్యాత్మికముగా, బుద్ధివికాసములో, మానసికంగా, భౌతికముగా అన్ని విధాలా ప్రభువు మనలను తాజాదనముగా, తేజోవంతముగా చేయును.

నీరు ఏ ఆకారమునైనా తీసుకొనును. నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారములో ఇమిడి పోతుంది. నీటికి సులువుగా ఇమిడిపోయే స్వభావం ఉన్నది. అలాగే, ప్రభువు ఈ లోకములోనికి వచ్చి, ఒక్క పాపము విషయములో తప్ప, అన్నీ విషయాలలో మానవ స్వభావాన్ని కలిగి జీవించాడు. ఆయన ఇమ్మానుయేలు, 'మనతో ఉన్నాడు'. మనము కూడా మనతో మరియు ఇతరులతో ఇమిడిపోయే, వారితో కలిసిపోయే సర్దుబాటు స్వభావాన్ని కలిగి యుండాలి.

3. దైవవాక్కు: ఇది దేవుని శక్తి. మనం దేవుని వాక్కుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం లేదని అంటూ ఉంటారు. కాని అది అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, మనము ఏ కార్యము చేసినను దేవుని వాక్కుతోనే ప్రారంభిస్తాము. వాక్కు లేనిచో మన జీవితాలు శూన్యమే! దైవవాక్కు, మనలను మార్చును, నడిపించును, రక్షణ ఒసగును. దైవవాక్కు మనకు బలమును, ధైర్యమును ఒసగును. “భూమ్యాకాశములు గతించి పోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించి పోవు” (లూకా 21:33) అని ప్రభువు పలికి యున్నారు. మన ప్రతీ సమస్యకు పరిష్కారం బైబులులో దొరుకుతుంది. నమ్ముదాం! విశ్వసించుదాం! బైబులు గ్రంథ పుటలను తిరగ వేద్దాం. దేవుని వాక్కును చదివి, ధ్యానించి, మన జీవితాలకు అన్వయించు కుందాం! దేవుని వాక్కును గౌరవించుదాం. దైవవాక్కు అనగా స్వయాన క్రీస్తు ప్రభువే! “ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను” (యోహాను 1:14).

4. రొట్టె: ప్రతీ రోజు మనం దివ్య పూజా బలిలో పాల్గొను చున్నాము. కాని, ఈరోజు, దివ్యపూజాబలి ప్రత్యేక మైనది. ఈరోజు రొట్టె విరవడం చాలా అర్ధవంత మైనది. శిష్యులు ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచుండగా వారితో కలిసి ప్రయాణం చేయుచున్న ఉత్థాన ప్రభువును వారు గుర్తించలేక పోయారు. తోటి ప్రయాణికినిగా మాత్రమే భావించారు. కాని ఎమ్మావు గ్రామములో ప్రభువు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి, విరచినప్పుడు వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించారు (లూకా 24:30-31). ఈనాడు ప్రభువు రొట్టె విరువగనే, శిష్యులలో కనువిప్పు కలిగి ప్రభువును గుర్తించారు. ఈనాడు గురువు దివ్యపూజా బలిలో రొట్టె విరచినప్పుడు, మన కన్నులు, హృదయాలు తెరువబడును. చాలాసార్లు ఈ మహిమను, బహుమానమును గుర్తించలేక పోవుచున్నాము. మన కన్నులను తెరువాలని ప్రార్ధన చేద్దాం. భౌతిమైన చూపు కాదు, ఆధ్యాత్మిక కన్నులను తెరువమని ప్రార్ధన చేద్దాం (not sight to the body, but insight to the soul). అంత:ర్గత / ఆధ్యాత్మిక చూపు సరిగా నున్నప్పుడు, భౌతిక చూపు దానంతట అదే బాగుంటుంది. రొట్టె విరచినప్పుడు, ప్రభువు ఉత్థానమైనాడని గుర్తించుతాము.

ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ నాలుగు అంశముల ద్వారా ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియజేయు చున్నాడు. మనం ఏమి చేయాలి? యోహాను వ్రాసిన మొదటి లేఖలో ఇలా చదువు చున్నాము: ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునప్పుడు ఆయన యాదార్ధ రూపమును మనము చూతము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును” (1 యోహాను 3:2). "దివినుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి యున్నాము" (ఫిలిప్పీ 3:20). కనుక, ప్రభువును కలుసు కొనుటకు మనం సిద్ధపడాలి. అదే మన జీవిత ఆశయం! దీనికి మనము అనునిత్యము ప్రార్ధన చేయాలి. దేవునకు మనలను అర్పించుకుందాం. క్రైస్తవులుగా, ఆనందదాయకమైన వారిగా ఉందాం. ఉత్థాన క్రీస్తు మనలను ఆశీర్వదించునుగాక!

పవిత్ర శుక్రవారము Year B

పవిత్ర శుక్రవారము - Year B
యెషయ 52:13-53:12, హెబ్రీ. 4:14-16, 5:7-9, యోహాను 18:1-19:42

సకల వరములకు  ఊటయగు ఓ దేవా! మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్ర పరచుము.

ఈ రోజు పవిత్ర శుక్రవారము. నేడు మనం “శరీరధారియైన దేవుని వాక్కు” అగు క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. సువార్తల ప్రకారం, గురువారము రోజు రాత్రి సమయములో యూదా ఇస్కారియోతు యేసు ప్రభువును శత్రువుల చేతికి అప్పగించాడు. ఉదయం ‘అన్నా’ అను యూదుల మతాధి దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు దైవదూషణ చేసాడని ఖండించారు. ఆ తరువాత రోము గవర్నరు అయిన పిలాతు వద్దకు తీసుకోని పోయారు. పిలాతు యేసును ప్రశ్నించి, ఆయనలో ఏ దోషము లేకపోవుటచే, “మీరే ఇతనిని తీసికొని వెళ్లి మీ చట్ట ప్రకారము విచారణ చేయండి” అని యూదులకు చెప్పాడు. రోమనుల పాలన కింద యూదులకు ఎవరికిని మరణదండన విధించు అధికారము లేనందున, యేసుకు మరణ శిక్షను ఆజ్ఞాపించమని పిలాతును కోరారు. పిలాతు యేసును హేరోదు వద్దకు పంపాడు. ఆయనలో ఏ దోషము లేనందున, హేరోదు తిరిగి మరల యేసును పిలాతు వద్దకు పంపాడు. చివరికి, ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణ శిక్ష విధించాడు. వారి యిష్టానుసారముగా చేసికొనుటకు యూదులకు అప్పగించాడు.

ఈ రోజుని “గుడ్‌ ఫ్రైడేఅని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు ‘మంచి రోజు’, ‘పవిత్రమైన రోజు’ అని అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు సంపూర్ణ విజయాన్ని సంపాదించి పెట్టింది. మన రక్షణ కార్యం విజయవంతమైనది లేదా సంపూర్ణమైనది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. యేసు క్రీస్తు తన మరణము ద్వారా, మనలను పాపదాస్యమునుండి విముక్తిని చేసాడు, “నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింప బడితిరి” (1 పేతు. 1:19). అలాగే, నేడు మనకోసం పరలోకం తెరువబడింది.

పవిత్ర గురువారమున, క్రీస్తు శిష్యులతో కలసి, ‘పైగది’లో ప్రవేశించి, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించియున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మ దైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, మన శ్రీసభకు తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయము కొరకై వేచి చూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో, మన తోటి సహోదరి, సహోదరులతో కలసి, “లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగుచున్నది (యెషయ 60:1) అని ఎలుగెత్తి స్తుతించెదం.

ఈ రోజు క్రీస్తు సిలువ చెంత నిలచియున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయాలతో సిలువ చెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమ రహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్ట పూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందాడు. తన సిలువ వేదన, మరణముద్వారా మనలను రక్షించి యున్నాడు. మరణమునుండి మనలను రక్షించాడు.

ఈ రోజు మనం పాస్కా పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్‌ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే, బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరి కొండపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తాను సారముగా జరిగి యున్నది. అందుకే, క్రీస్తును మహిమ పరచి మహోన్నత స్థితికి హెచ్చించాడు దేవుడు. మనము కూడా తండ్రికి పూర్తిగా విధేయులై బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసిపోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనం కలుగుతుంది.

ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మన కోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించాడు. అవమానాలను భరించాడు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడు.

సిలువ మరణం: ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతిభయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నాడు.

సిలువ: 1కొరి 1:23లో పౌలుగారు అంటున్నారు, “సిలువ యూదులకు ఆటంకం, అన్యులకు అవివేకము.” కాని, సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును ధ్యానించాలి. యేసు క్రీస్తు సిలువను మనం అర్ధంచేసుకోవాలంటే, సిలువ సాధించిన ఫలాలను లేదా విజయాలను మనం ధ్యానించాలి [అంతేగాని, సిలువ మరణానికి గల కారణాలను కాదు]. సిలువ ఫలితం ఏమిటో రోమీ 5:1లో చూడవచ్చు: “విశ్వాసము వలన మనము నీతిమంతులుగా చేయబడి, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి.” ఇంకో ముఖ్యమైన విజయం ఏమిటంటే, క్రీస్తు సిలువ మన సకల [శారీరక, మానసిక...] శ్రమలకు, ఓ నూతన అర్ధాన్ని చేకూర్చింది. మన శ్రమలు ఇక ఎన్నటికి శిక్ష కాదు, శాపం కాదు. క్రీస్తు మనకన్న ముందుగా సిలువపై శ్రమల పాత్రను పానము చేసి, శ్రమల వెనుక మహిమ ఉన్నదని చూపించాడు. కేవలము విశ్వాసముగల వారి శ్రమలే కాదు, సర్వ మానవాళి శ్రమలు ఎందుకన, ఆయన అందరికోసం మరణించారు. “నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షింతును” (యోహాను 12:32) అని ప్రభువు పలికారు. సిలువ ద్వారా మానవాళి శ్రమలు కూడా రక్షణకు మార్గముగా చేయబడినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం.

ఆయన సిలువ మరణాన్ని మనకోసం, మనపై ప్రేమకోసం అంగీకరించాడు, “తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు” (యోహాను 15:13). “క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది” (1యోహాను 3:16). కనుక, సిలువ ప్రేమకు గుర్తు. దేవుని ప్రేమకు చిహ్నం. ప్రభువు అందరి కోసం మరణించాడు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము. అందుకే పౌలుగారు, “యేసు క్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును” అని గలతీ 6:14లో చెప్పుచున్నారు.

సిలువ ప్రేమకు చిహ్నం: సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు నిదర్శనం. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, యేసు/దైవ ప్రేమను గూర్చి చెప్తాడు, “క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను (ఫిలిప్పీ. 5:2). యేసు మరణము ద్వారా, దేవుని ప్రేమకూడా వ్యక్తమగుచున్నది, “నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశ, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో! కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెనుగదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు” (రోమీ. 5:7-8). “ఆయన తన స్వంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?” (రోమీ. 8:32).

సిలువ ఆరాధన: ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించ గలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకి సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.

ఈ రోజు శ్రీసభ అనగా మనమందరం కలువరి కొండపై క్రీస్తు సిలువ వైపు చూస్తూ ఉన్నాము. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కృతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము, “క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువచేత, ఈ లోకమును రక్షించితిరే.సిలువ ఆరాధన ఎందుకనగా, సిలువ దేవుడైన క్రీస్తుకు ప్రత్యేకమైన గురుతుగా ఉన్నది. క్రైస్తవ జీవితములో కూడా సిలువకు, సిలువ గురుతుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.

దైవకార్య సాధనలో సిలువ మరణం: యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం మరణానికి దారితీసింది? ఆయన దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చాడు. లోకమును నీతి న్యాయం, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చాడు. లోకమును రక్షించాలని వచ్చాడు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చాడు. ఈ కార్యసాధనలో ఆయన సిలువమరణాన్ని పొందాల్సి వచ్చినది.

క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా?: “నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకేకాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము” (యోహాను 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు, వినాశనము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.

లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవ నిర్ణయమని అర్ధమగుచున్నది. ఆయన గుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమభావం ఉంది. యేసు సిలువపై, సమాప్తమైనది (యోహాను 19:30) అని పలికాడు. గ్రీకు పదానికి “పూర్తిగా చెల్లించబడినది” అని అర్ధం. అనగా, క్రీస్తు తన శ్రమలు, మరణము ద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించాడు. పాపము అనే మన అప్పును క్రీస్తు పూర్తిగా చెల్లించాడు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీ కూడా ఈ లోకములో ఇమడ గలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవాడు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్‌ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉంటుంది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం.

క్రీస్తు సిలువపై, “దాహమగుచున్నది (యోహాను 19:28) అని పలికాడు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (యోహాను 4:10-14, 6:54-56). ఈనాడు సిలువ చెంత ఉన్న మనం, సిలువపై ఉన్న క్రీస్తు మన కోసం ఎంత దాహమును కలిగియున్నాడో గుర్తించుదాం. దివ్యపూజా బలిలో తన శరీర రక్తముల ద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాం.

మన కర్తవ్యం?: సిలువద్వారా క్రీస్తు మనకోసం సాధించిన రక్షణకు మన సమాధానం ఏమిటి? క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొన వలయును (1కొరి.11:24-25, 1పేతు.3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనం కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధిబాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనము కూడా అన్నీ ఓర్పుతో సహించుదాం. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం. అదియే శ్రీసభ. నేడు క్రైస్తవులు ఎంతోమంది వారి విశ్వాసాన్ని కోల్పోవుచున్నారు. నేడు మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ప్రేమగా జీవించుట వలన సిలువలోని క్రీస్తు మనపై చూపించే ప్రేమకు ప్రతిస్పందించుదాం.

            నేడు మనం అనుభవిస్తున్న బాధలను, శ్రమలను, ముఖ్యముగా కరోన వైరస్ ద్వారా మనం పొందిన నష్టాన్ని, కష్టాన్ని క్రీస్తు శ్రమలతో ఏకం చేద్దాం. ఈ విపత్తు సర్వ మానవాళిని ఏకం చేసినదని చెప్పవచ్చు. కనుక, అందరము కలసి ఏక కంఠముతో దేవునికి మొరపెట్టుకుందాం. ఆయన తప్పక మన మొర ఆలకించును. ఇశ్రాయేలు ప్రజలు విష సర్పముల కాటుకు మరణించు చుండగా, కంచు సర్పమును ఎత్తమని, దానిని చూచిన వారందరు మరణించరు అనిదేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అలాగే “విశ్వసించు వారు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడు ఎత్తబడవలెను” (యోహాను 3:15) అని స్వయంగా ప్రభువే నికోదేముతో చెప్పడం జరిగింది. నేడు మనం కరోన వైరస్ అను విష సర్పముతో కాటు వేయబడినాము. సిలువలో ఎత్తబడిన క్రీస్తువైపుకు నేడు మనం చూడాలి. సర్వ మానవాళి తరుపున ఆయనను ఆరాధించుదాం. విశ్వాసముతో ఆయనను చూచువారు బ్రతికెదరు. ఒకవేళ ఆ వ్యక్తి మరణించినను నిత్యజీవము పొందును.

“మరణించిన మూడవ రోజున నేను పునరుత్థానుడగుదును” (మార్కు 9:31) అని యేసు ప్రవచించాడు. మనము కూడా క్రీస్తుతో సజీవులముగా లేపబడాలంటే, ఆయనను సంపూర్ణముగా విశ్వసించాలి...

పవిత్ర గురువారము, Year B

 పవిత్ర గురువారము, Year B
నిర్గమ 12:1-8, 11-14, భక్తి కీర్తన 116:12-13, 15-16,17-18,
1 కొరి 11:23-26, యోహాను 13:1-15

తపస్కాలము మనలను మనం దైవీకముగా మార్చుకొనుటకు దేవుడిచ్చిన సమయం. అలాంటి తపస్కాలమందు విభూది బుధవారము నుండి మ్రానికొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తైతేఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు. అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్థాన పండుగకు ముందు వచ్చు గురువారమును పవిత్ర గురువారముగా పిలవడం ఆనవాయితి. తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈ ప్రాముఖ్యతకు గల కారణములను మనము నేటి పఠనముల ద్వారా చూడవచ్చు.

పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము మరియు పవిత్ర శనివారము పాస్కా త్రయము అంటాము. తల్లి తిరుసభ దైవార్చన కాలములో చాలా ప్రాముఖ్యమైన రోజులు. ఈ రోజు మనము పవిత్ర గురువారమును కొనియాడు చున్నాము. ఈ రోజు ప్రభువు కడరా భోజనమును, ఆ భోజన సమయములో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. ప్రభువు జీవితములో ప్రభువు భోజనములేదా కడరాత్రి భోజనముఅత్యంత ముఖ్యమైన మరియు ప్రాముఖ్యమైన ఘట్టము అని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు! ఇది వీడ్కోలు భోజనము’, ‘కడరా భోజనము’. పై గదిలో ప్రభువు తన శిష్యులతో కలిసి పంచుకున్న కడరా భోజనము’.

ఈరోజు, ఇశ్రాయేలు ప్రజల పాస్కా పండుగకు నూతన అర్ధాన్ని ఇచ్చినరోజు. ప్రభువు దివ్యసత్ప్రసాదమును, గురుత్వమును స్థాపించిన రోజు. నూతన ఆజ్ఞను ఇచ్చిన రోజు. ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగిన రోజు. దేవుని రక్షణ ప్రణాళికలో జరిగిన ఈ ముఖ్యమైన ఘట్టాల గురించి ఈరోజు మనం లోతుగా ధ్యానిద్దాం.

1. పాస్కబలి – నియమములు (నిర్గమకాండము 12:1-8, 11-14)

ఈ పఠనముద్వారా యావే దేవుడు ఇస్రాయేలీయులతో పాస్కాబలి ఒప్పందము చేసుకొనుటను చదువుచున్నాము. పాస్కా అనగా “దాటిపోవుట” అని అర్ధము. ఈజిప్టు దేశమునుండి వెళ్ళిపోయే ముందురోజు ఇస్రాయేలీయులు పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లను చంపి, దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్కబలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి ప్రభువు విడమరచి చెప్పియున్నారు. పాత నిబంధనలో పాస్కా పండుగ సందర్భమున, ప్రతీ యిస్రాయేలు కుటుంబము ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించారు. వధింప బడిన గొర్రెపిల్ల రక్తమును కొంత తీసుకొని ఇంటి వాకిళ్ళ కమ్ముల మీద పూయవలయునని నియమమును పొందిరి. బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల రక్తము ప్రతీ యిస్రాయేలు కుటుంబమును మరణము నుండి కాపాడినది (నిర్గమ. 12).

ఈ పాస్క గొర్రెపిల్లను ఏ విధముగా తినవలెనో కూడా వారికి చెప్పబడింది. ఆ నియమములు ఏమనగా: - తినునపుడు వారి నడుముకు దట్టి యుండవలెను, - కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను, - చేతిలో కర్ర ఉండవలెను, - మాంసమును త్వరగా తినవలెను. ఈ నియమములను మనము గమనించినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చునపుడు మనలను మనము త్వరితగతిన తయారు చేసుకొంటున్నట్లు గోచరించును. ఆవిధముగా మనము ఎంత ఉత్కంట భరితముగా దేవుని పాస్కగురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏవిధముగానైతే ఒక పాలనాధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంట భరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్కగురించి ఉత్కంటగా తయారు కవాలనేది దేవుని ఉద్దేశ్యము. అంటే దేవుని పాస్క బలిని ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను జరుపుకొనవలెను.

ఈ పాస్కబలి ఐగుప్తీయుల చెరనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచికగా అర్ధమగుచున్నది. అదేవిధంగా ఈ పాస్కబలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తుబలికి సూచికగాను జరిగినట్లుగా కూడా అర్ధము చేసుకొనవచ్చును.

ఇక్కడ మనం గమనించ వలసిన విషయం ఏమిటంటే, ప్రభువు కడరా భోజనముకూడా యిస్రాయేలు పాస్కా పండుగ దినములలోనే జరిగింది. కనుక, గొర్రెపిల్ల రక్తము క్రీస్తు రక్తముతో భర్తీ చేయబడునని సూచిస్తున్నది. క్రీస్తు లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని, అనేకుల రక్షణకై ఆయన రక్తము చిందించ బడెను అని యోహాను. 1:29,36లో చూస్తున్నాము. అలాగే, ‘కడరావిందుప్రభువును నూతన మోషేగా సూచిస్తున్నది. మోషే ద్వారా దేవుడు మన్నాను కురిపిస్తే (నిర్గమ. 16), క్రీస్తు ద్వారా జీవాహారమును ఇచ్చియున్నాడు (యోహాను. 6). క్రీస్తు తాను కొనియాడిన పాస్కాద్వారా పాపము అనే బానిసత్వము నుండి మనలను వాగ్ధత్తభూమి అను పరలోకమునకు దాటవేస్తారు.

పాత నిబంధన పాస్కా, యిస్రాయేలు ప్రజలకు జ్ఞాపక మహోత్సవమైతే, నూతన నిబంధన పాస్కా, నిత్య నూతన నిబంధన జ్ఞాపక మహోత్సవము, అదియే దివ్యబలి పూజ”, కృతజ్ఞాతార్చన బలి. పాస్కావలె సంవత్సరములో ఒకసారి గాక, “దివ్యబలి పూజను అనుదినం కొనియాడు చున్నాము. దీనికి కారణం మనం పొందిన అనంతమైన రక్షణకు కృతజ్ఞతా భావము. దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు ఈ రొట్టెను భుజించునపుడెల్ల, ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు” (1 కొరి. 11:23-26) అని ప్రభువు పలికి యున్నారు. ఈ కృతజ్ఞతా బలిని అర్పించునప్పుడు, రొట్టె, ద్రాక్ష సారాయమును అర్పించిన మెల్కీసెదెకు పూజారి (ఆ.కాం. 14:18) పాత్రను క్రీస్తు పోషిస్తున్నాడు.

2. దివ్య సత్ప్రసాద స్థాపనము, పవిత్ర యాజక అంతస్తు స్థాపన (1కొరి 11:23-26)

ఏవిధముగానైతే మొదటి పఠనములో యావే దేవుడు తన పాస్కబలి నియమములను చెప్పియున్నారో అదేవిధముగా రెండవ పఠనములో పునీత పౌలుగారు దివ్యసత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏవిధముగా జరపాలనే నియమముల గురించి, పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి మనకు తెలియ జేయుచున్నారు.

2.1. దివ్యసత్ప్రసాద స్థాపనము

యేసుప్రభువు తాను అప్పగింప బడనున్న రాత్రి దివ్యసత్ప్రసాద బలిద్వారా తనను ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్యసత్ప్రసాద బలి యేసుప్రభువు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తుగా పౌలుగారు చెప్పుచున్నారు. ఈ దివ్యసత్ప్రసాద బలి ద్వారానే మనము ప్రతిదినము ప్రభువు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ బలిలో ముఖ్య అంశములు ఏమనగా:

(అ). కృతజ్ఞతాబలి: యేసుప్రభువు దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృత్ఞతలు చెల్లించారు. తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృత్ఞతలు చెప్పియున్నారు. అనగా దివ్యసత్ప్రసాద బలి యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ దేవునికి కృత్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలుస్తున్నది. అందుకే దివ్యసత్ప్రసాద బలిని కృత్ఞతాబలిగను చెప్పుకుంటున్నాము.

(ఆ). దివ్య(ప్రాణ)బలి: దేవునికి కృత్ఞతలు తెలిపిన తరువాత రొట్టెను తుంచడము ద్వారా తన మరణమును గురించి సంకేతమును యేసుప్రభువు తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈవిధముగా ప్రభువు తీసుకొన్న రొట్టె తనకే సూచికగా నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడము ద్వారా తననుతాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు, తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము చేసియున్నాడు.

(ఇ). దివ్యరక్తము: భోజనము తరువాత యేసుప్రభువు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నముగా చెప్పియున్నారు (లూకా.22:20). ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభువు చెప్పినవిధముగా పునీత పౌలుగారు అభివర్ణించారు. అందువలన ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింపబడునప్పుడు ప్రభువు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము చేసుకొనుచుందుము. అంతేకాకుండా, ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలుగారు మనకు యేసుప్రభువుని రక్తముద్వారా నిత్యమరణమునుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా, ఇస్రాయేలు సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభువు తన రక్తమును చిందించుట ద్వారా తన జీవమును స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణమునుండి శాశ్వత విముక్తులను చేసారు. యేసుప్రభువు రక్తము చిందించుట మనకు మొదటి పఠనములో గొర్రె పిల్లను వధించుటను గుర్తుకు తెచ్చును. ఏవిధముగానైతే గొర్రె రక్తము గుమ్మములకు పూయడము ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబడ్డారో అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరము రక్షించపడ్డామని తెలుస్తున్నది.

(ఈ). నూతన నిబంధన: మనందరికోసం యేసుప్రభువు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడికగా ప్రభువు చెప్పినట్లుగా పునీత పౌలుగారు తెలియజేయు చున్నారు (1కొరి. 11:25). ఈ సమయములో పాత ఒడంబడిక గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సినాయి కొండపై యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొని యున్నాడు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు ప్రభువు మాట మీరి, ఒడంబడిక మీరి తప్పు చేయుచుంటిరి. ఐనప్పటికి ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్య నిబంధనను చేసుకొని యున్నారు. ఐతే ఈ శాశ్వత నిత్యనిబంధన ఇస్రాయేలీయులకే కాక మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన, ఎవరైతే ఈ నూతన నిత్యనిబంధనలో బాప్తిస్మము ద్వారా భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య జీవభాగ్యమును ఒసగుచున్నారు.

2.2. పవిత్ర యాజక / గురుత్వ అంతస్తు స్థాపన

ఈ రోజు కడరాత్రి భోజన సమయములో, ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ప్రభువు ఆవిష్కరించిన రోజు. అదే పవిత్ర యాజక అంతస్తు / గురుత్వ స్థాపన. ఈ గొప్ప వరానికి, భాగ్యానికి, మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి. పాత నిబంధనలో అనేక యాజకులు ఉన్నారు, కాని నూతన నిబంధనలో ఒకే యాజకుడు క్రీస్తు ఉన్నారు.  యేసు ప్రభువు తాను ఆదినుండి యావే దేవుని ప్రధాన యాజకుడైనను, తననుతాను బలిగా అర్పించు కోవడం ద్వారా, యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు. ఆవిధముగా, తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలి వస్తువుగాను మారారు. తద్వారా, తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణద్వారా మొదలుపెట్టారు. అయితే, తన యాజకత్వాన్ని, గురుత్వాన్ని అభిషేకించబడిన గురువులతో పంచుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు, “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (1కొరి.11:24-25, లూకా.22:19) అని శిష్యులను ఆజ్ఞాపించాడో, అపోస్తలులందరు యేసు ప్రభువు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు. యోహాను 17:17లో యేసు “సత్యమునందు వారిని ప్రతిష్టింపుము” అని తన శిష్యుల కొరకు తండ్రిని ప్రార్ధించాడు. శిష్యులు క్రీస్తు యాజకులుగా అభిషేకించ బడినారని అర్ధమగుచున్నది. పాత నిబంధనలో యాజకులను నీటితో శుద్ధిచేయు ఆచారము ఉండేది (నిర్గమ 29:4, లేవీ 8:6). అందుకే, దివ్యసత్ప్రసాదమును స్థాపించిన కడరాత్రి భోజన సమయములో ప్రభువు నీటితో శిష్యుల పాదాలను కడిగి, నూతన నిబంధన యాజకులుగా వారిని శుద్ధిగావించాడు.

గురువు బలిని అర్పించేవాడు. క్రీస్తు కలువరి సిలువపై ఒకేఒక్క సంపూర్ణమైన బలిని అర్పించాడు (చదువుము ఎఫే 5:2, 1పేతురు 1:18-19). నేడు గురువులు ఆ బలిని జ్ఞాపకార్ధముగా కొనియాడటం జరుగుతుంది. అందుచేత, ఈరోజు యాజకులందరికి పండుగ రోజు. ఈరోజు వారికోసం ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. గురువులు క్రీస్తు యొక్క ప్రేషితకార్యాన్ని కొనసాగించాలి. దివ్యబలిపూజ, సేవ రెండు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి యున్నాయి. దివ్యపూజ ఇతరులను ప్రేమించడానికి ప్రోద్భలాన్ని ఇవ్వాలి. అందుకే ప్రభువు నూతన ఆజ్ఞను ఇచ్చియున్నారు..

3. నూతన ఆజ్ఞ - శిష్యుల పాదాలను కడుగుట (యోహాను 13:1-15)

పవిత్ర గురువారమున ప్రభువు మనకు నూతన ఆజ్ఞను ఇచ్చి యున్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు.ప్రభువే స్వయముగా ఇచ్చిన ఈ నూతన ఆజ్ఞను శిష్యుల కాళ్ళు కడుగుటద్వారా చేసి చూపించాడు. ఆయన ఆజ్ఞను ఇవ్వడం మాత్రమేగాక, దానిని ముందుగా చేసి మనకు ఆదర్శముగా ఉన్నారు. యేసు భోజన పంక్తి నుండి లేచి, తన పై వస్త్రమును తీసివేసి, నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని, ఒక పళ్ళెములో నీరు పోసి, తన శిష్యుల పాదములు కడిగి, నడుమునకు కట్టుకొనిన తుండు గుడ్డతో తుడచెను” (చదువుము. యోహాను 13:1-15), ఇది ఆ ప్రేమాజ్ఞకు నిజమైన అర్ధం.

ప్రభవు కడరా భోజన సమయములో అసాధారణమైన దానిని చేసియున్నాడు, ఎవరూ ఊహించనిదానిని చేసి చూపించాడు, అదియే ప్రభువు శిష్యుల పాదాలను కడగడం. ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో అన్నదానికి ఇది ఓ గొప్ప నిదర్శనం! యేసు సేవకరూపం దాల్చి శిష్యుల పాదాలు కడిగాడు.

తనను అప్పగించిన యూదా పాదాలను కడిగాడు, అలాగే తనను ఎరుగనని బొంకిన పేతురు పాదాలు కడిగాడు. తనను బంధించినప్పుడు పారిపోయిన మిగతా శిష్యుల పాదాలను కడిగాడు. దీనిని బట్టి మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, ప్రభువును విశ్వసించువారు, తన వారికి (బంధువులు, స్నేహితులు) మాత్రమే సేవలు చేయక, తమను వ్యతిరేకించే వారిని, తమకు ద్రోహం చేసేవారికి కూడా సేవలు చేయాలి! ప్రభువు శిష్యులతో ఇలా పలికారు, “ప్రభువును, బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును (యోహాను 13:14).

పాదాలు కడుగు సాంగ్యం, జ్ఞానస్నానమును మరియు జ్ఞానస్నానములో మనం పొందే అనుగ్రహాన్ని గుర్తుకు చేస్తుంది, ఆ అనుగ్రహమే మన పరిశుద్ధత, మన రక్షణ, దేవుని బిడ్డలమగు భాగ్యము! ప్రభువు ఎందుకు పాదాలు కడుగుచున్నారో మొదటగా, పేతురుకు అర్ధం కాలేదు. అందుకే పేతురు బిగ్గరగా, “నీవు నా పాదములు ఎన్నటికిని కడుగరాదుఅని అన్నాడు. అప్పుడు పభువు, “నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదుఅని చెప్పాడు. అందుకు పేతురు, “అట్లయిన ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగుము” (యోహాను 13:8-9). కనుక, క్రీస్తులో భాగస్తులము కాగోరినచో, తప్పక జ్ఞానస్నాన నీటితో పరుశుద్దులము గావింప బడవలెను.

పునీత పౌలుగారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని రెండవ అధ్యాయములో చెప్పిన విధముగా దైవప్రతినిధిగా, దైవసేవకునిగా, ప్రజాసేవకునిగా, దైవకుమారునిగా తన శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆ మహాత్కార్యమే శిష్యుల పాదాలను కడుగుట. “నేను నిన్ను (నీ పాదములను) కడుగనియెడల నాతో నీకు భాగము ఉండదు” (యోహాను 13:8) అని చెప్పుటద్వారా శిష్యులందరు తన యొక్క కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకుంటారని చెప్పకనే చెప్పారు. అందువలననే యేసు ప్రభువు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచెను (యోహాను 15:15).

మీరందరు శుద్ధులు కాదని చెబుతూనే యూదా ఇస్కరియోతు కాళ్ళను కూడా యేసు ప్రభువు కడిగారు. ఎందువలననగా, తాను యుదాతోసహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించెను (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని తెలిసికూడా అతనిని ప్రేమించెను. యుదా కాళ్ళు కడగడము ద్వారా తనలో యుదాకి కూడా భాగముందని చెప్పకనే చెప్పారు. కాని యుదా, ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి యేసును రోమను సైనికులకి అప్పగించాడు. ఈ కార్యముద్వారా యేసుక్రీస్తు యొక్క షరతులు లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను మనం అర్ధము చేసుకొన వచ్చు. ఈ విధముగా, ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించు చున్నారు.

అంతేకాకుండా యేసుప్రభువు, తాను ఏవిధముగా చేసెనో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చెను. తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియు చున్నది. ఈవిధముగా, ఈ వినమ్ర కార్యం పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహానుగారు మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు.

ముగింపు: క్రీస్తు మొదటి పఠనములోని ప్రజలకోసం చనిపోవు గొర్రెగా సూచించ బడగా, రెండవ పఠనంలో యాజకుడిగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్ర హృదయుడిగా వర్ణించ బడ్డాడు. ఈవిధముగా ఈనాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి, క్రీస్తుని ప్రేమ గురించి విపులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒకవైపు నాణెముగా పరిగణిస్తే, యేసుని యొక్క స్వచ్చంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము చేసుకొన వచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాద క్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏవిధముగా ఆచరించవలెనో, ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనా ప్రాయముగా తెలియ జేయుచున్నాయి. ఈవిధముగా, ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము ప్రాముఖ్యత గురించి, ఈపవిత్ర గురువారమును ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయు చున్నవి.

-        దివ్యబలి పూజలో పాల్గొను మనము, సేవా భావముతో జీవించాలి. ఇతరుల అవసరాలను గుర్తించి, ఏమీ ఆశించకుండా సహాయం చేయాలి.

-        ప్రభువు తన శరీర రక్తాలనే మనకు జీవాహారముగా, పానముగా ఇచ్చియున్నాడు. కనుక మనము కూడా ప్రభువువలె మనకున్నవి ఇతరులతో పంచుకోవాలి: మన సమయం, మాట, సంపద, ఇతర వరాలు... అప్పుడే మనం క్రీస్తుకు నిజమైన శిష్యులముగా జీవించగలం.

“సమాధానముతో వెళ్లి, క్రీస్తు సేవలో జీవించండి” అని పూజ ముగుస్తుంది. కనుక, క్రీస్తు సందేశాన్ని ఇతరులకు చాటాలి: ప్రేమ, క్షమ, దయ, సేవ...