పునీత బెతానియా మార్తమ్మ, జూలై 29

 పునీత బెతానియా మార్తమ్మ, జూలై 29
కన్య (క్రీ.శ. – 84)

“యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని [మరియమ్మ], లాజరును ప్రేమించెను” (యోహాను. 11:5). ఈ వాక్యం యేసుకు ఈ కుటుంబముతో నున్న సన్నిహిత సంబంధాన్ని వెల్లడి చేయుచున్నది. ఈ కుటుంబము యూదయా సీమలోని బెతానియా గ్రామములో నివసించేది. యెరూషలేము నుండి రెండు మైళ్ళ (క్రొసెడు) దూరం (11:18). యేసు యూదయా సీమకు వెళ్ళినప్పుడెల్ల, ఈ కుటుంబాన్ని సందర్శించేవారు. శ్రమలకు ముందు కూడా కొన్ని రోజులు ప్రభువు ఈ కుటుంబముతో గడిపాడు. సువార్తలలో ప్రభువు ఈ కుటుంబాన్ని మూడు సార్లు సందర్శించినట్లు తెలియుచున్నది.

మొదటిగా, లూకా. 10:38-42లో చూడవచ్చు. యేసును తన శిష్యులను మార్తమ్మ తన ఇంటికి ఆహ్వానించినది. బహుశా, మార్తమ్మ ముగ్గురిలో పెద్దదై యుండవచ్చు. అందుకే, “మార్తమ్మ పెక్కు పనులతో సతమత మగుచు” ఉండేది. కష్టజీవి అని, అతిధి మర్యాదలు, పరిచర్యలు చేయడములో దిట్ట అని అర్ధమగుచున్నది. ఆకాలములో అచ్చట ఆతిధ్యం చాలా ముఖ్యమైనది. మార్తమ్మ దీనిని గుర్తించినది. నేడు మనం ‘అతిధి దేవోభవ’ అంటున్నాం కదా! అందుకే, తన సోదరి ఆతిధ్య నియామాన్ని విస్మరించినదని తలంచి మార్తమ్మ నిరాశతో, “ప్రభూ! నా సహోదరి పనులన్నియు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు” అని యేసుతో పలికినది. అప్పుడు యేసు ఆమెతో, “మార్తమ్మా! మార్తమ్మా! నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. అది ఆమె నుండి తీసివేయ బడదు” అని సమాధానమిచ్చెను. కొన్నిసార్లు మనం కూడా లోకములోనున్న పనులన్నీ మనమే చేయాలి అన్నట్లుగా ఆందోళన పడుతూ, యేసుతో సమయాన్ని గడపడం (ప్రార్ధన) మరచిపోతూ ఉంటాము.

రెండవదిగా, యోహాను. 11:1-53లో చూడవచ్చు. ప్రభువు పైనచెప్పిన సందేశాన్ని మార్తమ్మ త్వరగానే గ్రహించినది. ఇక్కడ మార్తమ్మ గొప్ప విశ్వాసి అని తెలియుచున్నది. తన సోదరుడు లాజరు మరణించినప్పుడు, ప్రభువు బెతానియాకు వచ్చాడని తెలియగానే, ఇంటినిండా ఉన్న అతిధులను విడచి, ప్రభువును కలుసుకోవడానికి పరిగెత్తింది. “యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటియందే కూర్చుండి ఉండెను.” మార్తమ్మ యేసుతో, “ప్రభూ!మీరు ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియును” అని అనెను. ఇది ఆమె దృఢమైన విశ్వాసానికి, ధైర్యానికి తార్కాణం. అందుకు ప్రభువు, “నేనే పునరుత్థాణమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?” అని మార్తమ్మను ప్రశ్నించినపుడు, “అవును ప్రభూ! లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించు చున్నాను” అని తన విశ్వాసాన్ని ప్రకటించినది. మార్తమ్మ యేసు శక్తిని, ఆయన పునరుత్థాణమును, ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించినది. ఆమె విశ్వసించినటులనే, ప్రభువు మరణించిన ఆమె సోదరుడు లాజరును మృతులలో నుండి లేపాడు.

మూడవదిగా, యోహాను. 12:1-9లో చూడవచ్చు. తన సన్నిహిత కుటుంబముతో భోజనము చేయడానికి యేసు మరల బెతానియాకు తిరిగి వచ్చాడు. పాస్కపండుగకు ఆరు రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. ఈ సమయములోనే మార్తమ్మ సోదరి మరియమ్మ విలువైన, స్వచ్చమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును శేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి, తన తలవెంట్రుకలతో తుడిచెను. లాజరు పునర్జీవము పొందిన తరువాత, యూదులు యేసుపై ఎక్కువ కుట్ర చేసిరి. ఆయనను బంధించుటకై ప్రయత్నించిరి. మరియమ్మ, పరిమళ ద్రవ్యములతో హడావిడి చేసింది. కాని, మార్తమ్మ ఎలాంటి హడావిడి చేయలేదు. యేసుకు పరిచర్యలు చేసింది.

మార్తమ్మ తరువాత జీవితం గురించి మనకు ఎటువంటి సమాచారం లేదు. ఒక సంప్రదాయం ప్రకారం, పెంతకోస్తు తరువాత ఈ కుటుంబము ఫ్రాన్సు దేశానికి వెళ్లి, అక్కడ సువార్తను బోధించినట్లుగా తెలియుచున్నది. ఏదేమైనను, ఈ కుటుంబము ప్రభువుకు [సువార్త] ‘పరిచర్యలు’ చేసిందనడములో అతిశయోక్తి లేదు!

ప్రార్థన:

పునీత మార్తమ్మగారా! యేసును మిక్కిలిగా సేవించుటకు మాకొరకు ప్రార్ధన చేయండి.

మేము ప్రభువు వాక్యమును ఆలకించుటకు, ఆయనతో ఉండుటకు,

మేము మా ఆందోళనలను, శోధనలను అధిగమించుటకు సహాయం చేయండి. ఆమెన్.

No comments:

Post a Comment