మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు

 మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు


కతోలిక శ్రీసభ అతిదూతలు లేదా మహాదూతలు అయిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు గార్ల పండుగను సెప్టెంబరు 29న కొనియాడుతుంది. ఈ రోజును సాధారణంగా మైఖేల్‌మాస్ (Michaelmas) అని పిలుస్తారు, ఎందుకంటే, 5వ శతాబ్దం నుండే మిఖాయేలు పండుగను మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమేణా మిగతా ఇద్దరు అతిదూతలనుకూడా చేర్చబడింది. ‘దూత’ అనగా ‘సేవకుడు’ లేదా ‘సందేశకుడు’ అని అర్ధం. బైబులులో పేర్కొనబడిన తొమ్మిది సమూహాలలో అతిదూతలు ఒకరు. ముందుగా, ‘దూతలు’ సజీవుడైన దేవున్ని ఆరాధించే అపారమైన సమూహాన్ని సూచిస్తారు. వారిలోనున్న రెండు లక్షణాలు ఏమిటంటే, ఒకటి ఆరాధన: దూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారు, నిరంతరం దేవున్ని మహిమపరుస్తారు, కీర్తిస్తారు. మనం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తూ, ప్రార్థనలో ఆయనను ధ్యానించాలి. రెండు, సేవ: ఆరాధన నుండి శక్తిని పొంది, దేవుని సంకల్పాన్ని ప్రపంచంలో, (ఇతరుల రక్షణ కోసం) నెరవేర్చడానికి సేవ చేస్తారు. మనం కూడా ప్రార్థన తర్వాత ఇతరులకు సేవచేస్తూ, దేవుని ప్రేమను ప్రకటించాలి.

మనకు ఎవరైనా అనుకోకుండా సహాయం చేసినవారిని, మంచి సలహా ఇచ్చిన వారిని దేవదూతలా వచ్చి నన్ను ఆదుకున్నావు అని అంటాం. నిర్గమ కాండములో దేవుడు ఇలా పలికాడు, “మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు, త్రోవలో మిమ్ము కాపాడుచు, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ము చేర్చుటకు, నా దూతను మీకు ముందుగా పంపెదను” (నిర్గమ 23:20). మనం ఊహించని సమయములో దేవుడు మనకు కల్పించిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం!

ఈరోజు ముగ్గురు అతిదేవదూతలను స్మరించుకుంటున్నాము. తోబితు గ్రంధం 12:15 ప్రకారం, ఏడుగురు అతిదూతలు ఉన్నప్పటికీ, బైబులులో పేర్లతో ప్రస్తావించబడిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు మాత్రమే కతోలిక శ్రీసభ అధికారికంగా గుర్తించే అతిదూతలు. వారి పేర్లు వారి పాత్రలను, స్వభావాన్ని సూచిస్తాయి. ఆ పేర్లన్నీ ఎల్ (El) అనే అక్షరంతో ముగుస్తాయి. ఈ ఎల్ అనేది హీబ్రూ భాషలో దేవుడు’ అని అర్ధం, కనుక వారు దేవుని దూతలు లేదా సందేశకులు అనే అర్థాన్ని సూచిస్తుంది.

(1). మిఖాయేలు: సాతాను, అతని దుష్టశక్తులకు వ్యతిరేకముగా పోరాడు దేవదూతల సమూహమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప అధిపతిగా, “పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత” అని, “జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు” అని దాని 10:13 మరియు 12:1లో చదువుచున్నాం. మరియు యూదా వ్రాసిన లేఖ 1:9లో మోషే శరీరము కొరకు సాతానుతో వాదించాడు అని చదువుచున్నాం. మరియు పిశాచము, సైతాను అయిన సర్పముతో యుద్ధము చేసి దానిని ఓడించినట్లుగా దర్శన గ్రంధం 12:7-12లో చదువుచున్నాం. కనుక, అతిదూత మిఖాయేలు, సాతానుకు మరియు అతని అనుచరులకు (దూతలకు) వ్యతిరేకంగా పోరాడే వీరుడు. శ్రీసభకు ప్రధాన రక్షకుడు, దేవున్ని ప్రేమించే వారిని కాపాడువాడు, మరియు దైవజనానికి సంరక్షకుడు. ‘మిఖాయేలు’ అనగా ‘దేవునితో సమానం ఎవరు?’ అని అర్ధం.

(2). గాబ్రియేలు: బప్తిస్త యోహాను జననమును అతని తండ్రి జెకర్యాకు (లూకా 1:11-20), మరియు యేసుక్రీస్తు జననాన్ని మరియమ్మకు ప్రకటించిన (లూకా 1:26-38) వారు గాబ్రియేలు. అలాగే, దానియేలుకు దర్శనాలను వివరించిన (దాని 8:16; 9:21) దేవదూత గాబ్రియేలు. గాబ్రియేలు దూత యోసేపుకు కలలో కనిపించాడని, బెత్లేహేములో గొర్రెల కాపురులకు కనిపించాడని, గేత్సేమని తోటలో యేసు మహావేదనలో ఓదార్చాడని (లూకా 22:39-46) శ్రీసభ సాంప్రదాయం చెబుతుంది. ‘గాబ్రియేలు’ అనగా ‘దేవుని బలం’ అని అర్ధం.

(3). రఫాయేలు గురించి తోబీతు గ్రంధము 12వ అధ్యాయంలో చూస్తాం. ప్రధానంగా స్వస్థపరచేవాడు. తోబీతు కుమారుడైన తోబియాకు, మాదియాకు వెళ్ళు ప్రయాణములో మనిషిగా మారువేషములో మార్గదర్శకుడిగా ఉన్నాడు. అతనికి చూపును కలుగజేశాడు. అలాగే, తోబియా భార్యయైన సారాను దురాత్మనుండి విముక్తి చేయడానికి, స్వస్థత పరచడానికి సహాయ పడ్డాడు. ‘రఫాయేలు’ అనగా ‘దేవుని స్వస్థపరచెను’ అని అర్ధం.

కతోలిక శ్రీసభ బోధనల ప్రకారం, దేవదూతలు, అతిదేవదూతలతో సహా నిజమైన ఉనికిని కలిగి యున్నారని, వారు కేవలం ఊహాత్మక వ్యక్తులు కాదని శ్రీసభ బోధిస్తుంది. వారు నిర్ధేహ ఆత్మలు (non-corporeal spiritual beings). వారు దేవుని సేవకులు, సందేశకులు (messengers). అతిదూతలు (Archangels) అనేవారు దూతల సమూహంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. వీరు దేవుని నుండి అత్యంత ముఖ్యమైన కార్యముల కొరకు, మహోన్నత రహస్యాల ప్రకటన కొరకు పంపబడతారు. దేవదూతలు మానవులకు కూడా సేవలు, సహాయం చేస్తారు. మానవుల రక్షణ, మార్గదర్శకత్వం కొరకు దేవునిచే పంపబడతారు. ప్రతీ వ్యక్తికి ఒక కావలి సన్మనస్కుడు లేదా దూత (Guardian Angel) ఉన్నట్లే, అతిదూతలు కూడా మానవ చరిత్రలో ముఖ్యమైన ప్రాత్రను పోషించారు.

అతిదూతలకు కతోలిక శ్రీసభ ఎందుకంత ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తుందని ఆలోచిస్తే, మన జీవితంలో వారి పాత్ర, పునీతుల పాత్రకు భిన్నంగా ఉంటుంది. పునీతుల విషయంలో, వారి విజ్ఞాపన కోసం మనం ప్రార్థించడమే కాక, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవదూతలు అందుకు భిన్నం. దేవదూతలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కొరకు దేవునిచే సృష్టించబడిన నిర్దేహ ఆత్మ ప్రాణులు.

 “పరిశుద్ధ గ్రంథం సాధారణంగా దూతలు అని పిలిచే, ఈ ఆత్మ సంబంధమైన, దేహము లేని ప్రాణులు (spiritual, non-corporeal beings) యొక్క ఉనికి ఒక విశ్వాస సత్యం (a truth of faith). ఈ సత్యానికి పరిశుద్ధ గ్రంథ సాక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో, సంప్రదాయం (Tradition) యొక్క ఏకాభిప్రాయం కూడా అంతే స్పష్టంగా ఉంది” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 328లో చదువుచున్నాం.

దేవదూతలు శుద్ధ ఆధ్యాత్మిక జీవులు కనుక దూతలకు మేధస్సు, సంకల్పం ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులు, చిరంజీవులు. కంటికి కనిపించే సృష్టి జలాన్ని మించిన పరిపూర్ణత వాళ్లకుంది. వాళ్ళని ఆవరించి ఉండే తేజస్సే ఇందుకు సాక్ష్యం” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 329లో చదువుచున్నాం.

శ్రీసభ పండితులు, పునీతులు, జగద్గురువుల బోధనల ప్రకారం,

పునీత మిఖాయేలు దేవుని సైన్యానికి అధిపతి, శ్రీసభ సంరక్షకుడు. 13వ లియో జగద్గురువులు 19వ శతాబ్దంలో భయంకరమైన దుష్టశక్తులు శ్రీసభను నాశనం చేయడాన్ని దృష్టితో చూసిన తరువాత, ‘పునీత మిఖాయేలు ప్రార్ధన’ను రచించి, ప్రతీ దివ్యబలి పూజ తరువాత, ప్రార్ధించేలా ఆదేశించారు. పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, సాతానుకు వ్యతిరేకంగా మిఖాయేలు పోరాటం నేటికీ కొనసాగుతుందనీ నొక్కి చెప్పారు. వాటికన్ గార్డెనులో, పునీత మిఖాయేలు స్వరూపాన్ని ప్రతిష్టించిన సందర్భంగా (2013), పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు, “అతిదూత మిఖాయేలు దైవిక న్యాయాన్ని తిరిగి నెలకొల్పడానికి పోరాడుతాడు; ఆయన దేవుని ప్రజలను వారి శత్రువుల నుండి, ముఖ్యంగా శత్రువులకల్లా ముఖ్య శత్రువు అయిన సాతాను నుండి రక్షిస్తాడు. పునీత మిఖాయేలు విజయం సాధిస్తాడు, ఎందుకంటే అతని ద్వారా పనిచేసేది స్వయంగా దేవుడే.

పునీత గాబ్రియేలు దేవుని శక్తిని, బలాన్ని సూచిస్తాడు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన సందేశాలను తీసుకువచ్చాడు. ఈవిధంగా, దేవుని రక్షణ ప్రణాళికలో అత్యంత ప్రధాన పాత్రను పోషించాడు.

పునీత రఫాయేలు స్వస్థపరచేవాడు, మార్గదర్శకుడు. రఫాయేలు దేవుని స్వస్థతను సూచిస్తాడు. యోహాను సువార్తలో ప్రస్తావించబడిన బెతెస్దా కోనేటిని (యోహాను 5:2-4) స్వస్థత కొరకు కదిలించిన దూత రఫాయేలే అని పునీత అగుస్తీనుగారు నమ్మేవారు. రఫాయేలు కేవలం శారీరక స్వస్థతనే గాక, ఆధ్యాత్మిక స్వస్థతను, ప్రయాణాలలో, జీవితంలోని కష్ట సమయాలలో మార్గదర్శకత్వంను కూడా ఇస్తాడని పునీతులు బోధించారు. తోబీతు గ్రంథంలోని అతని పాత్ర ద్వారా, కుటుంబాలకు, వివాహాలకు రక్షకుడిగా కూడా అతని ప్రార్ధన సహాయాన్ని వేడుకుంటారు.

ఈవిధంగా, కతోలిక శ్రీసభ ఈ ముగ్గురు అతిదూతలను పరలోక యోధులుగా, దైవసందేశకులుగా, స్వస్థపరిచేవారిగా గౌరవిస్తుంది. వారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా, దేవుడు మనకు రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను పొందుకుంటామని విశ్వసిస్తుంది.

దూతలు దేవుని నిరంతరంగా మహిమపరచే మరియు ఇతర ప్రాణుల రక్షణ ప్రణాళిక కొరకు సేవచేసే ఆత్మ సంబంధమైన ప్రాణులు. “దూతలు మనందరి మేలు కొరకు కలిసి పనిచేస్తారు” అని పునీత థామస్ అక్వినాస్ గారు బోధించారు. పునీత అగుస్తీను ప్రకారం, దూతలు సృష్టి యొక్క మొదటి రోజున సృష్టించబడ్డారు. దీనిని ఆదికాండము 1:3-4లో చూడవచ్చు. దేవుడు, “వెలుగు కలుగుగాక అని ఆజ్ఞాపించగా, వెంటనే వెలుగు కలిగెను. ఆ వెలుగు కంటికి బాగుగా ఉండెను. దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేసెను. ఆ విధంగా వెలుగును చీకటి నుండి వేరుచేయడం అనేది మంచి మరియు చెడ్డ దూతలకు పెట్టిన పరీక్షగా, వారి విభజనగా పరిగణించబడింది. ఆ సమయంలోనే పునీత మిఖాయేలు, ‘దేవునితో సమానం ఎవరు?’ అనే యుద్ధ నినాదంతో సాతానును, ఇతర దురాత్మలను పరలోకం నుండి వెళ్ళగొట్టాడు.”

అతిదూతల పండుగ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, “దేవుని దయ, సహాయం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మనం ఒంటరిగా పోరాడనవసరం లేదు.” జీవితంలోని ప్రతి క్షణంలోనూ, దూతలు కనిపించకపోయినా, చురుకుగా ఉండి, మార్గనిర్దేశం చేస్తూ, రక్షిస్తూ, దేవుని సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటారు.

“దుష్టశక్తులకు వ్యతిరేకంగా దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు.” ఈ లోకంలో మనకు శోధనలు, చెడు అలవాట్లు, ఆందోళనలు, ఆధ్యాత్మిక పోరాటాలు అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే, ఈ పోరాటంలో మనకు దేవుని వైపు నుండి ఒక శక్తివంతమైన సంరక్షకుడు ఉన్నాడని పునీత మిఖాయేలు గుర్తుచేస్తాడు. కనుక, ధైర్యంగా ఉంటూ, చెడు లేదా అన్యాయం మన చుట్టూ ఉన్నప్పుడు, భయపడకుండా దేవుని శక్తిని, మిఖాయేలు రక్షణను వేడుకోవాలి.

“దేవుని సంకల్పం మరియు శుభవార్త మన జీవితాల్లో ప్రకటించబడతాయి.” దేవుడు మన జీవితాలలో కూడా కొన్ని ముఖ్యమైన శుభవార్తలను లేదా ప్రణాళికలను ప్రకటిస్తాడు. అవి మన ఆత్మలో కలిగే ప్రేరణలు కావచ్చు. మన కర్తవ్యం గురించి కలిగే స్పష్టత కావచ్చు. దేవుని పిలుపును వినడానికి, అది కష్టంగా ఉన్నా దానిని నమ్మకంతో అంగీకరించడానికి మనకు ధైర్యం ఇవ్వడానికి గాబ్రియేలు అతిదేవదూత సిద్ధంగా ఉన్నాడు. కనుక, ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో దేవుని సంకల్పం గురించి స్పష్టత కోసం గాబ్రియేలును వేడుకోవాలి.

“దేవుడు మన గాయాలను మాన్పి, మన ప్రయాణంలో నడిపిస్తాడు.” మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు శారీరక వ్యాధులు, మానసిక గాయాలు, ఆధ్యాత్మిక నష్టాలు సంభవించవచ్చు. దేవుని స్వస్థపరిచే కరుణ మనకు అందుబాటులో ఉందని, ఆయన ఒక నమ్మకమైన స్నేహితుడిలా మనకు సహాయం చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి పునీత రఫాయేలు సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేస్తుంది. కనుక, మన గాయాలు లేదా ఇతరుల బాధల కోసం స్వస్థతను కోరుకోవాలి. జీవితంలో తికమక పడినప్పుడు, సరైన నిర్ణయాల కోసం మార్గదర్శకత్వం కోసం పునీత రఫాయేలును వేడుకోవాలి.

ఈవిధంగా, అతిదూతల పండుగ మనకు బోధించే ముఖ్య సత్యం ఏమిటంటే, పరలోకంలోని దూతల మాదిరిగానే, మనమూ దేవుని పట్ల నమ్మకంతో, విధేయతతో, వినయంతో జీవించాలి. ఎందుకంటే, అతిదూతలు దేవుని సేవకులు మాత్రమే, దేవుడే అంతటికీ మూలం కనుక.

కనుక, నేడు మనం దేవుని దయలో భాగమైన అతిదూతలను మన జీవితంలోకి ఆహ్వానించుదాం. తద్వారా, వారి ప్రత్యేక సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని, రక్షణను పొందవచ్చు. భయం, శోధన లేదా ఆధ్యాత్మిక పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు, రక్షణ యోధుడైన మిఖాయేలును ఆహ్వానించుదాం! జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సందేశకుడైన గాబ్రియేలును ఆహ్వానించుదాం! శారీరక లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, సరైన జీవిత భాగస్వామి లేదా స్నేహితుని కోసం వెతుకుచున్నప్పుడు, స్వస్థపరిచేవాడు, మార్గదర్శకుడైన రఫాయేలును ఆహ్వానించుదాం!

ఈ ముగ్గురు అతిదూతల యొక్క ప్రత్యేక సహాయాన్ని కోరుతూ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకుందాం. మన ప్రార్థనలో వారిని ఎంత తరచుగా గుర్తు చేసుకుంటే, దేవుని ద్వారా వారు మనకు అంత దగ్గరగా ఉంటారు.

ఈ అతిదూతలు మీ ఆత్మకు, శరీరానికి, మీ దైనందిన జీవితానికి రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను!

No comments:

Post a Comment