మత్తయి 3:1-12 – యోహాను బోధ

మత్తయి 3:1-12 – యోహాను బోధ

బప్తిస్త యోహాను పరిచర్య, పశ్చాత్తాపానికి పిలుపులో, యేసు రాకడకు మార్గాన్ని సంసిద్ధం చేయడములో అతని పాత్రను తెలియ జేస్తుంది. ఈ భాగమునందు, పశ్చాత్తాపం, జ్ఞానస్నానం, మెస్సయ్య రాకకు సంబంధించిన వేదాంతపరమైన మరియు ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యతను చూడవచ్చు. యెషయ 40:3లోని ప్రవచనం నెరవేరుస్తూ, యోహాను “ప్రభువుకు మార్గము సిద్ధముచేయ” వచ్చెను. యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చివరివానిగా మరియు క్రీస్తునందు నూతన నిబంధనతో, పాత నిబంధనకు వారధిగా పరిగణింప బడినాడు. యేసు ఆరంభించబోవు ‘పరలోక రాజ్యము’యొక్క రాకడ కోసం, పశ్చాత్తాపము, సంసిద్ధత కొరకు ప్రజలను పిలవడం యోహాను లక్ష్యము.

యోహాను జీవితము, జీవనశైలి (3:4) ప్రవక్త ఏలియాతో పోల్చబడుచున్నది. మెస్సయ్య రాకమునుపే ఏలియా ప్రవక్త వస్తాడని మలాకీ 4:5లో ప్రవచనాన్ని చదువుచున్నాము. యోహాను జీవితము అతని సాధారణమైన సరళ జీవితాన్ని, పవిత్ర పరిచర్యను సూచిస్తుంది.

యోహాను బోధ ప్రధాన సందేశం, పశ్చాత్తాపమునకు పిలుపు, “పరలోక రాజ్యము సమీపించినది. మీరు హృదయ పరివర్తనము చెందుడు” (3:2). దేవునితో సహవాస సంబంధములోనికి ప్రవేశించాలంటే, హృదయపరివర్తనము తప్పక అవసరము. పాపమునుండి దూరముగా ఉండటమే కాకుండా, దేవునివైపు, ఆయన చిత్తమువైపు మరలడము. ఈ పిలుపు యేసు రాకను ముందుగానే ఎరుక పరచుచున్నది. యేసు సందేశము కూడా ఇదే పిలుపుతో ప్రారంభమైనది, “హృదయ పరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించి యున్నది” (మత్త 4:17). యోహాను జ్ఞానస్నానం శుద్దీకరణకు, లేదా ప్రక్షాళనకు సూచన. కాని యేసు పరిశుద్ధాత్మతో తీసుకొని రాబోయే శక్తివంతమైన జ్ఞానస్నానమును సూచిస్తున్నది.

జ్ఞానస్నానము, పాపముల ఒప్పుకోలు: యెరూషలేము, యూదయా అంతటనుండి ప్రజలు తమతమ పాపములను ఒప్పుకొనుచు, యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందుచుండిరి (3:5-6). కతోలిక శ్రీసభలోనున్న జ్ఞానస్నాన దివ్యసంస్కారాన్ని సూచిస్తుంది. జ్ఞానస్నానము ఆదిపాపమును తొలగించి, క్రీస్తు శరీరములో ఐఖ్యము చేయును. యోహాను బప్తిస్మము పశ్చాత్తాపానికి సూచన. యేసుక్రీస్తు స్థాపించిన దివ్యసంస్కారమైన క్రైస్తవ జ్ఞానస్నానము, పాపమునుండి విముక్తులను చేసి, దేవుని వరమగు పవిత్రాత్మయొక్క అనుగ్రహాన్ని ఒసగి నూతన జీవితాన్ని ఒసగుచున్నది (మత్త 3:11; యోహాను 3:5; అ.కా. 2:38).

పరిసయ్యులకు, సద్దూకయ్యులకు యోహాను హెచ్చరిక: “ఓ విష సర్పసంతానమా!” (3:7) అని వారిని తీవ్రముగా మందలిస్తున్నాడు. వారు ఆధ్యాత్మిక మత నాయకులు. వారు పశ్చాత్తాపము, హృదయ పరివర్తనముపై గాక, వారసత్వము మరియు బాహ్యపరమైన మాతాచారాలపై ఆధారపడుచున్నందున వారిని విమర్శించాడు. అబ్రహాము వారసులుగా గుర్తింపు పొందినంత మాత్రమున, వారి రక్షణకు అది సరిపోదని వారిని హెచ్చరించాడు. పశ్చాత్తాపానికి సూచనగా ‘మంచి పనులు’ చేయాలి (3:8). దేవుని చిత్తాన్ని జీవించడానికి, పశ్చాత్తాపము ఎంతో అవసరము.

యోహాను సందేశముయొక్క ఆవశ్యకత: “గొడ్డలి సిద్ధముగా నున్నది” (3:10). దేవుని తీర్పు ఆసన్నమైనదని, పశ్చాత్తాపమునకు చాలా తక్కువ సమయమున్నదని సూచిస్తుంది. “మంచి పండ్ల నీయని వృక్షము నరకబడి అగ్నిలో పారవేయ బడును” (3:10). పశ్చాత్తాప పిలుపునకు ప్రతిస్పందించని వారి విధిని సూచిస్తుంది. “అగ్ని” తీర్పునకు మరియు శుద్ధీకరణకు సూచనగా నున్నది. తీర్పునకు ముందే పశ్చాత్తాపమునకు పిలుపులో దేవుని దయ ప్రతిబింబిస్తున్నది.

పవిత్రాత్మతోను, అగ్నితోను బప్తిస్మము (3:11): యోహాను బప్తిస్మముకన్న, యేసు బప్తిస్మము మరింత శక్తివంతమైనది. ఇది పెంతకోస్తున పవిత్రాత్మ రాకడకు సూచనగా అర్ధం చేసుకోబడుచున్నది (అ.కా. 2). పవిత్రాత్మ రాకడ శిష్యులను, శ్రీసభ పరిచర్యను బలోపేతం చేసినది. “అగ్నితో” బప్తిస్మము అనేది పవిత్రాత్మ యొక్క శుద్ధీకరణ మరియు పరివర్తన కార్యముగా అర్ధం చేసుకొనవచ్చు. బైబులులో “అగ్ని” తరుచుగా శుద్ధీకరణ మరియు దేవుని సన్నిధికి సూచనగా నున్నది (ఉదా. నిర్గమ 3:2; మలాకీ 3:2-3). యేసు బప్తిస్మము దేవుని దయ యొక్క సంపూర్ణతను తెస్తున్నది. పాపము నుండి విముక్తిని చేస్తుంది. ఆత్మను శుద్దీకరిస్తుంది.

తీర్పు, చేట (3:12): “తూర్పార బట్టుటకు యేసు చేతియందు చేట సిద్ధముగా నున్నది. గోధుమ ధాన్యపు గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” (3:12). ఇది అంతిమ తీర్పును సూచిస్తుంది. నీతిమంతులకు ప్రతిఫలం లభిస్తుంది. దుష్టులు ఖండింప బడతారు. విశ్వాసము, మంచి కార్యాలను బట్టి తీర్పు ఉంటుంది. “గోధుమలు” దేవుని కృపకు ప్రతిస్పందించి మంచి ఫలాలను ఫలించే వారిని సూచిస్తాయి. “పొట్టు” పశ్చాత్తాపం కోసం దేవుని పిలుపును తిరస్కరించిన వారిని సూచిస్తుంది.

ఆధ్యాత్మిక సందేశం: (1). రక్షణకు పశ్చాత్తాపం తప్పనిసరి. యోహాను సందేశానికి, యేసు పరిచర్యకు ప్రధానం పశ్చాత్తాపానికి పిలుపు. మనం క్రమం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకొని, పాపములను ఒప్పుకోవాలి. దేవుని చిత్తానుగుణముగా జీవిస్తూ దేవుని దయను పొందుదాం. (2). బప్తిస్మము దేవుని కృపకు మార్గము. బప్తిస్మమువలన దేవుని పరిశుద్ధాత్మను స్వీకరించి, శ్రీసభలో సభ్యులముగా చేర్చబడుచున్నాము. (3). పశ్చాత్తాపము మంచి ఫలాలను ఇస్తుంది. పశ్చాత్తాపము అనగా కేవలం పాపాలకు చింతించడం మాత్రమేగాక, మంచి పనులు, దాతృత్వం, హృదయ పరివర్తన కలిగిన జీవితాన్ని జీవించడం. (4). క్రీస్తు రాకడకు సిద్ధపడాలి. అంతిమ దినమున క్రీస్తు రాకడకై ఎదురు చూస్తూ జీవించాలి. 

No comments:

Post a Comment