పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

శిష్యులు యేసు వద్దకు వచ్చి, “పరలోక రాజ్యమున అందరి కంటె గొప్పవాడు ఎవడు?” అని ప్రశ్నించారు. యేసు కాలములో, రబ్బయిలు, వారి అనుచరుల మధ్యన హోదా, గొప్పతనం గురించిన చర్చలు సాధారణం. యూద సంస్కృతిలో, గొప్పతనం లేదా హోదా తరుచుగా, సామాజిక స్థితి, మతపరమైన జ్ఞానం, చట్టానికి కట్టుబడి యుండటం వంటిపై ఆధారపడి ఉంటుంది. ఒకానొక సమయములో, శిష్యులు ఎప్పుడుకూడా భూలోకములో, మరియు పరలోకములో వారి హోదా, అధికారము, ఉన్నత స్థానము గురించి ఆలోచించారు, ఆందోళన చెందారు. జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో (యోహాను, యాకోబు) యేసు వద్దకు వచ్చి, “నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ యెడమ వైపున కూర్చుండ సెలవిమ్ము” అని మనవి చేయడం. “తక్కిన పదగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి” (మత్త 20:20-28; మార్కు 10:35-45). “తమలో గొప్పవాడెవ్వడు అని వాదించు కొనిరి” (మార్కు 9:33-37). కదరాత్రి భోజన సమయములో కూడా “తమలో ఎవరు గొప్పవాడు అను వివాదము శిష్యులలో తల ఎత్తెను” (లూకా 22:24).

దేవుని దృష్టిలో నిజమైన ‘గొప్పతనం’ ఏమిటో వారు గ్రహించలేక పోయారు! ‘గొప్పతనం’ గురించి ఈ లోకం తీరులో ఆలోచించారు. యేసు జీవించిన కాలం, సమాజములో, చిన్న బిడ్డలకు సామాజిక హోదాగాని, ప్రాముఖ్యతగాని ఉండేది కాదు. ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలపడం, యేసు చిన్న బిడ్డల గొప్పతనాన్ని సవాలు చేస్తున్నాడు! ‘వినయం’ లేదా ‘వినమ్రత’ అనే సుగుణము యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పుచున్నాడు. పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ చెంది చిన్న బిడ్డలవలె రూపొందాలని తెలియ జేశారు. చిన్న బిడ్డలవలె రూపొందడం అనగా హృదయ పరివర్తన చెందడం. బిడ్డలవలె అమాయకత్వం, వినయం, దేవునిపై ఆధారపడే సుగుణాలను కలిగి యుండటం.

సందేశం: ఆధ్యాత్మిక జీవితములో, దేవునితో సహవాస సంబంధ ప్రయాణములో వినయము, నమ్మకము, సరళమైన జీవితము ముఖ్యమని యేసు బోధిస్తున్నాడు. మొదటిగా, వినయం చాలా కీలకం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అనగా హోదా, జ్ఞానం, శక్తి కావు. ‘రక్షణ’ను హోదా, జ్ఞానం, శక్తిద్వారా పొందలేము. వినయము కలిగి జీవించడం. ‘చిన్న బిడ్డలవలె’ మన స్వశక్తిపైగాక, దేవునిపై ఆధారపడి జీవించడం. ‘గొప్పతనం అనగా నిస్వార్ధము, సేవ, నిగర్వము అని యేసు పునర్నిర్వచించాడు. “అందరిలో చివరివాడై, అందరకు సేవకుడిగా ఉండవలయును” (మార్కు 9:35). పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ తప్పనిసరి. ‘చిన్న బిడ్డలవలె రూపొందిననే తప్ప’ అనగా పరలోక రాజ్యమున ప్రవేశించాలంటే ఈ ‘పరివర్తన’ ఐచ్చికం (ఆప్షనల్) కాదు, కాని తప్పనిసరి అని అర్ధమగుచున్నది. ఇది మన జీవితాలను, దేవునిముందు సరళత, చిత్తశుద్ధి కలిగి యుండునట్లు చేస్తుంది. గర్వాన్ని, అహంకారాన్ని వీడి దేవునిపై ఆధారపడటం, వినయం కలిగి జీవించడం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అధికారము చెలాయించడం కాదు. గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలయును” (లూకా 22:25-26). మనం కూడా ‘గొప్పతనం’ అనేది హోదా, అధికారం, స్థానం కాదు. వినయం, నిస్వార్ధం, సేవ అని గుర్తించుదాం!

“వినయం” ఇతర సద్గుణాలకు పునాది. కనుక, ఈ సద్గుణం లేని హృదయములో, కపటం తప్ప ఏ యితర సద్గుణం ఉండదు” (పునీత అగుస్తీను). ‘పరివర్తన’ అనగా అధికారం, హోదాలపై గల ఆశలను వదులుకొని, దేవునిపై సంపూర్ణ నమ్మకము కలిగి, ఆయనపై ఆధారపడి జీవించడం. వినయం నిజమైన గొప్పతనానికి ఉన్నతమైన మార్గం.

‘పరివర్తన’ (18:3) ముఖ్యమైన మార్పును లేదా టర్నింగ్ పాయింటును సూచిస్తుంది. ‘పరివర్తన’ అనగా పాపమును, సాతానును వీడి, దేవుని వైపునకు మరలడం. పశ్చాత్తాపం, విశ్వాసం, మార్పు కలిగి యుండాలి. పూర్వ నిబంధనములో, ‘పరివర్తన’ హీబ్రూ భాషలో “శువ్”, పశ్చాత్తాపాన్ని, వెనకకు తిరిగి రావడాన్ని సూచిస్తుంది. దారి తప్పిన వారు తిరిగి దేవుని చెంతకు రావడం. ఇదే విషయం ప్రవక్తల బోధనలలో కూడా కనిపిస్తుంది (యోవేలు 2:12-13; హోషేయ 6:1). ‘పరివర్తన’ అనగా హృదయ పరివర్తన అని యెహెజ్కెలు 36:26లో చూడవచ్చు. ఇది అంత:ర్గత పునరుద్ధరణ. నూతన నిబంధనములో, ‘పరివర్తన’ అనగా ఆధ్యాత్మిక పునర్జన్మ అని నొక్కి చెప్పాడు. యోహాను 3:3 – “నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలరు”. దీని అర్ధం యోహాను 3:5లో – “నీటివలన, ఆత్మ వలన జన్మించడం”. క్రీస్తును అంగీకరించడం ప్రాధమిక పరివర్తన. అ.కా. 2:38 – “మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలయును.” పశ్చాత్తాపం, పాపమును వీడటం, యేసుక్రీస్తునందు విశ్వాసం పరివర్తనలో ప్రధానం. పరివర్తనకు, హృదయమార్పునకు, బిడ్డలవలె రూపొందడానికి చక్కటి ఉదాహరణ సౌలు పౌలుగా మారడం (పౌలు పరివర్తన). అలాగే, తప్పిపోయిన కుమారుడు (లూకా 15:11-32), త్రోవ తప్పిన గొర్రె (లూకా 15:1-7).

‘పరివర్తన’ అనగా క్రీస్తులో కొత్త జీవితము, నూతన సృష్టి (2 కొరి 5:17). పరివర్తన అనగా క్రీస్తులో నూతన గుర్తింపు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. ‘పరివర్తన’ అంటే కేవలం అంత:ర్గతమే కాదు. అంత:ర్గత మార్పు, మన జీవితములో, మన మాటలలో, చేతలలో, మన ఆలోచనలలో, వైఖరిలో ప్రతిబింబించాలి. ఎఫెసీ 4:22-32లో “మోసకరమగు దుష్టవాంచలచే భ్రష్టమైన పూర్వజీవితపు పాతస్వభావమును మార్చుకొనుడు. మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. అసత్యములు పలుకరాదు. కోపము పాపములోనికి లాగుకొనిపోకుండా చూచుకొనుడు. దొంగతనము మానివేయాలి. అక్కరలోనున్న వారికి సహాయం చేయ మంచి పనులు చేయుచు కష్టపడవలెను. దుర్భాషలు రానీయ కూడదు. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరపులుగాని, అవమానములుగాని ఉండరాదు. ఏవిధమైన ద్వేష భావము ఉండరాదు. పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. ఒకరిని ఒకరు క్షమింపుడు.”

‘పరివర్తన’ ఒకసారి జరిగేది కాదు. ఇది నిత్యమూ కొనసాగే ప్రక్రియ. ప్రారంభమైన పరివర్తన, ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదుగుదల కొనసాగుతుంది.

‘పరలోక రాజ్యము’ ప్రాపంచిక విలువలకు వ్యతిరేకమైనది. మన వైఖరిని ఆత్మపరిశీలన చేసుకుందాం! వినమ్రత, ప్రేమ, సేవా భావముతో జీవిస్తున్నామా?

1 comment: