15వ సామాన్య ఆదివారము, Year C

 15వ సామాన్య ఆదివారము, Year C
ద్వితీయ 30:10-14; కొలోస్సీ 1:15-20; లూకా 10:25-37


యేసు యెరూషలేమునకు తన ప్రయాణాన్ని కొనసాగించుచుండగా, మార్గమధ్యలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసును పరీక్షింప ప్రయత్నించాడు. ‘నిత్యజీవము పొందుటకు నేనేమి చేయవలయును?’ (లూకా. 10:25) అని ప్రశ్నించాడు. మత్తయి (22:34-40), మార్కు (12:28-34) సువార్తల ప్రకారం, ‘ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?’ అని ప్రశ్నించాడు. అందుకు యేసు, ద్వితీయ. 6:5 ప్రకారం దేవుడైన ప్రభువును ప్రేమించాలని, లేవీ. 19:18 ప్రకారం పొరుగువారిని ప్రేమించాలని సమాధానమిచ్చారు.

యేసు దేవుని వాక్యంవైపునకు మనలను నడిపిస్తున్నారు. దేవుని వాక్యములో, దేవున్ని చవిచూడగలమని, కావలసిన సమాధానం దొరుకుతుందని తెలియజేయుచున్నారు. నేటి మొదటి పఠనం (ద్వితీయ 30:10-14), మోషే ప్రజలకు తన వీడ్కోలు సందేశములో చివరిగా ఇచ్చిన సూచనలో భాగం. ప్రభువుకు విధేయులై, లిఖింపబడిన ఆజ్ఞలనెల్ల పాటించాలని తెలియజేయు చున్నాడు. మొదటి పఠనం, దేవుని వాక్యానికి కట్టుబడియుండే ప్రాముఖ్యతను తెలియజేయుచున్నది. దేవుడు సజీవుడని, ఎల్లప్పుడు మనకు దగ్గరగా ఉన్నాడని తెలియజేయుచున్నది. “మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైన, ఎంత గొప్పజాతి జనులకైన వారి దేవుడు మన దేవునివలె చేరువలోనున్నాడా?” (ద్వితీయ. 4:7). కనుక, దేవుని వాక్కును విధేయించాలి ఎందుకన, అది మన జీవితాలకు మూలం, ఆధారం. తన వాక్కుతోనే, దేవుడు తననుతాను మనకు బహిర్గత మొనర్చుకున్నారు. “ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు పాటింపుడు” (ద్వితీయ. 30:14). రెండవ పఠనంలో కూడా (కొలోస్సీ 1:15-20), దేవుడు మన దరిలోనే ఉన్నారని, తన కుమారుడైన యేసు క్రీస్తుద్వారా, మనలో వసిస్తున్నారని, పౌలుగారు గుర్తుకు చేయుచున్నారు. కనుక, దేవున్ని ప్రేమించడమనగా, ఆయన వాక్కును ప్రేమించడం! ఆ వాక్కు యేసు క్రీస్తు ప్రభువే! ఆయన ప్రతీరోజు మనతో మాట్లాడుచున్నారు.

అయితే, ఇచ్చట, నేటి సువార్తలో ప్రభువు వెంటనే ఆ ధర్మశాస్త్ర బోధకునికి సమాధానమివ్వక, “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి యున్నది? అది నీకెట్లు అర్ధమగుచున్నది?” (లూకా. 10:26) అని తిరుగు ప్రశ్నవేసారు. అందుకు అతడు ద్వితీయ. 6:5 ప్రకారం దేవుడైన ప్రభువును ప్రేమించాలని మరియు పొరుగువారిని ప్రేమించాలని సమాధానమిచ్చాడు (లూకా. 10:27). ద్వితీయ. 6:5, యూదులకు అతి ప్రాముఖ్యమైన ప్రార్ధన. యేసు కాలములో, దీనిని రోజుకు రెండుసార్లు ప్రార్ధించేవారు. నిత్యజీవము పొందుటకు దైవప్రేమ-సోదరప్రేమ కలిగి జీవించుట అవసరమని స్పష్టం చేయబడింది. అప్పుడు యేసు అతనితో, “అటులనే చేయుము. నీవు జీవింతువు” (లూకా. 10:28) అని చెప్పారు.

అయితే, ఆ ధర్మశాస్త్ర బోధకుడు తననుతాను సమర్ధించుకొనుటకై, ‘నా పొరుగువాడు ఎవడు?’ (లూకా. 10:29) అని యేసును ప్రశ్నించాడు. యేసు కాలపు సమాజములో, యూదులు-అన్యులు, స్త్రీలు-పురుషులు, పవిత్రులు-అపవిత్రులు అని వ్యత్యాసాలు ఉండేవి. ఈ సందర్భముగా అతను అడిగిన ప్రశ్న ప్రభువును ఇరకాటములో పెట్టె ప్రశ్నయే! కాని యేసు చక్కటి ‘మంచి సమరీయుని ఉపమానము’తో (లూకా. 10:30-37) సమాధానము ఇచ్చాడు. ఇది కేవలము లూకా సువార్తలో మాత్రమే ప్రస్తావించబడినది.

యెరూషలేమునుండి యెరికో నగరమునకు మధ్య దూరం 27 కి.మీ. రాళ్ళురప్పలతో ఇరుకైన మార్గం కనుక ప్రయాణీకులనుండి దోచుకొనుటకు వీలుగా ఉండేది. ఉపమానములో ప్రయాణికుడు “ఒకానొకడు” అని చెప్పబడింది. ఎందుకన, ప్రేక్షకులు ఆ వ్యక్తి యూడులతోనైన, అన్యులతోనైన పోల్చుకోగలరు. దాడిచేసిన తరువాత, ఆ వ్యక్తిని కొన ఊపిరితో విడిచి పోయారు. ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచూ, వానిని చూచియు, ఏ సహాయము చేయక తప్పుకొని పోయాడు. ఒక లేవీయుడు అటుగా వెళ్ళుచూ, వానిని చూచి, యాజకుని వలెనె తొలగి పోయెను. లేవీయుడు దేవాలయములో సహాయం చేసేవాడు. అతను బ్రతికున్నాడో, లేదోయని కూడా పట్టించుకొనకుండా అక్కడనుండి వెళ్ళిపోయారు. మూడవ వ్యక్తి... బహుశా యేసు శ్రోతలు ఒక ఇస్రాయేలీయుడు అయుండవచ్చని భావించి యుండవచ్చు. కాని ఆ మూడవ వ్యక్తి ఇస్రాయేలీయులకు అత్యంత శత్రువుగా భావించబడే సమరీయుడు. ఇస్రాయేలీయులు సమరీయులను అసహ్యించుకొనేవారు. వారితో ఎలాంటి పొత్తు ఉండేది కాదు. సమరీయులు ఉత్తర రాజ్యానికి చెందిన యూదుల వారసులే! కాని వారు అన్యులను వివాహ మాడారు మరియు వారు యెరూషలేములో ఆరాధనలు చేయరు. అలాంటి ఒక సమరీయుడు, గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళడం మాత్రమేగాక, గాయాలను శుభ్రముచేసి, కట్టుకట్టి, తన వాహనముపై కూర్చుండబెట్టి, సత్రమునకు తీసుకొనిపోయి, పరామర్శించాడు. అతని ఖర్చులన్నీ తానే చెల్లిస్తానని వాగ్దానం చేసాడు. ఈవిధముగా, అసహ్యించుకొనబడేవాడు, పొరుగువాడు అయ్యాడు.

మన మతం, కులం, జాతి, దేశం, వర్ణం, వర్గం, ప్రాంతం, మగ, ఆడ ఇవేమీ కూడా మన పొరుగువారిని నిర్వచించకూడదని యేసుప్రభువు తెలియజేయుచున్నారు. యూదులు కేవలం తోటి యూదులను మాత్రమే పొరుగువారిగా భావించేవారు. ఒకరిపట్ల కరుణతో ప్రవర్తించే వ్యక్తి పొరుగువాడు. అందరిని కరుణతో చూసేవాడు పొరుగువాడు. ఉపమాన అనంతరం, “పై ముగ్గురిలో, దొంగల చేతిలో పడినవానికి పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు ప్రశ్నించగా, ఆ ధర్మశాస్త్ర బోధకుడు, సమరీయుడు అని చెప్పక ‘కనికరము చూపినవాడే’ అని సమాధాన మిచ్చాడు. అప్పుడు యేసు అతనితో “నీవు వెళ్లి అటులనే చేయుము” అని పలికారు.

నా పొరుగువారు ఎవరు? అని ప్రశ్నించుకుందాం! సమాధానం మన అంత:రంగమునుండి రావాలి. నా పొరుగువారు ఎవరు? నా మతం వాడేనా? నా కులం వాడేనా? నా జాతివాడేనా? నా వర్గం వాడేనా? నా ప్రాంతం వాడేనా? ఎవరు నా పొరుగువారు? ఆత్మపరిశీలన చేసుకుందాం! సర్వమానవాళి దేవుని సృష్టియేనని, అందరం దేవుని బిడ్డలమేనని, సోదరులమేనని, అందరూ నా పొరుగువారేనని భావిస్తున్నామా!

“నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను?” అని మనతో ఎవరైనా అంటే మన ప్రతిస్పందన ఏమిటి? ‘సరే’ అని చెప్పగల మంచి మనస్సు మనకు ఉన్నదా? (నేటి ఆసుపత్రులలో పూర్తి బిల్లు చెల్లిస్తేనే చికిత్స మొదలుపెడతారు).

దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామా? దైవాజ్ఞలను పాటిస్తున్నామా? మంచి సమరీయునివలె, యేసు మనకు చేరువలోనే ఉన్నారని నమ్ముచున్నామా? ఆయన మన ప్రతీ అవసరములో తోడుగా ఉంటారు. మన పొరుగువారిద్వారా , ప్రభువు మన చేరువలో, మనకు సహాయం చేయడానికి ఉన్నారని విశ్వసిస్తున్నామా? మనం ఇతరులకు మంచి సమరీయులుగా మారుటకు సిద్ధముగా ఉన్నామా? ఎవరైనా ఆపదలో, ప్రమాదములో ఉంటె, సెల్ఫీలు, విడీయోలు తీసి ఆనందపడుచున్నామా లేక వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళుచున్నామా? అవసరతలోనున్న వారికి చేయూత నివ్వడానికి సిద్ధముగా ఉన్నామా?

No comments:

Post a Comment