తపస్కాల మూడవ ఆదివారము, YEAR B, 7-3-2021

తపస్కాల మూడవ ఆదివారము, YEAR B, 7-3-2021

నిర్గమ కాండము 20: 1-17; 1 కొరి 1:22-25; యోహాను 2:13-25

మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు పరిశుభ్రముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి, ప్రతి వస్తువును చక్కబెట్టుకొంటాం. ప్రతీ రోజు స్నానాలు చేస్తూ ఉంటాం. మురికి అయిన దుస్తువులను ఉతుకుతూ ఉంటాం. మన చుట్టూఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కొంతమంది తమనుతాము శుభ్రముగా ఉంచుకోవడానికి గంటల తరబడి సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. కారణం, ఎవరుకూడా మురికి, వాసన వచ్చే విధముగా ఉండటానికి ఇష్టపడరు. మనం మురికిలో జీవిస్తే, తరువాత అది అనేక వ్యాధులకు దారి తీస్తూ ఉంటుంది. ఒక్కసారి జబ్బుపడితే, అది మన ప్రాణాలకే ప్రమాదముగా తయారవుతుంది. కనుక, శారీరక పరిశుభ్రత, మన చుట్టూఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రముగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.

దేవుని ఒడంబడిక - దేవుని ఆజ్ఞలు

ఈనాటి పఠనాలు, మనం క్రీస్తు విశ్వాసులుగా మన ఆధ్యాత్మిక జీవితములో ఏవిధముగా పరిశుభ్రముగా ఉండాలో నేర్పుచూ ఉన్నాయి. మొదటి పఠనములో, యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏర్పరచుకున్న ఒడంబడికను గూర్చి వినియున్నాము. ఈ ఒడంబడిక ద్వారా యావే దేవుడు మనలను పరిశుద్ధ జీవితమునకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఒడంబడిక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకేకాక, ఈనాడు ప్రతీ వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉన్నది. మనం దేవుని దృష్టిలో పరిశుభ్రముగా, పవిత్రముగా ఉండటానికి దేవుడు పది ఆజ్ఞలను మోషే ప్రవక్త ద్వారా ఇచ్చియున్నాడు. తన ఒడంబడిక ద్వారా యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని యున్నాడు. వారిని ఇతర జాతులతో కలవకుండా కాపాడ గలిగాడు. ఇతర దేవుళ్ళనుండి వారిని కాపాడాడు. ఈ ఒప్పందం ద్వారా, వారిని తన బిడ్డలుగా చేసుకొని, పరిశుద్ధమైన, సక్రమైన మార్గములో వారికి తోడుగా ఉంటూ, వారిని ముందుకు నడిపించాడు. కనుక మనం కూడా ఈనాడు ఈ పది ఆజ్ఞలను లేక ఈ ఒడంబడికను ఒక ఆహ్వానముగా స్వీకరించి, దానికి అనుగుణముగా నడచుకోవడానికి ప్రయత్నం చేయాలి. "నిత్యజీవాన్ని పొందగోరినచో దైవాజ్ఞలను అనుసరింపుము" (మత్తయి 19:17) అని క్రీస్తుప్రభువు ధనికుడగు యువకునితో చెప్పియున్నాడు. ఆ పది ఆజ్ఞలే ఈ దైవ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించి, నిత్యజీవితములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం.

దేవునిచట్టం లేదా పది ఆజ్ఞలు మనం జ్ఞానములో జీవించాలని ఇవ్వబడ్డాయి. దేవునితో మన బంధం బలపడాలని ఇవ్వబడ్డాయి. సామాజికముగా, ఆధ్యాత్మికముగా జీవించడానికి ఇవ్వబడ్డాయి. మన ఆధ్యాత్మిక జీవితానికి పది ఆజ్ఞలు మూలం. ఈ విధముగా దేవుని ఆజ్ఞలు మనలను ఒక సంఘముగా జీవించులాగా చేస్తాయి. దేవుని ఆజ్ఞలను పాటించు సంఘము దేవుని ఆరాధనలో బలపడును. ఒకరితోఒకరు సఖ్యతతో, శాంతితో జీవించును. ఒకరినొకరు గౌరవించు కొనును. పాత ఒప్పందం మోషే ద్వారా ఇవ్వబడితే, నూతన ఒప్పందము క్రీస్తు ద్వారా ఒసగబడినది మరియు క్రీస్తునందు పరిపూర్ణము చేయబడినది. క్రీస్తు ద్వారా దేవుడు మనలను స్వీకరించును, ప్రేమించును. క్రీస్తు ధర్మశాస్త్రమును పరిపూర్ణము చేసియున్నాడు కనుక, ఆయన దేవుని శక్తియును, జ్ఞానమునై యున్నాడు కనుక, మన జీవితాలను క్రీస్తుకు అంకితం చేసుకుందాం! క్రీస్తును కనుగొని, ఆయనను స్వీకరించువారు జ్ఞానముతో నింపబడతారు. "క్రీస్తును అనుసరించువారు, అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును" (యోహాను 8:12). చీకటి, జ్ఞానమునకు వ్యతిరేకం. కనుక క్రీస్తు లేనిచో, చీకటిలో జీవించడమే!

సువిశేషము - ధ్యానము:

ఈనాటి సువిషేశములో మనం చదువుకున్న యేరూషలేము దేవాలయ పరిస్థితిని, మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. కొన్నికొన్ని దేవాలయ పండుగలలో ఈ దృశ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. దేవుని పండుగలు, దేవాలయ ఆవరణాలు, వ్యాపార స్థలాలుగా చేయబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ పండుగ నిజమైన అర్ధాన్ని కూడా మరిచిపోతూ ఉంటాం. ప్రార్ధన, దైవభక్తి, సోదరప్రేమ, సేవ, నిజాయితీగా ఉండవలసిన ఆలయాలు, గుడులు, వ్యాపార స్థలాలుగా మారుతూ ఉన్నాయి. పండుగ పేరు చెప్పి అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులనే యేసు తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవాలయము అనునది ప్రార్ధన చేసుకోవడానికి, దేవున్ని కనుగొనడానికి, ఆయన సన్నిధిలో జీవించడానికి అని మనం మరువ కూడదు. ఏ దేవాలయము అయినా, దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని మరచినట్లయితే, చివరకు అది వినాశనమునకు దారి తీస్తూ ఉంటుంది. పుణ్యకేంద్రముగా కాక పాపకేంద్రముగా తయారవుతూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వ్యాపారము చేసేవారందరినీ అక్కడనుండి పంపి వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. "వీనిని ఇక్కడనుండి తీసికొని పొండు" (మత్తయి 2:16) అను ఈ వాక్యం మన ఆలయాలలో భక్తిని, గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. మన దేవాలయాలను దేవునికి ప్రతి బింబాలుగా గుర్తించి గౌరవ మర్యాదలతో నడచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

యేసు యేరూషలేము దేవాలయమునుండి అన్ని రకాల వ్యాపారస్తులను పార ద్రోలడాన్ని చూచి, యూదా ప్రజలు అరాచకానికి గురయ్యారు. అంతేకాకుండా, వారు యేసును తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఒక గుర్తును కూడా అడుగుతూ ఉన్నారు. కాని యేసు సమాధానం "ఈ ఆలయాన్ని మీరు పడగొట్టుడు, నేను దీనిని మూడు దినాలలో తిరిగి నిర్మించెదను" అని వారికి సమాధానమిచ్చాడు. ఇక్కడ యేసు తన దేహాన్ని గురించి చెప్పుచున్నాడు. యేరూషలేము దేవాలయములో క్రీస్తు పారద్రోలిన వ్యాపారస్తులందరూ కూడా పాతనిబంధన ఒడంబడికను తుడిచి వేయడాన్ని సూచిస్తూ ఉన్నది. పాతనిబంధన ఒడంబడిక ఈ నూతన ఒడంబడికతో తుడిచి వేయబడుచున్నది. ఈ నూతన ఒడంబడిక క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా సాధ్యమగుచున్నది. ఈ కారణం చేతనే క్రీస్తు శరీరమునే నిజమైన దేవాలయముగా చూస్తూ ఉన్నాం. మానవ రక్షణ కార్యములో క్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు ఫణముగా పెట్టి, తన రక్తం ద్వారా మనలను రక్షించు కున్నాడు. తన సిలువ మరణము ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. పాత ఒడంబడికలో జంతురక్తాన్ని చిందిస్తే, ఈ నూతన ఒడంబడికలో క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనలను తన బిడ్డలుగా చేసుకొంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తు శరీరమును ఒక దేవాలయముగా చూస్తూ ఉన్నాము.

క్రీస్తు శరీరము, అనగా మరియొక విధముగా కూడా మనం అర్ధం చేసుకోవాలి. అదే "తిరుసభ" లేక "శ్రీసభ" (మన శరీరము, మన కుటుంబము, మన సంఘము...). క్రీస్తు నామములో జ్ఞానస్నానము పొందిన ప్రతీ వ్యక్తి కూడా ఆయన శరీరములో ఒక భాగముగా చేయబడుతూ ఉన్నారు. "మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరమూ ఒకే శరీరము" (రోమీ 12:5). క్రీస్తు ప్రభు యేరూషలేము దేవాలయాన్ని ఏవిధముగా ప్రార్ధనాలయముగా గుర్తించి దానిని పరిశుభ్ర పరిచారో అదే విధముగా తిరుసభను కూడా మనం రక్షించుకోవాలి. అనేకమైన సైతాను శక్తులు, ప్రాపంచిక విషయాలు క్రీస్తుసంఘం అయిన తిరుసభను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కనుక ప్రతీ క్రైస్తవుడు కూడా శ్రీసభ రక్షణలో పాలుపంచు కోవడానికి ప్రయాస పడాలి. "క్రీస్తు తన శరీరము అయిన శ్రీసభకు శిరస్సు" (కొలస్సీ 1:18). కనుక ఆయన శరీరములోని వేరువేరు అవయవాలుగా, ఆయన నుండి వచ్చే శక్తిని, బలాన్ని స్వీకరిస్తూ మనల్ని మనం పవిత్రముగా ఉంచుకొంటూ శ్రీసభను పరిశుద్ధముగా చేయడానికి ప్రయత్నించాలి.

మన దేహము పరిశుద్దాత్మకు ఆలయము. ఎంత అద్భుతం! అందుకే పునీత పౌలుగారు "మీరు ఆత్మయందు జీవింపుడు" (గలతీ 5:16) అని చెప్పుచున్నాడు. రెండవ పఠనములో చెప్పబడి నట్టుగా మనం "సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు చున్నాము" (1 కొరి 1:23) కనుక క్రీస్తు సిలువ మనలను పరిశుద్దులునుగా చేస్తుంది. కనుక మన దేహములతో వ్యాపారాలు చేయకూడదు. మన హృదయాలను, ఆలోచనలను వ్యాపార స్థలములుగా మార్చకూడదు. మన శరీరం దేవుని ఆలయం. కనుక దేవునకు ప్రధమ స్థానాన్ని ఇవ్వాలి. సైతాను శోధనల నుండి దానిని కాపాడాలి. దీనిని పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము ద్వారా మాత్రమే సాధించ గలం.

కావున, నేడు అలయమనే మనే హృదయాలను శుభ్రపరచుకుందాం. దేవునికి సమర్పించుకుందాం. దేవుని ఆజ్ఞలను పాటిస్తామని వాగ్దానం చేద్దాం.

తపస్కాల మూడవ ఆదివారం క్రీస్తు ఏర్పాటు చేసిన నూతన ఒడంబడికను మనకు గుర్తుచేస్తూ ఉంది. క్రీస్తును అనుసరించి మనం కూడా పాపాన్ని త్యజించి, పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రయాస పడుదాం. మన స్వార్ధాన్ని వీడి, ఇతరులను ప్రేమిస్తూ, సేవిస్తూ జీవించుదాం. కారణం, "కేవలము విశ్వాసము వలన మాత్రమే కాక, చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును" (యాకోబు 2:24). మన విశ్వాసాన్ని క్రియల రూపములోనికి మార్చమని, మనలను పరిశుద్డులుగా, పవిత్రులుగా చేయమని ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment