క్రీస్తు ఉత్థాన మహోత్సవము

 క్రీస్తు ఉత్థాన మహోత్సవము

క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును గొప్ప మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ. ఇది ఒక నిరీక్షణ పండుగ! ఈరోజు యేసుక్రీస్తు మరణమునుండి ఉత్థానమవుటను కొనియాడుచున్నాము. ఇది విశ్వాసులందరికి ఒక గొప్ప ఆశను, వారి  హృదయాలలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది.
క్రీస్తు ఉత్థానం, తిరుసభలో నాలుగు కారణాల చేత అతి గొప్పది, అతి ప్రాముఖ్యమైనది.
1. క్రీస్తు ఉత్థానం, మన విశ్వాసానికి మూలాధారము. అద్భుతాలలోకెల్ల ఉత్థానం మహాద్భుతం, ఎందుకంటే, ఉత్థానం క్రీస్తు దేవుడని మనకు నిరూపిస్తున్నది. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). “యేసు ప్రభువు” అని, “దేవుడు ఆయనను లేవనెత్తెను” అని రోమీ 10:9 లో చదువుచున్నాము. అపోస్తలుల యొక్క బోధనా సారాంశం: క్రీస్తు ఉత్థానం.
2. క్రీస్తు ఉత్థానం మన పునరుత్థానానికి హామీని ఇస్తుంది. లాజరు సమాధివద్ద మార్తమ్మతో యేసు వాగ్దానం చేసాడు, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26).
3. క్రీస్తు ఉత్థానం నిరీక్షణ పండుగ. ఈ లోకపు బాధలలో, దుఃఖాలలో, కన్నీళ్ళలో క్రీస్తు ఉత్థానం మనకు ఆశను, నిరీక్షణను, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ జీవితం విలువైనదని మనకు గుర్తుకు చేయుచున్నది. శోధనలకు, అనవసరమైన భయాందోళనలకు వ్యతిరేకముగా పోరాడే శక్తిని మనకు క్రీస్తు ఉత్థానం ఇస్తుంది.
4. మనం చేసే వ్యక్తిగత మరియు సంఘ ప్రార్ధనలకు క్రీస్తు ఉత్థానం అర్ధాన్నిస్తుంది. ఉత్థాన క్రీస్తు నిజముగా మన మధ్యన, మనచుట్టూ, శ్రీసభలో, దివ్యసంస్కారములో, పరలోకములో ఉన్నాడు అన్న మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
క్రీస్తు ఉత్థానమును మనం ఎందుకు విశ్వసిస్తున్నాము?
1. స్వయముగా క్రీస్తే తన ఉత్థానము గురించి, తన దైవత్వానికి సూచనగా సాక్ష్యమిచ్చాడు: (చదువుము మార్కు 8:31; మత్త 17;22-23; లూకా 9:22). యోహాను 2:19, “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును”.
2. ఈస్టర్ ఆదివారమున “ఖాళీ సమాధి కనుబడుట” (లూకా 24:3). సైనికులు అబద్ధసాక్ష్యము చెప్పినను (మత్త 28:13), అపోస్తలులు దొంగిలించారని చెప్పినను, అది అసాధ్యమని యూద పెద్దలకు బాగా తెలుసు.
3. ఉత్థాన క్రీస్తు దర్శనాలు. ఆరంభములో శిష్యులు, విశ్వాసులు అవిశ్వాసమును కలిగి యున్నను, ఉత్థాన క్రీస్తు దర్శనాల వలన, వారిలో విశ్వాసం కలిగింది. ఈ దర్శనాలు క్రీస్తు ఉత్థానమునకు బలమైన ఋజువుగా ఉంటుంది.
4. యేసు శిష్యులయొక్క పరివర్తన: యేసు సిలువ మరణం తరువాత, శిష్యులు భయముతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు (లూకా 24:21; యోహాను 20:19). క్రీస్తు ఉత్థానం, పవిత్రాత్మ అభిషేకం వారిలో పరివర్తన కలిగించాయి. ఇప్పుడు వారు ధైర్యముగా పునరుత్థాన క్రీస్తుకు సాక్ష్యులుగా మారారు (అ.కా. 2:24; 3:15; 4:2). పునరుత్థాన క్రీస్తు గురించి శక్తివంతముగా భోధించారు.
5. యూదులుగాని, రోమనులు గాని, క్రీస్తు పునరుత్థానానికి వ్యతిరేకముగా ఏవిధముగాను నిరూపించలేక పోయారు. యేసు మృత దేహాన్ని చూపించలేక పోయారు.
6. క్రీస్తు ఉత్థానం కానిచో, అపోస్తలులు గాని, తొలి క్రైస్తవులుగాని అంత ధైర్యముగా బోధించేవారు కాదు, చివరికి తమ ప్రాణాలను సైతము అర్పించే సాహసం చేసియుండేవారు కాదేమో!
7. అపోస్తలుడు పౌలు పరివర్తన, హింసించే సౌలునుండి ఉత్థాన క్రీస్తుకొరకు ఉత్సాహపూరిత బోధకుడిగా మారడం, క్రీస్తు ఉత్థాన సత్యాన్ని బలపరుస్తుంది (గలతీ 1:11-17; అ.కా. 9:1, 24-25; 26:15-18).
8. మొదటి మూడు శతాబ్దాలు, క్రీస్తు కొరకు వేద హింసలను ధైర్యముగా ఎదుర్కొని నిలబడింది, జీవించ గలిగింది తొలి శ్రీసభ. ఇది నిజముగా క్రీస్తు ఉత్థానాన్ని సమర్ధిస్తుంది.
పాస్క పరమ రహస్యం - యేసు ఉత్థానం
"ఆయన పునరుత్థానుడయ్యెను"  - మార్కు 16:6; “నజరేయుడగు యేసు పునరుత్థానుడయ్యెను! మీరు వెళ్లి పేతురునకు, తక్కిన శిష్యులకు చెప్పుడు!” (మార్కు 16:1-7). ఆదివార వేకువజామున, యేసు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో [మగ్ధలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ] తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడిప్రక్కన కూర్చుండి యున్న ఒక యువకుడు [దేవదూత - మత్త 28:5; ఇరువురు పురుషులు లూకా 24:4] ఈ మాటలను చెప్పెను. ఇదొక శుభ సమాచారము! సంతోషకరమైన వార్త! స్త్రీలు ఆ శుభవార్తను పేతురునకు, ఆయన సోదరులకు చెప్పారు. ఆ తరువాత, ఈ శుభవార్తను, పేతురు లోకమంతటికి తెలియజేసాడు. 
50 రోజుల తరువాత, పేతురు ఈ శుభసమాచారాన్ని "యూదయా జనులకు, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులకు", (అ.కా. 2:14), లోకమంతటికి చాటి చెప్పాడు: "నజరేయుడైన యేసును... దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22, 32).
యేసు ఉత్థానం గురించి చాటిచెప్పాలంటే, దైవానుగ్రహం ఉండాలి: "పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు 'యేసే ప్రభువు' అని అంగీకరింప జాలడు" (1 కొరి 12:3). యేసు ఉత్థానం గురించి ప్రకటించాలంటేవినయం, దైవభీతి ఉండాలి. క్రీస్తు ఉత్థానం గురించి మనమందరం భయపడక, ధైర్యముగా ప్రకటించాలి: "విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్టుడు, గెలుపొందినాడు" (దర్శన 5:5). యేసు పునరుత్థానం గురించి చెప్పుటకు, మనకు మాటలు చాలవు! సిలువ ప్రబోధము నుండి, ఉత్థాన ప్రబోధం చేయడమంటే, ఎండిన నేలనుండి, సముద్ర తీరమునకు పరుగులు తీయడం లాంటిది! "మగ్ధలా మరియమ్మ సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి" (యోహాను 20:2), ఖాళీ సమాధి గురించి చెప్పగా, "పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తు చుండిరి" (యోహాను 20:3).
యేసు ఉత్థాన అనుభూతిని పొందిన మనం, కీర్తనకారునితో కలిసి, "నా ఆత్మమా! మేలుకొనుము! వీణ తంత్రీ వాద్యము మేల్కొనును గాక! నేను ఉషస్సును మేలుకొల్పెదను" (కీర్త 57:8) అని ఎలుగెత్తి పాడాలి. "భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడ నక్కరలేదు. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు" (కీర్త 46:2-3, 8). దేవుడు చేసిన "మహాకార్యములు" అన్నియు, క్రీస్తు ఉత్థానములో పరిపూర్తి అయ్యాయి. అందుకే పౌలు అంటాడు, “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి 15:14). ఉత్థాన క్రీస్తు, తలుపులు మూసి యున్నను, యేసు లోపలి వచ్చి శిష్యుల మధ్య నిలువ బడెను (యోహాను 20:19). మూసియున్న మన హృదయాలలోనికి, సంస్కృతిలోనికి, ఆయనను తిరస్కరించే నాస్తిక పాలనలోనికి, మూసియున్న మన స్నేహాలలోనికి, కుటుంబాలలోనికి, సంఘములోనికి... ఉత్థాన క్రీస్తు రావాలి. ఏదీకూడా మృత్యుంజయుడైన యేసును ప్రతిఘటించలేదు; మూసియున్న తలుపులున్నను, గోడల ఆవలినుండి ఆయన ప్రవేశించును. క్రీస్తు ఉత్థానం యుగాంతముల వరకు, ఆయన మరల తిరిగి వచ్చువరకు కొనసాగుతుంది. “ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము" అని ప్రతీ దివ్యపూజా బలిలో మనం ప్రకటించు విశ్వాస రహస్యమును ఏదియు కూడా ఆపలేదు.
క్రీస్తు ఉత్థానం - పాస్క పరమ రహస్యము
క్రీస్తు ఉత్థానం చారత్రక సంఘటన. ఇదొక అపూర్వమైన, పునరావృతం కాని సంఘటన. ఈ అద్భుతమైన సంఘటనను, ప్రతీరోజు దివ్యసంస్కారమైన దివ్యపూజాబలిలో జ్ఞాపకార్ధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు ఉత్థానం క్రైస్తవుల విశ్వాసము. క్రీస్తు శ్రమలు, ఉత్థానం పాస్క పరమ రహస్యమును ఏర్పరచు చున్నాయి. అయితే, రెండు వేరువేరు సంఘటనలు కాదు. ఒకే సంఘటన - మరణమునుండి జీవమునకు.... క్రీస్తు నిజముగా ఉత్థానమైనారా? “ప్రభువు వాస్తవముగ (ontos - నిజముగానే) సజీవుడై లేచెను. “వాస్తవమును గ్రహించుటకు ఈ గ్రంథమును వ్రాయుచున్నాను" (1:4) అని లూకా సువార్తీకుడు తెలుపుచున్నారు. క్రీస్తు శ్రమలు, మరణం తరువాత, శిష్యులలోనున్న వెలుగు మాయమయింది. ఆయనను వారు దేవుని కుమారుడని విశ్వసించారు. ప్రవక్తలందరికంటే గొప్పవాడని విశ్వసించారు. కాని ఇప్పుడు వారికి ఏమి చేయాలో తోచలేదు. వారి మనసులలోని భావాలను లూకా ఇలా తెలిపాడు: "అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు రోజులాయెను" (24:21). అంతా అయిపోయిందని వారు భావించారు.
పేతురు క్రీస్తు ఉత్థానం గూర్చి చెబుతూ, "విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింప బడిన రాయియే మూలరాయి ఆయెను" (1 పేతు 2:7) అని తెలిపాడు. పేతురు పవిత్రాత్మతో పూరితుడై, "యేసు క్రీస్తునందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు” (అ.కా. 4:12) అని నాయకులకు, పెద్దలకు సమాధానమిచ్చాడు. భయముతో పారిపోయిన శిష్యులు, విశ్వాసం సన్నగిల్లిన శిష్యులు, ఆ తరువాత ధైర్యముగా "యేసు ఉత్థానమాయెను" అని ప్రకటించారు. యేసు పేరిట సంఘములను స్థాపించారు. యేసు కొరకు, హింసలను భరించుటకు, ప్రాణములను సైతము త్యాగము చేయుటకు సిద్ధపడ్డారు. 
పౌలు సాక్ష్యం
క్రీస్తు పునరుత్థానమును గూర్చిన ప్రారంభ సాక్ష్యం పునీత పౌలు 1 కొరి 15:3-8లో చూడవచ్చు:
“నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడవ దినమున సజీవముగ లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆపైన యాకోబునకు తదుపరి అపోస్తలుల కందరికిని ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను."
పౌలు ఈ వాక్యాలను క్రీ.శ. 56 లేదా 57లో వ్రాసారు. ఈ సాక్ష్యాన్ని పౌలు ఇతరులనుండి స్వీకరించాడని చెప్పాడు. బహుశా, పౌలు తన పరివర్తన తరువాత పొందినట్లయితే, ఈ సాక్ష్యాన్ని మనం క్రీ.శ. 35 నాటిదని చెప్పవచ్చు. నిజానికి చాలా ప్రాచీన సాక్ష్యము. ఈ సాక్ష్యములో ఉన్న రెండు ప్రాథమిక వాస్తవాలు: "యేసు సజీవముగ లేవనేత్తబడెను" మరియు "ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను."
"యేసు సజీవముగ లేవనేత్తబడెను" (గ్రీకు: egegertai) అనగా "తిరిగి జీవం పోసుకున్నారు", "మరల లేచారు", "పునరుత్థానం చెందారు", "పునర్జీవం పొందారు" అని అర్ధం. ఆయన పునర్జీవం లాజరువలె మరల మరణించుట వంటిది కాదు.
"ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను" (ophthe) అనగా తననుతానుగా ఇతరులకు కనిపించారు; "మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము" (అ.కా. 4:20) అని పేతురు, యోహానులు బదులు పలికారు.
సువార్తలు - క్రీస్తు ఉత్థానం
యేసు లేవనెత్తబడెను మరియు దర్శనమిచ్చెను, అయితే సువార్తలలో 'ఖాళీ సమాధి' గురించిన అంశం జోడించబడినది. ఖాళీ సమాధిని బట్టియే, యోహాను సువార్తీకుడు యేసు ఉత్థానమునకు ప్రత్యక్ష సాక్ష్యముగా వ్యక్తపరచాడు (యోహాను 20:3f.): నార వస్త్రములు అచట పడియుండుట, తలకు కట్టిన తుండుగుడ్డ నారవస్త్రములతో పాటుకాక, విడిగ చుట్టి ఉండుట.... అలాగే, ఉత్థాన క్రీస్తు దర్శనాలు ఆయన ఉత్థానమునకు సాక్ష్యాలు.
క్రీస్తు ఉత్థానం- విశ్వాసం
క్రీస్తు ఉత్థానమును విశ్వాసముతో అర్ధము చేసుకోవాలి. చారిత్రక సంఘటనలు (ఖాళీ సమాధి) వారి విశ్వాసాన్ని బలపరచాయి, కనుక విశ్వాసం ప్రధానం. "క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్త బడెను" (1 కొరి 15:20) అని పౌలు చెప్పారు. అలాగే, "క్రీస్తే లేవనెత్త బడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14). “మన ప్రభువగు యేసును మృతులలోనుండి లేవనెత్తిన ఆయనయందు మనకు విశ్వాసమున్నది” (రోమీ 4:24).
పెంతకోస్తు అనంతరం, పేతురు యెరూషలేము ప్రజలకు, "ఇస్రాయేలు ప్రజలారా! ఈ మాటల నాలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా, దేవుడు మీకు రూడి ఒనర్చెను... యేసును మీరు న్యాయ రహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. కాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపేను. మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22-32) అని బోధించాడు.
పౌలు ఏతెన్సులో, 'దేవుడు మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను” (అ.కా. 17:31) అని ప్రచారం చేసాడు. "మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో, నీవు రక్షింప బడుదువు" (రోమీ 10:9). ఉత్థానము వలన, యేసు “ప్రాణ దాతయగు ఆత్మ”గా మారెను (1 కొరి 15:45).
క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన పండుగ! ఎందుకన మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాము. మరణం శాశ్వత ముగింపునకుగాక, నిత్యజీవితానికి ద్వారముగా యేసు చేసియున్నారు. మరణం, మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రియైన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశము. ఈస్టర్ మహోత్సవం, అంధకారములోనున్న వారికి వెలుగును, బాధలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్టశక్తులతో పోరాడే వారికి ధైర్యమును, బలమును ఒసగును.
జీవిత పాటాలు
1. ఉత్థాన క్రీస్తు ప్రజలుగా, విశ్వాసులుగా జీవిద్దాం. పాపము, చెడు అలవాట్లు, వ్యసనాలు, నిరాశ, నిరుత్సాహం, సందేహాలు అనే సమాధిలో మనం ఉండకూడదు, సమాధి చేయబడకూడదు. దానికి బదులుగా, ఉత్థాన క్రీస్తు యొక్క సంతోషముతో, శాంతి సమాధానాలతో జీవించాలి. మన అన్ని సమస్యలలో, ఉత్థాన ప్రభువు ఉన్నాడని గుర్తించాలి.
2. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం, మనతో, మనలో, మనచుట్టూ ఉన్నదని విశ్వసించాలి. అది మనం మంచి, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించేలా మనలను బలపరుస్తుంది. ఈ విశ్వాసం మన ఆలోచనలను, కోరికలను, మాటలను, ప్రవర్తనను, క్రియలను నియంత్రించేలా చేస్తుంది.
3. మనలో ఉత్థాన ప్రభువు యొక్క సాన్నిధ్యం ఉన్నదని గుర్తించిన యెడల, మన శరీరాలను, మనస్సులను నిర్మలముగా, పవిత్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరముగా ఉంటాము. ఎదుటి వారిని గౌరవిస్తాము. వారిని ప్రేమిస్తాము. వినయపూర్వకమైన నిస్వార్ధ సేవలో జీవిస్తాము.
4. మనం పారదర్శక క్రైస్తవులుగా మారాలి. మన చుట్టూ ఉత్థాన క్రీస్తు వెలుగును ప్రసరింప జేయాలి. నిస్వార్ధమైన, త్యాగపూరితమైన ప్రేమ, దయ, కరుణ, వినయము, సేవ కలిగి జీవించాలి. క్రైస్తవ దాతృత్వం, దయ, క్షమాపణ కలిగి జీవించాలి.

No comments:

Post a Comment