పరిశుద్ధ లియో XIV జగద్గురువుల ప్రసంగం, 18 మే 2025

 రోమ్ నగర బిషప్ లియో XIV యొక్క పెట్రైన్ సేవ ప్రారంభ దివ్య పూజా బలి

పరిశుద్ధ లియో XIV జగద్గురువుల ప్రసంగం

పునీత పేతురు బసిలిక ఆవరణ, 18 మే 2025

 


ప్రియమైన కార్డినల్ సోదరులారా, పీఠాధిపతులు, గురు సోదరులారా,

గౌరవనీయులైన అధికారులు మరియు దౌత్య బృంద సభ్యులారా,

జూబిలీ సందర్భంగా వచ్చిన ప్రియమైన యాత్రికులారా,

మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!


ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పెట్రైన్ సేవ ప్రారంభంలో, నా హృదయం కృతజ్ఞతతో నిండి యున్నది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పునీత అగస్టిన్ ఇలా వ్రాశారు, “ప్రభూ, నీ కోసమే మమ్మల్ని సృష్టించావు, మరియు నీలో విశ్రాంతి పొందే వరకు మా హృదయం విశ్రాంతి పొందదు” (కన్ఫెషన్స్, 1, 1.1).


గడచిన కొన్ని రోజులుగా, మనం ఒక  కష్టమైన సమయాన్ని అనుభవించాం. పోప్ ఫ్రాన్సిస్ మరణం మన హృదయాలను దుఃఖంతో నింపింది. ఆ కష్ట కాలములో, సువార్తలో చెప్పిబడినట్లుగా మనం “కాపరి లేని గొర్రెల” వలె ఉన్నామని భావించాము (మత్తయి 9:36). ఈస్టర్ రోజున మనం పోప్ ఫ్రాన్సిస్ గారి చివరి ఆశీర్వాదం పొందాము. పునరుత్థాన వెలుగులో, ప్రభువు తన ప్రజలను ఎన్నడూ విడిచి పెట్టడు, చెదిరి పోయిన వారిని ప్రోగు చేయును మరియు “కాపరి మందను వలె వారిని కాచి కాపాడును” (యిర్మీయా 31:10) అనే గొప్ప నమ్మకముతో ఆ కష్ట సమయాన్ని ఎదుర్కొన్నాము.


ఈ విశ్వాస స్ఫూర్తితో, కార్డినల్స్ నూతన కాపరి ఎన్నిక కోసం సమావేశ మయ్యారు. వివిధ మార్గాల నుండి వచ్చిన మేము, క్రైస్తవ విశ్వాసం యొక్క గొప్ప వారసత్వాన్ని కాపాడగలిగే, అదే సమయంలో, నేటి ప్రశ్నలు, ఆందోళనలు, సవాళ్లను ఎదుర్కోవడానికి దూరదృష్టిని కలిగి ఉండే కాపరిని - పేతురు యొక్క నూతన వారసుడిని, రోము నగర బిషప్‌ను - ఎన్నుకోవాలనే కోరికను దేవుని చేతుల్లో ఉంచాము. మీ ప్రార్థనతో పాటు, పరిశుద్ధాత్మ కార్యాన్ని మేము అనుభూతి చెందాము. వివిధ సంగీత వాయిద్యాలను సమన్వయం చేసినట్లుగా, పరిశుద్ధాత్మ మా హృదయ తంత్రులను ఒకే శ్రావ్యతలో కంపించేలా చేసింది.


నేను ఎటువంటి అర్హత లేకుండానే ఎంపిక చేయబడ్డాను. భయంతో, వణుకుతో ఉన్నప్పటికినీ, మీ విశ్వాసానికి మరియు మీ ఆనందానికి సేవకునిగా ఉండాలనుకునే సోదరుని వలె మీ వద్దకు వస్తున్నాను. దేవుని ప్రేమ మార్గంలో మీతో కలిసి నడుస్తున్నాను. మనందరినీ ఒకే కుటుంబంగా ఏకం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.


ప్రేమ మరియు ఐక్యత: ఇవే యేసు పేతురుకు అప్పగించిన అపోస్తోలిక సేవ యొక్క రెండు కొలమానాలు.

సువార్త భాగం దీనిని మనకు స్పష్టముగా వివరిస్తుంది. ఇది తిబేరియా సరస్సు వద్దకు మనలను నడిపిస్తుంది. అదే సరస్సు వద్ద యేసు తండ్రి నుండి పొందిన అపోస్తోలిక సేవను ప్రారంభించారు. చెడు మరియు మరణమనే జలాల నుండి మానవాళిని రక్షించడానికి వలవేసి “పట్టుకోవడాన్ని” అది వివరిస్తుంది. ఆ సరస్సు ఒడ్డున నడుస్తూ, యేసు పేతురును, ఇతర తొలి శిష్యులను తనలాగే “మనుష్యులను పట్టువారిగా” చేస్తానని పిలిచాడు. ఇప్పుడు, పునరుత్థానం తర్వాత, ఈ అపోస్తోలిక సేవను ముందుకు తీసుకెళ్లడం, సువార్త యొక్క ఆశను ప్రపంచ జలాల్లో ముంచడానికి ఎల్లప్పుడూ మరియు మళ్ళీ వల వేయడం, జీవన సముద్రంలో ప్రయాణించడం ద్వారా అందరూ దేవుని ఆలింగనంలోకి తిరిగి రావచ్చు.


పేతురు ఈ కార్యాన్ని ఎలా కొనసాగించ గలడు? అపజయము మరియు తిరస్కరణ ఎదురైనప్పటికీ, అతను తన జీవితములో అనంతమైన, షరతులు లేని ప్రేమను అనుభవించాడు. కాబట్టి ఇది సాధ్యమవుతుందని సువార్త తెలియ జేస్తుంది. అందుకే, యేసు పేతురును సంబోధించినప్పుడు, అగాపావో’ (Agapao) అను గ్రీకు క్రియా పదాన్ని ఉపయోగించారు. ఇది మన పట్ల దేవునికి ఉన్న నిస్వార్థమైన, పరిపూర్ణమైన ఆత్మార్పణ ప్రేమను సూచిస్తుంది. అయితే, పేతురు సమాధానం కోసం ఉపయోగించిన పదం దీనికి భిన్నంగా ఉంటుంది. అది ‘ఫిలియో’ (Philio), స్నేహపూర్వక ప్రేమను వివరిస్తుంది. అనగా, అది మనం ఒకరికొకరు మార్పిడి చేసుకునే స్నేహపూర్వకమైన ప్రేమ.


యేసు పేతురును “యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించు చున్నావా?” (యోహాను 21:16) అనిఅడిగినప్పుడు, ఆయన తండ్రి ప్రేమను సూచిస్తున్నాడు. దేవుని ఈ ప్రేమను, ఎన్నడూ తగ్గని ఈ ప్రేమను నీవు తెలుసుకుని, అనుభవించినట్లయితే మాత్రమే, నా గొర్రెలను మేపగలవు; దేవుని తండ్రి ప్రేమలో మాత్రమే, అనగా నీ సోదరుల కోసం నీ జీవితాన్ని అర్పించడం ద్వారా, “మిక్కిలిగా” ప్రేమించగలవు అని ప్రభువు చెబుతున్నట్లుగా ఉన్నది.


కాబట్టి, పేతురుకు “మిక్కిలిగా ప్రేమించడం” మరియు మంద కోసం తన జీవితాన్ని అర్పించే కార్యం అప్పగించ బడింది. పేతురు యొక్క సేవ ఈ త్యాగపూరిత ప్రేమతో గుర్తించబడింది. ఎందుకంటే రోములోని శ్రీసభ దాతృత్వంలో అధ్యక్షత వహిస్తుంది, మరియు దాని నిజమైన అధికారం క్రీస్తు యొక్క దాతృత్వమే. ఇది ఇతరులను ఆధిపత్యంతో, మతపరమైన ప్రచారంతో లేదా అధికారం యొక్క మార్గాలతో పట్టుకోవడం కాదు, కానీ ఎల్లప్పుడూ మరియు కేవలం యేసు చేసినట్లుగా ప్రేమించడం మాత్రమే.


అపొస్తలుడైన పేతురు స్వయంగా పేర్కొన్నాడు, “ఇల్లు కట్టు వారైన మీరు పనికి రాదని త్రోసి వేసిన రాయి ఈయనయే. ఇదియే ఇంటికి మూలరాయి అయినది” (అపొస్తలుల కార్యములు 4:11). మరియు రాయి క్రీస్తు అయితే, పేతురు ఒంటరి నాయకుడు లేదా ఇతరుల కంటే ఉన్నతమైన అధిపతిగా మారాలనే శోధనకు లొంగకుండా మందను మేపాలి, తనకు అప్పగించిన ప్రజలకు యజమానిగా మారకూడదు (1 పేతురు 5:3 చూడండి); దానికి విరుద్ధంగా, సోదరుల విశ్వాసాన్ని సేవించడం, వారితో కలిసి నడవడం అతనికి అవసరం. మనమందరం, వాస్తవానికి, “సజీవ శిలలు” (1 పేతురు 2:5)గా ఏర్పడ్డాము. మన జ్ఞానస్నానము ద్వారా భ్రాతృత్వ సహవాసంలో, ఆత్మ సామరస్యంలో, వైవిధ్యాల సహజీవనంలో దేవుని భవనాన్ని నిర్మించడానికి పిలవ బడ్డాము. పునీత అగుస్తీను వారు పేర్కొన్నట్లు, “శ్రీసభలో సోదరులతో సామరస్యముగా మరియు పొరుగువారిని ప్రేమించే వారందరూ ఉంటారు” (ప్రసంగం 359, 9).


సహోదరీ సహోదరులారా, మన మొదటి గొప్ప కోరిక ఇదే కావాలని నేను ఆశిస్తున్నాను: ఐక్యమైన శ్రీసభ. ఐక్యతకు, సహవాసానికి ప్రతీకగా నిలిచే శ్రీసభ, ఇది సామరస్యమైన ప్రపంచానికి పులియబెట్టినదిగా మారుతుంది.


ఈ మన కాలంలో, మనం ఇంకా ఎంతో అసమ్మతిని, ద్వేషాన్ని, హింసను, పక్షపాతాలను, భిన్నమైన వారి పట్ల భయాన్ని, భూమి వనరులను దోచుకుంటూ, పేదలందరినీ అణగదొక్కే ఆర్థిక నమూనాతో కలిగిన అనేక గాయాలను కూడా గమనిస్తున్నాము. ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో, మేము ఐక్యత, సహవాసం, సోదరభావం యొక్క చిన్న పులియబెట్టినదిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రపంచానికి, వినయంతో, ఆనందంతో ఇలా చెప్పాలను కుంటున్నాము, “క్రీస్తును చూడండి! ఆయనను సమీపించండి! వెలుగునిచ్చే మరియు ఓదార్చే ఆయన వాక్యాన్ని స్వీకరించండి! ఆయన ప్రేమ ప్రతిపాదనను వినండి”! ఆయన ఏకైక కుటుంబంగా మారడానికి, క్రీస్తులో మనం ఒక్కటి అని చాటడానికి పిలవబడ్డాం. ఇది మన మధ్య మాత్రమే కాకుండా, సోదరి క్రైస్తవ చర్చిలతో, ఇతర మత మార్గాలను అనుసరించే వారితో, దేవుని అన్వేషణ యొక్క ఆందోళనను పెంపొందించే వారితో, శాంతిని స్థాపించే కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి మంచి సంకల్పం గల మహిళలు మరియు పురుషులందరితో కలిసి చేయాల్సిన మార్గం.


ఇది మనల్ని ఉత్తేజపరిచే మిషనరీ స్ఫూర్తి, మన చిన్న సమూహంలో మనల్ని మనం మూసివేయకుండా లేదా ప్రపంచం కంటే ఉన్నతంగా భావించకుండా, దేవుని ప్రేమను అందరికీ అందించడానికి మనల్ని పిలుస్తుంది. దీనిద్వారా వైవిధ్యాలను తొలగించని, కానీ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత చరిత్రను, ప్రతి ప్రజల సామాజిక మరియు మత సంస్కృతిని విలువైనదిగా భావించే ఐక్యత నెరవేరుతుంది.


సహోదరీ సహోదరులారా, ఇది ప్రేమ సమయం! మనల్ని ఒకరికొకరు సోదరులుగా చేసే దేవుని దాతృత్వమే సువార్తకు కేంద్రం. నా పూర్వీకుడు లియో XIIIతో కలిసి, ఈ రోజు మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ఈ ప్రమాణం “ప్రపంచంలో ప్రబలమైతే, ప్రతి అసమ్మతి వెంటనే ఆగిపోదా మరియు శాంతి తిరిగి రాదా?” (ఎన్సైక్లికల్ లెటర్ రెరుమ్ నోవారుమ్, 21).


పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మరియు శక్తితో, దేవుని ప్రేమపై ఆధారపడిన ఐక్యతకు చిహ్నమైన శ్రీసభను నిర్మిద్దాం. ఇది ప్రపంచానికి తన చేతులను తెరిచే, వాక్యాన్ని ప్రకటించే, చరిత్రతో మమేకమయ్యే, మానవత్వం కోసం సామరస్యానికి పులియబెట్టినదిగా మారే మిషనరీ శ్రీసభను నిర్మిద్దాం.


కలిసి, ఒకే ప్రజలుగా, సోదరీ సోదరులందరూ, దేవుని వైపు నడుద్దాం మరియు ఒకరికొకరు ప్రేమించుకుందాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/it/homilies/2025/documents/20250518-inizio-pontificato.html

గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.

2 comments: